రూ.13 వేల కోట్ల బాక్సాఫీస్ వసూళ్లు.. 2025లో దుమ్ము రేపిన ఇండియన్ సినిమా.. టాప్ 10లో రెండు తెలుగు సినిమాలు
ఇండియన్ సినిమా 2025లో దుమ్ము రేపింది. కొవిడ్ తర్వాత అత్యుత్తమ ఏడాదిగా నిలిచింది. అన్ని భాషల్లో వచ్చిన సినిమాల మొత్తం వసూళ్లు కలిపి ఏకంగా రూ.13 వేల కోట్లు దాటడం విశేషం. హిందీ సినిమా తొలి స్థానంలో ఉండగా.. తెలుగు సినిమా రెండో స్థానంలో కొనసాగుతోంది.
కరోనా మహమ్మారి తర్వాత ఇండియన్ సినిమా 2025లో చెలరేగిపోయింది. ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఆర్మాక్స్ మీడియా’ (Ormax Media) రిపోర్టు ప్రకారం.. 2025లో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు రూ. 13,397 కోట్లకు చేరాయి. 2024తో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. 2023లో నమోదైన రూ. 12,198 కోట్ల రికార్డును కూడా ఈ ఏడాది బ్రేక్ చేసింది.

హిందీ సినిమా హవా
చాలా రోజులుగా సౌత్ సినిమాల హవాలో కొట్టుకుపోతున్న హిందీ సినిమా గతేడాది మళ్లీ గాడిలో పడింది. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ (Dhurandhar) మూవీ ఇండియాలో ఏకంగా రూ. 950.1 కోట్లు వసూలు చేసి, అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది.
ఈ సినిమా విజయంతో హిందీ పరిశ్రమ మొత్తం వసూళ్లు రూ. 5,504 కోట్లకు చేరాయి. ఇది గతేడాదితో పోలిస్తే 18 శాతం ఎక్కువ కావడం విశేషం. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల హవా తగ్గి (7%), స్ట్రైట్ హిందీ సినిమాల వాటా (93%) పెరగడం విశేషం.
కాంతార దెబ్బకు కన్నడ ఇండస్ట్రీ టాప్
ప్రాంతీయ భాషల్లో గుజరాతీ సినిమా ఏకంగా 189% వృద్ధిని సాధించింది. ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన లాలో: కృష్ణ సదా సహాయతే అనే మూవీ అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కన్నడ పరిశ్రమ 73% వృద్ధితో సత్తా చాటింది. రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార: ఏ లెజెండ్ చాప్టర్-1’ ఒక్క కన్నడ వెర్షనే రూ. 237 కోట్లు రాబట్టడం దీనికి ప్రధాన కారణం.
తెలుగు, తమిళం డల్..
హిందీ, కన్నడ పరిశ్రమలు దూసుకెళ్తుంటే.. తెలుగు, తమిళ పరిశ్రమలు మాత్రం పెద్దగా వృద్ధిని నమోదు చేయలేదు. తెలుగు సినిమా వసూళ్లు కేవలం ఒక శాతం వృద్ధితో నిలకడగా ఉండగా, తమిళ సినిమా 1 శాతం తగ్గుదల నమోదు చేసింది. తెలుగు సినిమాలు గతేడాది మొత్తంగా రూ.2348 కోట్లు వసూలు చేయగా.. తమిళ సినిమాలకు రూ.1805 కోట్లు వచ్చాయి. మలయాళం సినిమా అంతకు ముందు ఏడాదిలాగే రూ.1164 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా భారతీయ బాక్సాఫీస్లో దక్షిణాది సినిమాల వాటా 48 శాతం నుంచి 44 శాతానికి పడిపోయింది.
టికెట్ రేట్లు పెరిగాయి.. జనం తగ్గారు
ఈ వసూళ్ల పెరుగుదలకు ప్రధాన కారణం టికెట్ ధరలు 20 శాతం పెరగడమేనని ఆర్మాక్స్ మీడియా రిపోర్టు తెలిపింది. ఆశ్చర్యకరంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మాత్రం 6 శాతం తగ్గింది. 2025లో ఏకంగా 37 సినిమాలు రూ. 100 కోట్ల క్లబ్లో చేరడం విశేషం. 2024లో ఈ సంఖ్య 22 మాత్రమే.
2025లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 మూవీస్
ధురంధర్: రూ. 950.1 కోట్లు
కాంతార: ఏ లెజెండ్ చాప్టర్-1: రూ. 724.3 కోట్లు
ఛావా: రూ. 691.9 కోట్లు
సయ్యారా : రూ. 396.1 కోట్లు
కూలీ: రూ. 324.6 కోట్లు
మహావతార్ నరసింహ: రూ. 301.0 కోట్లు
వార్ 2: రూ. 282.7 కోట్లు
అవతార్: ఫైర్ అండ్ యాష్: రూ. 238.5 కోట్లు
దే కాల్ హిమ్ ఓజీ: రూ. 223.3 కోట్లు
సంక్రాంతికి వస్తున్నాం: రూ. 221.4 కోట్లు
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


