The Kerala Story 2: బీఫ్ పరోటా బాగుంటుంది.. ఇదో బుల్ షిట్ ట్రైలర్: ది కేరళ స్టోరీ 2పై మరోసారి డైరెక్టర్ షాకింగ్ కామెంట్
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మరోసారి ది కేరళ స్టోరీ 2 (The Kerala Story 2) మూవీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మూవీ ట్రైలర్లో బీఫ్ ను బలవంతంగా తినిపించే సీన్ పై గతంలోనే మాట్లాడిన అతడు.. తాజాగా తనకు బీఫ్ పరోటా అంటే ఇష్టమని అనడం విశేషం.
బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ 'ది కేరళ స్టోరీ 2' సినిమా ఒక ప్రాపగాండా మూవీ అని మరోసారి కుండబద్దలు కొట్టాడు. ఇటీవల కేరళలో జరిగిన 'ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్' వేడుకల సందర్భంగా మీడియాతో మాట్లాడిన అతడు.. బీఫ్ పరోటా (Beef parotta) చాలా అద్భుతంగా ఉంటుందని ప్రశంసించాడు. అలాగే త్వరలో విడుదల కానున్న ఈ వివాదాస్పద సినిమాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. అదొక బుల్ షిట్ ట్రైలర్ అని తేల్చి చెప్పాడు.

బీఫ్ పరోటా బెస్ట్ అన్న అనురాగ్ కశ్యప్
కేరళలో మీడియాతో మాట్లాడిన అనురాగ్ కశ్యప్.. "బీఫ్ పరోటా ఇక్కడ బెస్ట్" అని పేర్కొన్నాడు. మీరు కేవలం కేరళ పరోటా గురించి మాత్రమే మాట్లాడుతున్నారా అని విలేకరులు అడిగినప్పుడు.. అతడు మరింత స్పష్టత ఇస్తూ "బీఫ్ పరోటా. బీఫ్ పరోటా అనేది ఎప్పుడూ బెస్ట్" అని బదులిచ్చాడు.
మీకు బీఫ్ (గొడ్డు మాంసం) ఇష్టమా అని అడిగిన ప్రశ్నకు కూడా అతడు అవునని సమాధానం ఇచ్చాడు. ఈ రోజుల్లో 'బీఫ్ తినడం ఒక సమస్య కదా' అని గుర్తు చేసినప్పుడు.. "అది అస్సలు సమస్యే కాదు. నాకెలాంటి సమస్యా లేదు" అని ఆయన తేల్చి చెప్పాడు.
ఆ తర్వాత 'ది కేరళ స్టోరీ 2' సినిమా ట్రైలర్ గురించి విలేకరులు ప్రశ్నించగా.. "అదొక చెత్త ట్రైలర్" అని అతడు ఘాటుగా సమాధానమిచ్చాడు. "ఇది పక్కా ప్రొపగాండా సినిమా అని మీరు అనుకుంటున్నారా?" అని ఒకరు అడగగా, "కచ్చితంగా అవును" అని అతడు బదులిచ్చాడు.
ఏంటీ బీఫ్ వివాదం?
'ది కేరళ స్టోరీ 2' ట్రైలర్లో ఒక హిందూ యువతిని ముస్లిం కుటుంబంలోకి పెళ్లి చేసుకొని తీసుకెళ్లిన తర్వాత ఆమెకు బలవంతంగా బీఫ్ తినిపించే సన్నివేశాన్ని చూపించారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా మంది కేరళ ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. మరికొందరు దీనిపై మీమ్స్ కూడా క్రియేట్ చేశారు.
అవార్డుల ప్రదానోత్సవానికి వెళ్లే ముందు అనురాగ్ మీడియాతో మాట్లాడుతూ.. "ఇదొక చెత్త ప్రాపగాండా సినిమా. ఈ మూవీ ప్రజలను విడదీసి, వారి మధ్య విద్వేషాలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ సినిమా నిర్మాత ఒక అత్యాశపరుడు. సినిమాలో చూపిస్తున్నట్లుగా బీఫ్ను ఎవరూ అలా బలవంతంగా నోట్లో కుక్కరు కదా, కనీసం కిచిడీని కూడా ఎవరూ అలా తినిపించరు" అని అతడు ఎద్దేవా చేశాడు.
అనురాగ్ కశ్యప్పై 'ది కేరళ స్టోరీ 2' దర్శకుడి ఫైర్
అనురాగ్ కశ్యప్ చేసిన ఈ కామెంట్స్ పై మూవీ దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ తీవ్రంగా స్పందించాడు. ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థతో అతడు మాట్లాడుతూ.. "గత ఎన్నో ఏళ్లుగా అతడు తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. అతడు మానసికంగా చాలా బలహీనపడిపోయారు. అందుకే అతనికి నిజం కనిపించడం లేదు. మా సినిమాలో చూపించిన నిజంతో ఆయనకు సమస్య ఉందంటే, బహుశా ఆయనకు ఈ మొత్తం ప్రపంచంతోనే సమస్య ఉన్నట్లు లెక్క" అని కౌంటర్ ఇచ్చాడు.
'ది కేరళ స్టోరీ 2' మూవీ పూర్తిగా వాస్తవ సంఘటనల ఆధారంగానే తెరకెక్కిందని నారాయణ్ సింగ్ మరోసారి స్పష్టం చేశాడు. "మా సినిమాలోని ప్రతి సీన్ నిజమైన సంఘటనల ఆధారంగానే తీశాం. ఇది మాకు తెలుసు. ఒకవేళ అనురాగ్ కశ్యప్ గారు కోరుకుంటే, ఈ సినిమాకి సంబంధించిన పూర్తి పరిశోధనా పత్రాలను మేము ఆయన ఇంటికే పంపిస్తాం. కానీ ఆయనకు ప్రతి దాంట్లో తప్పులు వెతకడమే పని. వాస్తవాన్ని చూసే కళ్ళు ఆయనకు మూసుకుపోయాయి. ఆయన ఆ నిజాన్ని చూడటానికి గానీ, అర్థం చేసుకోవడానికి గానీ అస్సలు ఇష్టపడటం లేదు" అని సింగ్ మండిపడ్డాడు.
రిలీజ్కు ముందే స్క్రీనింగ్కు హైకోర్టు ఆదేశం
మరోవైపు శ్రీదేవ్ నంబూదిరి అనే 26 ఏళ్ల బయాలజిస్ట్ ఇటీవల 'ది కేరళ స్టోరీ 2' సినిమా విడుదలను నిలిపివేయాలని, దాని సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం (ఫిబ్రవరి 24) సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని హైకోర్టు మేకర్స్ను ఆదేశించింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను కూడా వెనక్కి తీసుకుంటున్నారు. ఈ వివాదాల మధ్యనే ఈ సీక్వెల్ మూవీ ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


