iBomma : సినిమాల పైరసీ కేసు.. చంచల్‌గూడ జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదల

ఐబొమ్మ రవికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడు చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు.

Published on: Feb 18, 2026, 19:56:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమాల పైరసీ కేసులో అరెస్టు అయిన ఐబొమ్మ రవి విడుదల అయ్యాడు. మంగళవారం బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఐబొమ్మతో ముడిపడి ఉన్న సినిమా పైరసీ, ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రకటనల నెట్‌వర్క్‌కు సంబంధించి నవంబర్‌లో ఇమంది రవి అరెస్ట్ అయ్యాడు. అయితే రవికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తాజాగా విడుదల అయ్యాడు.

ఐబొమ్మ రవి విడుదల
ఐబొమ్మ రవి విడుదల

భారతదేశంలోని అతిపెద్ద సినిమా పైరసీ నెట్‌వర్క్‌లలో ఒకదాన్ని నిర్వహిస్తున్నాడని ఆరోపిస్తూ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు రవిని నవంబర్ 15వ తేదీన అరెస్టు చేశారు. అధికారుల ప్రకారం.. ఈ నెట్‌వర్క్ ద్వారా వేల సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను ఐబొమ్మలో అప్‌లోడ్ చేశాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రొత్సహించాడు.

తాజాగా ఇమంది రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దేశం విడిచి వెళ్లకూడదని, ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు పాస్ పోర్టును కోర్టులో సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇంటర్నెట్ ఉపయోగించకూడదని, ఒకవేళ నెట్ వాడాలి అనుకుంటే.. పోలీసుల అనుమతి తీసుకోవాలని వెల్లడించింది.

ఐబొమ్మ రవిని మీద దాదాపు ఐదు కేసులు ఉన్నాయి. సినిమాల పైరసీతోపాటుగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించి అతడిపై కేసులు నమోదు అయ్యాయి. గతంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. నాంపల్లి కోర్టు కొట్టివేసింది. చాలా సార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. తాజాగా ఐబొమ్మ రవికి బిగ్ రిలీఫ్ దొరికింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కరేబియన్ దీవుల్లో ఉంటూ.. ఐబొమ్మ పైరసీ సైట్‌ను రన్ చేశాడు ఇమంది రవి. గతంలో చాలాసార్లు పోలీసులకు సవాల్ విసిరాడు. పూర్తిగా అక్కడే సెటిల్ కావాలి అనుకున్నాడు. కానీ హైదరాబాద్ వచ్చిన అతడు పోలీసులకు చిక్కాడు. పోలీసులు కూకట్‌పల్లిలోని గ్రీన్ హిల్స్ రోడ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో అతన్ని అరెస్టు చేశారు. విచారణ చేస్తుంటే అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

విశాఖపట్నానికి చెందిన ఇమంది రవి ఐబొమ్మ పైరసీలో ప్రధాన నిందితుడు. పలుసార్లు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు. స్వాధీనం చేసుకున్న హార్డ్ డ్రైవ్‌లలో అనేక భాషలలో దాదాపు 21,000 సినిమాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సుమారు రూ.20 కోట్లు సంపాదించాడని వార్తలు వచ్చాయి. దర్యాప్తు సమయంలో అతని బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.3.5 కోట్లను సీజ్ చేశారు.

వెల్లేల ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరుతో రవి, పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. విచారణ చేస్తుంటే.. అతడు తన రూమ్‌మేట్ అని.. అందుకే ఆ పేరును వాడుకున్నట్టుగా వెల్లడించాడు. ప్రహ్లాద్ గురించి పోలీసులు ఆరా తీశారు.

బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించారు. కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవి ముందుగానే ప్రహ్లాద్‌ను విచారణ చేశారు. దీంతో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి ఐబొమ్మ రవి, ప్రహ్లాద్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇదే విషయాన్ని ప్రహ్లాద్ తెలిపాడు. రవి ఎవరో తనకు తెలియదన్నాడు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More