ఓటీటీలోకి మలయాళం మిస్టరీ మూవీ.. ఐఎండీబీలో 7.8 రేటింగ్.. నమ్మకం, ఆధునిక ప్రపంచం మధ్య జరిగే ఫైట్
ఓటీటీలోకి ఇప్పుడో మలయాళం మిస్టరీ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఐఎండీబీలో 7.8 రేటింగ్ ఉన్న ఈ సినిమా ఇప్పుడు మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. సుమారు మూడున్నర నెలల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానుంది.
సజిన్ బాబు దర్శకత్వంలో రీమా కల్లింగల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మూవీ 'థియేటర్: ది మిత్ ఆఫ్ రియాలిటీ' (Theatre: The Myth of Reality) ఎట్టకేలకు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా ఫిబ్రవరి 21 నుంచి మనోరమ మ్యాక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.8 రేటింగ్ నమోదైంది.

థియేటర్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
గతేడాది అక్టోబర్లో థియేటర్లలో ఈ థియేటర్: ది మిత్ ఆఫ్ రియాలిటీ విడుదలైనప్పటికీ.. పరిమిత స్క్రీనింగ్ వల్ల చాలా మంది ఈ సినిమాను చూడలేకపోయారు. అనేక చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఇప్పుడు మనోరమ మ్యాక్స్ స్ట్రీమింగ్ చేయబోతోంది. అయితే ఇది కేవలం మలయాళం ఆడియోతోనే వస్తుంది. ఇంగ్లిష్ సబ్టైటిల్స్ తో ఎవరైనా చూడొచ్చు. ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ మొదలవుతుంది.
థియేటర్ మూవీ కథేంటంటే..
ఒక నిర్జన ద్వీపంలో మీరా (రీమా కల్లింగల్), ఆమె తల్లి నివసిస్తుంటారు. కొబ్బరికాయలు అమ్ముతూ జీవించే వీరు.. నాగదేవతలను అమితంగా నమ్ముతారు, పూజిస్తారు. అయితే మీరాకు అకస్మాత్తుగా ఒక వింత చర్మ వ్యాధి వస్తుంది. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది.
ఈ విషయం బయటకు తెలియడంతో సోషల్ మీడియాలో వీరిపై విపరీతమైన ట్రోలింగ్, విమర్శలు వస్తాయి. మరోవైపు మీరా తల్లి అది నాగదేవత శాపం అని నమ్ముతుంది. చివరకు మీరాను కాపాడింది ఆధునిక వైద్యమా? లేక వారి నమ్మకమా? అనేది ఉత్కంఠభరితంగా సాగుతుంది.
ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచినందుకు రీమా కల్లింగల్కు 2025లో కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు (Best Actress) లభించింది. సరస బాలుస్సేరి, మీనాక్షి రవీంద్రన్, మేఘా రాజన్, బాలాజీ శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
మలయాళం రిలీజెస్
ఈవారం ఇదొక్కటే కాదు మరో రెండు మలయాళం సినిమాలు కూడా ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాయి. వీటిలో చాతా పాచా ఒకటి. కొచ్చిలో డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) స్ఫూర్తితో ముగ్గురు స్నేహితులు అండర్ గ్రౌండ్ రెజ్లింగ్ మొదలుపెడతారు. చిన్ననాటి పిచ్చి నుంచి లోకల్ మ్యాచ్ల వరకు వారి ప్రయాణం, గొడవలు, డ్రామా ఇందులో ఉంటాయి. అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, మమ్ముట్టి నటించారు. నెట్ఫ్లిక్స్ లో గురువారం అంటే ఫిబ్రవరి 19 నుంచి చూడొచ్చు.
ఇక మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అమోస్ అలెగ్జాండర్ కూడా సన్ నెక్ట్స్ ఓటీటీలోకి ఫిబ్రవరి 20న వస్తోంది. ట్రూ క్రైమ్ షోను నడిపే ఒక జర్నలిస్ట్ జంట, ఒక రేపిస్ట్ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తారు. ఆ నేరస్తుడు చెప్పే నమ్మలేని నిజాలు, ఆ జంటకు ఉన్న లింక్ బయటపడటంతో కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. జాఫర్ ఇడుక్కి, అజు వర్గీస్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


