ధనుష్ కేవలం తన డ్రెస్ సరి చేయడానికే ఓ అసిస్టెంట్ను పెట్టుకున్నాడా.. సోషల్ మీడియాలో విమర్శలు.. సమర్థిస్తున్న ఫ్యాన్స్
ధనుష్ కేవలం తన డ్రెస్ సరి చేయడానికే ఓ అసిస్టెంట్ ను పెట్టుకున్నాడా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆమె అతని డిజైనర్ అని, ఆమెతో కలిసి లంచ్ కూడా చేశాడంటూ మరో వీడియోను రిలీజ్ చేశారు పలువురు ఫ్యాన్స్.
బాలీవుడ్ మూవీ 'తేరే ఇష్క్ మే' ప్రమోషన్లలో నటుడు ధనుష్ బిజీగా ఉన్నాడు. ముంబై సహా పలు నగరాల్లో తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన ఒక ఈవెంట్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కేవలం తన దుస్తులను సరిచేయడానికే ధనుష్ ఒక అసిస్టెంట్ ను నియమించుకున్నారని కొందరు నెటిజన్లు ఆరోపించగా.. అతని అభిమానులు వెంటనే స్పందించి వాస్తవాలను బయటపెట్టారు.

ధనుష్ వీడియో ఇలా..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ధనుష్ ఒక ఈవెంట్ కోసం కారు దిగి నిలబడి ఉంటాడు. అతని వెనుక నుంచి ఒక అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చి అతని ప్యాంట్ను సరిచేస్తుంది. ఆ తర్వాత షర్ట్ను కూడా సరిచేస్తూ అతని వెనకే ఉంటుంది. ధనుష్ మాత్రం ఆమెను గమనించనట్లుగా ముందుకు సాగిపోయాడు.
ఈ వీడియోను షేర్ చేస్తూ.. "అతని అవుట్ఫిట్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవడానికి అసిస్టెంట్ ఎలా పరుగెడుతుందో చూడండి" అని క్యాప్షన్లు పెట్టారు. మరొకరు స్పందిస్తూ.. "ప్యాంట్ సరిచేయడానికి కూడా ఒక మనిషిని పెట్టుకున్నాడు" అని విమర్శించారు. ఇంకొకరు స్పందిస్తూ.. "అత్యంత దారుణం" అంటూ థంబ్స్ డౌన్ ఎమోజీతో ట్వీట్ చేశారు.
ధనుష్ను సమర్థించిన ఫ్యాన్స్
ఈ వీడియోపై విమర్శలు, ట్రోలింగ్ పెరగడంతో ధనుష్ అభిమానులు రంగంలోకి దిగారు. వీడియోలో ఉన్నది ఎవరో పనిమనిషి కాదని, ఆమె ధనుష్ పర్సనల్ స్టైలిస్ట్ కావ్య శ్రీరామ్ అని స్పష్టం చేశారు.
అంతేకాకుండా ధనుష్, కావ్య శ్రీరామ్, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్, హీరోయిన్ కృతి సనన్ కలిసి భోజనం చేస్తున్న మరో వీడియోను షేర్ చేశారు. "కావ్య ఆయన డిజైనర్. ఆమె తన పనిని ఇష్టపూర్వకంగా చేస్తోంది. ధనుష్ తన టీమ్ సభ్యులను స్నేహితుల్లా చూస్తారు.. కింద ఉన్న వీడియోలో వారు కలిసి భోజనం చేస్తున్నారు చూడండి. అందుకే వారి మధ్య ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కొందరు మూర్ఖులకు ఈ చిన్న విషయం అర్థం కాదు" అని ఒక అభిమాని మండిపడ్డారు.
మరొకరు స్పందిస్తూ.. "ఆమె పేరు కావ్య. ఆమె ధనుష్ కాస్ట్యూమ్ డిజైనర్ కాబట్టి తన పని తాను చేస్తోంది. వారిద్దరి మధ్య స్నేహపూర్వక బంధం ఉంది. నిజాయితీగా చెప్పాలంటే.. ఒక కాస్ట్యూమ్ డిజైనర్కు ఇంత గౌరవం ఇచ్చే నటుడిని మీరు ఎక్కడైనా చూశారా?" అని ప్రశ్నించారు.
"నటుడికి, సిబ్బందికి మధ్య ఇంతటి గౌరవప్రదమైన బంధం చూడటం చాలా ఆనందంగా ఉంది. వాస్తవాలు తెలియకుండా విషం చిమ్మడం ఆపండి" అని మరొకరు హితవు పలికారు. ఫోటోలు తీస్తున్నప్పుడు నటుడి లుక్ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవడం స్టైలిస్ట్ బాధ్యత అని, ఆమె అదే చేసిందని మరికొందరు సమర్థించారు.
ఇక ధనుష్ ఈ ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తమిళ-తెలుగు మూవీ ‘కుబేర’లో నటించాడు. తాజాగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన 'తేరే ఇష్క్ మే' గత శుక్రవారం (నవంబర్ 28) థియేటర్లలో విడుదలైంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


