Drishyam 3 Collection: దృశ్యం 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే- ఆ ఒక్కటి తప్పా మోహన్ లాల్ గత సినిమాలను దాటేసిన క్రైమ్ థ్రిల్లర్

Mohanlal Drishyam 3 Box Office Collection Day 1: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పుట్టినరోజు కానుకగా విడుదలైన మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'దృశ్యం 3' బాక్సాఫీస్ వద్ద పటిష్టమైన ఓపెనింగ్స్ సాధించింది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ తొలి రోజే రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది.

Published on: May 22, 2026, 10:40:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Drishyam 3 Movie First Day Box Office Collection: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ 'దృశ్యం 3' మే 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. మోహన్ లాల్ 66వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం, రెండో భాగం సాధించిన అద్భుత విజయాల తర్వాత వచ్చిన ఈ మూడో భాగం తొలి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ఖాతా తెరిచింది.

దృశ్యం 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే- ఆ ఒక్కటి తప్పా మోహన్ లాల్ గత సినిమాలను దాటేసిన క్రైమ్ థ్రిల్లర్
దృశ్యం 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే- ఆ ఒక్కటి తప్పా మోహన్ లాల్ గత సినిమాలను దాటేసిన క్రైమ్ థ్రిల్లర్

తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ ఫ్రాంచైజీతో విడదీయరాని బంధం ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ అయిన 'దృశ్యం' సినిమాలు ఇక్కడ కూడా సంచలన విజయాలు సాధించాయి. అందుకే మలయాళ మూల చిత్రం 'దృశ్యం 3' తెలుగు వర్షన్‌పై కూడా ఇక్కడి సినీ ప్రియులు గట్టి ఆశలే పెట్టుకున్నారు.

మొదటి రోజు వసూళ్ల వివరాలు

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'దృశ్యం 3' మొదటి రోజు భారతదేశ వ్యాప్తంగా రూ. 10.56 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దేశవ్యాప్తంగా మొత్తం 5,396 షోలలో ఈ సినిమాను ప్రదర్శించారు. భాషల వారీగా చూస్తే, మాతృభాష మలయాళంలో అత్యధికంగా రూ. 9.11 కోట్లు రాగా, తెలుగులో రూ. 0.96 కోట్లు, తమిళంలో రూ. 0.36 కోట్లు, కన్నడలో రూ. 0.13 కోట్ల కలెక్షన్లు నమోదయ్యాయి.

పాత రికార్డులతో పోలిక

మొదటి రోజు థియేటర్లలో సగటున దృశ్యం 3 సినిమాకు 50.5 శాతం అక్యుపెన్సీ కనిపించింది. వీకెండ్ వచ్చేసరికి ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోహన్ లాల్ గత చిత్రాలతో పోలిస్తే ఈ ఓపెనింగ్స్ మెరుగ్గానే ఉన్నాయని చెప్పాలి.

గత ఏడాది (2025) విడుదలైన ఆయన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'L2: ఎంపురాన్' మొదటి రోజే రూ. 21 కోట్ల భారీ వసూళ్లను సాధించి అగ్రస్థానంలో ఉంది. ఆ రికార్డును 'దృశ్యం 3' అందుకోలేకపోయినప్పటికీ, మోహన్ లాల్ ఇటీవలి చిత్రాలైన 'తుడరుమ్' (రూ. 5.45 కోట్లు), 'హృదయపూర్వం' (రూ. 3.25 కోట్లు), 'వృషభ' (రూ. 0.60 కోట్లు) చిత్రాల ఓపెనింగ్స్‌ను దృశ్యం 3 సులభంగా అధిగమించింది.

2013లో వచ్చిన మొదటి భాగం దృశ్యం మూవీ మలయాళ సినిమా చరిత్రలోనే తొలిసారిగా రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డు సృష్టిస్తే.. ఆ తర్వాత వచ్చిన రెండో భాగం కొవిడ్ మహమ్మారి కారణంగా నేరుగా ఓటీటీ రిలీజ్ అయింది.

రివ్యూలు ఏం చెబుతున్నాయి?

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబావూర్ దృశ్యం 3 చిత్రాన్ని నిర్మించారు. మోహన్ లాల్, మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, మురళీ గోపీ, సిద్ధిఖీ, ఆశా శరత్ తమ పాత పాత్రల్లోనే మరోసారి కనిపించి మెప్పించారు. జార్జ్‌కుట్టి కుటుంబాన్ని చుట్టుముట్టిన సమస్యలు ఈ భాగంలో ఎలా ముగిసాయనేది కథాంశం.

"దృశ్యం 3 కేవలం ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను థ్రిల్ చేయడంపై కాకుండా, జార్జ్‌కుట్టి చుట్టూ ఉన్న పరిస్థితులు, అతను తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చే పరిణామాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది" అని హిందుస్థాన్ టైమ్స్ తన రివ్యూలో పేర్కొంది.

దృశ్యం 4 కూడా

కూతురిని కాపాడుకోవడానికి ఒక తండ్రి ఎంతటి సాహసానికైనా వెనుకాడడనే పాయింట్‌ను ఇందులో భావోద్వేగంగా చూపించారు. ఈ సినిమా ముగింపు చూస్తుంటే 'దృశ్యం 4' కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోహన్ లాల్ సైతం ఈ సిరీస్‌లో ఐదో భాగం కూడా ఉండే అవకాశం ఉందని గతంలోనే హింట్ ఇచ్చారు. జార్జ్‌కుట్టి ప్రయాణం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More