బాహుబలి ది ఎపిక్.. థియేటర్లో ఎన్నెన్ని సిత్రాలో.. సీన్స్ రీక్రియేట్ చేస్తూ ఫ్యాన్స్ హంగామా.. వీడియోలు వైరల్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి: ది ఎపిక్' సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ రీరిలీజ్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో బాహుబలి సినిమాల్లోని సీన్లను రీక్రియేట్ చేస్తూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 1, 2 చిత్రాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్'గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న థియేటర్లలో ఘనంగా విడుదలైంది. ఒక రోజు ముందు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లు కూడా ప్రదర్శించారు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా నటించిన ఈ చిత్రం.. 'బాహుబలి: ది బిగినింగ్' (2015), 'బాహుబలి 2: ది కన్క్లూజన్' (2017) చిత్రాల రీమాస్టర్డ్ వెర్షన్.

ఫ్యాన్స్ హంగామా
తొలిరోజు థియేటర్లకు వచ్చిన అభిమానులు బాహుబలి ది ఎపిక్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఫన్నీగా రీక్రియేట్ చేస్తూ థియేటర్లలో హంగామా చేశారు. రమ్యకృష్ణ నటించిన ఫేమస్ సీన్లో అభిమానులు తమ పిల్లలను తీసుకువచ్చి పైకి ఎత్తి పట్టుకున్న వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఆ సీన్లో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర, అమరేంద్ర బాహుబలిని నీటిలో నుంచి తలపై మోస్తూ, నీటిలో మునిగిపోకుండా పైకి ఎత్తి పట్టుకుని ప్రాణాలు విడుస్తుంది.
సీన్లు రీక్రియేట్
స్క్రీన్పై బాబును చేతిలో ఎత్తి పట్టుకున్న శివగామి సీన్ ప్లే అవుతుండగా కొందరు అభిమానులు తమ పిల్లలను పైకి ఎత్తి పట్టుకోగా, ఒక వీడియోలో మాత్రం కొందరు తమ స్నేహితుడినే పైకి ఎత్తి ఫన్నీగా ఆ సీన్ను రీక్రియేట్ చేశారు. ఈ వీడియోలలో చాలా మంది ప్రేక్షకులు నవ్వుతూ, ఈ అల్లరిని తమ ఫోన్లలో రికార్డ్ చేస్తూ, పేపర్ కాన్ఫెట్టిని విసురుతూ కనిపించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
విగ్రహాన్ని నిలబెడుతూ
అభిమానులు కేవలం బేబీ సీన్ను మాత్రమే రీక్రియేట్ చేయడం లేదు. ఒక వీడియోలో ఫ్యాన్స్ బట్టలను కలిపి కట్టి, దేనినో పైకి లాగుతున్నట్లు నటిస్తున్నారు. ఆ తర్వాత వారు బాహుబలిలోని మరో ఫేమస్ సీన్ అదే బళ్లాలదేవ విగ్రహాన్ని నిలబెట్టే సీన్లో తాడును లాగడాన్ని రీక్రియేట్ చేస్తున్నట్లు చూపించారు.
బాహుబలి: ది ఎపిక్ కలెక్షన్లు
బాహుబలి ది ఎపిక్ ఫస్ట్ డే కలెక్షన్లు కుమ్మేసింది. ఈ చిత్రం గురువారం ప్రీమియర్ల ద్వారా రూ. 1.15 కోట్లు, తొలిరోజు రూ. 9.25 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియాలో కలెక్షన్లు రూ.10.4 కోట్లకు చేరాయి. ఈ చిత్రం శివుడు అనే వ్యక్తి కథను చెబుతుంది. అతను తన వంశం గురించిన నిజాన్ని తెలుసుకుని, తన సింహాసనం, ప్రజల కోసం పోరాడటానికి మహిష్మతికి వెళ్తాడు.
'బాహుబలి 2: ది కన్క్లూజన్' భారతీయ చిత్రాలలో మూడవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీని కంటే ముందు 'దంగల్' (2016), 'పుష్ప 2: ది రూల్' (2024) మాత్రమే ఉన్నాయి. 'బాహుబలి: ది ఎపిక్' ఇప్పటికే రీరిలీజ్ చిత్రాలలో అత్యధిక ఓపెనర్గా నిలిచింది. ఈ చిత్రం తన లైఫ్టైమ్లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.














