పీరియడ్స్ నొప్పితోనూ ఆ డ్యాన్స్ చేశానంటే నవ్వారు.. రేప్ చేస్తామంటూ ప్రతి రోజూ బెదిరింపులు వస్తుంటాయి: ధురంధర్ నటి
బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న బాడీ షేమింగ్ మరియు వేధింపులపై గళమెత్తారు. ఇన్ స్టాగ్రామ్ లో తనను ప్రతిరోజూ ఒక లైంగిక వస్తువులా చూస్తున్నారని, చివరికి రేప్ బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ధురంధర్ మూవీలో షరారత్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. గతేడాది ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ఆ పాపులర్ సాంగ్తో అలరించిన నటి ఆయేషా ఖాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు పంచుకుంది. 'వీ ది ఉమెన్' (We The Women) కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న వివక్షను, సోషల్ మీడియాలో ఎదురవుతున్న భయానక వేధింపులను వివరించింది.

లావుగా ఉన్నానని వద్దన్నారు
తాను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే టి-సిరీస్ రూపొందించే ఒక పాటలో సెకండ్ లీడ్ గా అవకాశం వచ్చిందని ఆయేషా ఖాన్ తెలిపింది. అయితే షూటింగ్ కి సరిగ్గా ఒకరోజు ముందు ఆమె "లావుగా" ఉందనే కారణంతో ఆ అవకాశం నుంచి తొలగించారని ఆమె గుర్తు చేసుకుంది. అప్పటి నుండి తన రూపం పట్ల ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆమె పేర్కొంది.
సోషల్ మీడియా వేధింపులు - రేప్ బెదిరింపులు
ఇన్ స్టాగ్రామ్ లో తాను ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ ఫోటో పెట్టినా కొందరు నెటిజన్లు తనను కేవలం ఒక లైంగిక వస్తువులాగే చూస్తున్నారని ఆమె వాపోయింది. "నేను నార్మల్ టాప్ వేసుకున్నా, స్కర్ట్ వేసుకున్నా సమస్యే. ఏదైనా పోస్ట్ చేయాలంటే భయపడాల్సి వస్తోంది. ప్రతిరోజూ నాకు రేప్ బెదిరింపులు వస్తున్నాయి. ఇవి కేవలం కామెంట్లే కాదు, మన చుట్టూ తిరుగుతున్న వ్యక్తుల మనస్తత్వాలు. నేను ఒకవేళ సెలబ్రిటీని కాకపోయి ఉంటే, ఈ బెదిరింపులకు పాల్పడేవారు నన్ను నిజంగానే ఏమైనా చేసేవారేమో అని భయమేస్తోంది" అని ఆయేషా ఆందోళన వ్యక్తం చేసింది.
పీరియడ్స్ వ్యాఖ్యలపై ట్రోల్స్
గతంలో పీరియడ్స్ సమయంలో పనిచేయడం గురించి తను చేసిన వ్యాఖ్యలను మీమ్స్ గా మార్చి ఎగతాళి చేయడంపై కూడా ఆమె స్పందించింది. ధురంధర్ మూవీలోని షరారత్ సాంగ్ ను తాను పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేశానని, ఆ నొప్పిని భరించానని గతంలో ఆమె చెప్పింది. దీనిపైనా నవ్వారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
"నా పీరియడ్స్ గురించి జోకులు వేయడం దేశవ్యాప్త అంశం అయిపోయిందా? మన కొడుకులకు, సోదరులకు ఈ విషయంలో సరైన అవగాహన కల్పించాలి. పీరియడ్స్ సమయంలో మహిళలు ఎంత కష్టపడతారో మగవారికి అర్థం కాదు. ఆ సమయంలో నేను పనిచేసినందుకు గర్వపడుతున్నాను" అని ఆమె బదులిచ్చింది.
ఆయేషా ఖాన్ నేపథ్యం
టెలివిజన్ రంగంలో జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయేషా.. 'కసౌతీ జిందగీ కే', 'బాల్ వీర్ రిటర్న్స్' వంటి సీరియళ్లలో నటించింది. తెలుగులో 'ముఖచిత్రం' సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ 17 ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఇటీవల కపిల్ శర్మ మూవీ 'కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2' లోనూ ఆమె కనిపించింది. ఇక రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్' సీక్వెల్ మార్చి 19న విడుదల కానుంది. గతేడాది వచ్చిన ధురంధర్ ఏకంగా రూ.1300 కోట్లకుపైగా వసూలు చేయడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

E-Paper












