Jana Nayagan: లీకైన సినిమాకు ఇంత డిమాండా? జన నాయగన్ కు ఫస్ట్ డే 100 కోట్లు ఖాయం..సీఎం విజయ్ మేనియా..అక్కడ మాత్రం అంతంతే!

Jana Nayagan: సినిమా మొత్తం ఆన్ లైన్ లో లీకైంది.. అయినా కూడా జన నాయగన్ థియేటర్ రిలీజ్ కు డిమాండ్ మామూలుగా లేదు. సీఎం విజయ్ మేనియాతో రికార్డులు బ్రేక్ అవడం ఖాయమే. రేపు రిలీజ్ కానున్న జన నాయగన్ ఫస్ట్ డే రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం లాంఛనమే. 

Published on: Jul 22, 2026, 12:22:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jana Nayagan: ఎన్నో వివాదాలు, సెన్సార్ బోర్డు (CBFC) చిక్కులు, ఐటీ గొడవ, ఆఖరికి లీకుల భయాలను అధిగమించి ఎట్టకేలకు దళపతి విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' రేపు (జూలై 23) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్‌కి నటుడిగా ఇదే ఆఖరి సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కలెక్షన్ల వేట కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది.

లీకైన సినిమాకు ఇంత డిమాండా? జన నాయగన్ కు ఫస్ట్ డే 100 కోట్లు ఖాయం..సీఎం విజయ్ మేనియా..అక్కడ మాత్రం అంతంతే! (x/KvnProductions)
లీకైన సినిమాకు ఇంత డిమాండా? జన నాయగన్ కు ఫస్ట్ డే 100 కోట్లు ఖాయం..సీఎం విజయ్ మేనియా..అక్కడ మాత్రం అంతంతే! (x/KvnProductions)

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘జన నాయగన్’ రికార్డుల వేట

'జన నాయగన్' చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 8,000 కి పైగా స్క్రీన్లలో ప్రదర్శనకు సిద్ధమవ్వగా, ఒక్క తమిళనాడులోనే 3,500 కంటే ఎక్కువ షోలు ప్లాన్ చేశారు.

బుధవారం నాటికి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇండియాలో రూ.15 కోట్ల గ్రాస్ సాధించింది జన నాయగన్ మూవీ. బ్లాక్ చేసిన సీట్లతో కలిపి ఈ సంఖ్య రూ.20 కోట్లు దాటింది. ఒక్క మొదటి రోజు కోసమే 6.5 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మొదటి వీకెండ్‌కు సంబంధించి విదేశాల్లో ఇప్పటికే రూ.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్‌ను దాటేసింది.

గోట్ కంటే ఎక్కువ

ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం దళపతి విజయ్ ఆఖరి సినిమా 'జన నాయగన్' భారత బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ.55 కోట్ల నుంచి రూ. 60 కోట్ల నెట్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. విజయ్ గత చిత్రం 'GOAT' సాధించిన రూ.44 కోట్ల నెట్ ఓపెనింగ్‌ను ఇది సునాయాసంగా దాటనుంది. అయితే విజయ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన 'Leo' (రూ.65 కోట్లు నెట్) రికార్డును దాటడం కొంచెం కష్టమేనని ట్రేడ్ టాక్.

రూ.100 కోట్లు

విదేశాల్లో (నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఆసియ) జన నాయగన్ చిత్రం మొదటి రోజే 4 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు గ్రాస్ వసూళ్లు రూ.105 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలో మొదటి రోజే రూ.100 కోట్లు సాధించిన 19వ చిత్రంగా, 3వ తమిళ చిత్రంగా 'జన నాయగన్' రికార్డు సృష్టించనుంది.

నార్త్ ఇండియాలో అంతంతే!

ఈ అడ్వాన్స్ బుకింగ్స్ డేటాలో గమనించాల్సిన ప్రధాన అంశం ఏమిటంటే.. వసూళ్లలో సింహభాగం కేవలం తమిళ వెర్షన్ నుంచే వస్తున్నాయి. తమిళనాడు వెలుపల, ముఖ్యంగా ఉత్తరాది (North India) రాష్ట్రాల్లో ఈ సినిమాపై అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బలహీనంగా ఉన్నాయి. రజనీకాంత్ 'కూలీ' సాధించిన రూ.153 కోట్ల ఆల్ టైమ్ తమిళ ఓపెనింగ్ రికార్డును జన నాయగన్ అందుకోలేకపోయినా.. 'జైలర్' (రూ.91 కోట్లు), 'పఠాన్' (రూ.104 కోట్లు) చిత్రాల డే 1 గ్లోబల్ రికార్డులను దాటే అవకాశం ఉంది.

స్టార్ కాస్ట్

పొలిటికల్ వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన హెచ్.వినోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జన నాయగన్ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, ప్రతి నాయకుడిగా బాబీ డియోల్ కనిపించనున్నాడు. మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరేన్ ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, సత్యన్ సూరన్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More