Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్.. ఆమె ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Indian Idol 16 Winner Jyotirmayee Nayak: దేశంలోనే అతిపెద్ద మ్యూజిక్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్ సీజన్ 16' ట్రోఫీని ఒడిశాకు చెందిన గాయని జ్యోతిర్మయి నాయక్ కైవసం చేసుకుంది. క్యాన్సర్ బాధితులకు సంగీత చికిత్స అందిస్తూ గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు జాతీయ స్థాయిలో విజేతగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటోంది.
Indian Idol Season 16 Winner Jyotirmayee Nayak: సంగీత ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఇండియన్ ఐడల్ 16' రియాలిటీ షో విజేతను సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ప్రకటించింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ గ్రాండ్ ఫినాలేలో ఒడిశాకు చెందిన ప్రముఖ గాయని జ్యోతిర్మయి నాయక్ విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక ట్రోఫీని ముద్దాడింది.
క్యాన్సర్తో పోరాడుతున్న బాధితులకు
ఒడిశా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన జ్యోతిర్మయి, ఇండియన్ ఐడల్ వేదికపైకి రాకముందు ఒక ప్రత్యేకమైన సామాజిక సేవలో నిమగ్నమైంది. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న బాధితులకు 'మ్యూజిక్ థెరపీ' ద్వారా ఉపశమనం కలిగిస్తూ వారి ముఖాల్లో ఆనందం నింపేది. ఆ అనుభవంతోనే జాతీయ స్థాయి వేదికపై అడుగుపెట్టి, తన అద్భుత స్వరంతో కోట్లాది మంది సంగీతాభిమానులను మురిపించింది జ్యోతిర్మయి.
ఫినాలేలో 'సైయాన్ ఓ సైయాన్' హవా
ఫినాలే రేసులో అన్షికా చోంకర్, మన్రాజ్ వీర్ సింగ్, మైసమ్ బోసు, సుహైల్ సూఫీ, తనిష్క్ శుక్లా వంటి దిగ్గజ సింగర్స్తో పోటీపడిన జ్యోతిర్మయి, తన నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంది. 'సైయాన్ ఓ సైయాన్' పాటకు జ్యోతిర్మయి ఇచ్చిన పెర్ఫార్మెన్స్ న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి విజేతగా నిలబెట్టింది.
హేమామాలిని నుంచి స్టాండింగ్ ఓవేషన్
ఈ 16 సీజన్ ప్రయాణంలో జ్యోతిర్మయి పాడిన అనేక పాటలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. 'ఓ జబ్ తక్ హై జాన్ జానే జహాన్ మై నాచుంగీ' పాటకు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. 'జానే క్యోం లోగ్ మొహబ్బత్ కియా కర్తే హైన్' పాటకు ప్రముఖ నటి లీనా చందావర్కర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
నా కల నెరవేరింది – జ్యోతిర్మయి ఆనందం
ఈ అద్భుత విజయంపై జ్యోతిర్మయి స్పందిస్తూ తన సంతోషాన్ని పంచుకుంది. "ఇండియన్ ఐడల్ 16 విజేతగా నిలవడం కల నిజమైనట్లుగా ఉంది. కేవలం ఒక చిన్న ఆశతో మొదలైన ఈ ప్రయాణం నా జీవితాన్నే మార్చేసింది. ప్రతి పెర్ఫార్మెన్స్ నన్ను మంచి గాయనిగానే కాకుండా మంచి మనిషిగా తీర్చిదిద్దింది" అని జ్యోతిర్మయి భావోద్వేగంతో పేర్కొంది.
తనకు మద్దతుగా నిలిచిన న్యాయనిర్ణేతలు, యాంకర్ ఆదిత్య నారాయణ్, షో నిర్వాహకులు, కుటుంబ సభ్యులు, ఓట్లు వేసిన అభిమానులకు జ్యోతిర్మయి కృతజ్ఞతలు తెలిపింది. ఈ ట్రోఫీ కేవలం తనది మాత్రమే కాదని, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరిదని స్పష్టం చేసింది.
తారల మెరుపుల మధ్య గ్రాండ్ ఫినాలే
ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ అత్యంత వైభవంగా జరిగింది. ప్రధాన న్యాయనిర్ణేతలు శ్రేయా ఘోషల్, బాద్షాలతో పాటు సంగీత దిగ్గజాలు ఉషా ఉతుప్, ఉదిత్ నారాయణ్, పాపన్, కుమార్ సాను, షెహనాజ్ గిల్, ఊర్మిళ మటోండ్కర్ ప్రత్యేక అతిథులుగా హాజరై సందడి చేశారు. జ్యోతిర్మయి విజయం పట్ల సోషల్ మీడియాలోనూ ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇండియన్ ఐడల్ 16 విన్నర్ ప్రైజ్ మనీ
ఇదిలా ఉంటే, ఇండియన్ ఐడల్ సీజన్ 16 విన్నర్గా నిలిచిన జ్యోతిర్మయి నాయక్కు ప్రైజ్ మనీ కింద రూ. 20 లక్షల వరకు నగదు బహుమతి లభించినట్లు సమాచారం. స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ చేతులతో ఇప్పించిన ట్రోఫీతోపాటు ఈ 20 లక్షల చెక్ను నిర్వాహకులు అందజేసినట్లు తెలుస్తోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ఇండియన్ ఐడల్ సీజన్ 16 విజేత ఎవరు?
ఒడిశాకు చెందిన ప్రముఖ గాయని జ్యోతిర్మయి నాయక్ ఇండియన్ ఐడల్ సీజన్ 16 విజేతగా నిలిచారు.
2. జ్యోతిర్మయి నాయక్ స్వస్థలం ఏది?
ఆమె ఒడిశా రాష్ట్రానికి చెందినవారు.
3. ఫినాలేలో జ్యోతిర్మయికి విజయాన్ని అందించిన పాట ఏది?
గ్రాండ్ ఫినాలేలో ఆమె పాడిన 'సైయాన్ ఓ సైయాన్' పాట అందరినీ ఆకట్టుకుని విజయాన్ని అందించింది.
4. ఇండియన్ ఐడల్ కంటే ముందు జ్యోతిర్మయి ఏ సామాజిక సేవ చేశారు?
ఆమె క్యాన్సర్ రోగులకు సంగీత చికిత్స (మ్యూజిక్ థెరపీ) ద్వారా ఉపశమనం అందించే సేవ చేశారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


