Netflix: హాలీవుడ్లో పెను సంచలనం.. వార్నర్ బ్రదర్స్ డీల్ నుంచి నెట్ఫ్లిక్స్ అవుట్.. తిరుగులేని శక్తిగా పారామౌంట్!
Netflix Walkout From Warner Bros Deal: హాలీవుడ్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ కొనుగోలు వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. పారామౌంట్ స్కైడాన్స్ భారీ ఆఫర్ ఇవ్వడంతో నెట్ఫ్లిక్స్ ఈ డీల్ నుంచి తప్పుకుంది. దీంతో హెచ్బిఓ, హ్యారీ పోటర్ వంటి దిగ్గజ బ్రాండ్లు ఇప్పుడు పారామౌంట్ పరం కానున్నాయి.
హాలీవుడ్లో గత కొన్ని నెలలుగా ఆసక్తి రేకెత్తిస్తున్న అతిపెద్ద విలీనానికి తెరపడింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని (Warner Bros Discovery) సొంతం చేసుకోవడానికి రంగంలోకి దిగిన ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్, అనూహ్యంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. గురువారం (ఫిబ్రవరి 26) నాడు ప్రత్యర్థి సంస్థ పారామౌంట్ స్కైడాన్స్ (Paramount Skydance) తన ఆఫర్ను భారీగా పెంచడంతో నెట్ఫ్లిక్స్ ఓటీటీ ఈ నిర్ణయం తీసుకుంది.

మలుపు తిప్పిన పారామౌంట్ భారీ ఆఫర్
వార్నర్ బ్రదర్స్ బోర్డు గురువారం నాడు ఒక కీలక ప్రకటన చేసింది. పారామౌంట్ ఒక్కో షేరుకు 31 డాలర్ల చొప్పున మొత్తం కంపెనీని కొనుగోలు చేయడానికి సిద్ధమైందని, ఇది నెట్ఫ్లిక్స్ ఆఫర్ కంటే చాలా మెరుగైనదని పేర్కొంది.
రూ. 9.2 లక్షల కోట్లకు డీల్
పారామౌంట్ ఆఫర్ ప్రకారం ఈ డీల్ విలువ అప్పులతో కలిపి సుమారు 111 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 9.2 లక్షల కోట్లు) చేరుకుంది. దీనికి పోటీగా ఆఫర్ను పెంచడానికి ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ నిరాకరించింది. అంత భారీ ధర చెల్లించడం ఆర్థికంగా లాభదాయకం కాదని భావించి ఆ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది నెట్ఫ్లిక్స్.
'మాకు ఇది అవసరమే కానీ.. ఏ ధరకైనా కాదు'
ఈ పరిణామంపై నెట్ఫ్లిక్స్ కో-సీఈఓలు టెడ్ సరాండోస్, గ్రెగ్ పీటర్స్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. "వార్నర్ బ్రదర్స్ బ్రాండ్లకు మేము సరైన వారసులుగా ఉంటామని నమ్మాము. కానీ, ఈ లావాదేవీ సరైన ధరకు లభిస్తే బాగుంటుంది అనుకున్నామే తప్ప, ఏ ధరకైనా సరే కొనాలనే పట్టుదల మాకు లేదు" అని వారు స్పష్టం చేశారు. డీల్ కుదరకపోయినా వార్నర్ బ్రదర్స్ నాయకత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు.
ఒకే గొడుగు కిందకు హ్యారీ పోటర్, టాప్ గన్
ఇక పారామౌంట్ ఈ కంపెనీని పూర్తిగా కొనుగోలు చేయనుండటంతో హాలీవుడ్ ముఖచిత్రం మారిపోనుంది. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న హ్యారీ పోటర్, హెచ్బిఓ మ్యాక్స్, సిఎన్ఎన్ (CNN) వంటి బ్రాండ్లు.. ఇప్పుడు పారామౌంట్కు చెందిన సిబిఎస్ (CBS), టాప్ గన్, వారి స్ట్రీమింగ్ సర్వీసులతో జతకట్టనున్నాయి. ఈ విలీనం పూర్తయితే హాలీవుడ్లో పారామౌంట్ తిరుగులేని శక్తిగా ఎదగనుంది.
ముందున్న సవాళ్లు
వార్నర్ బ్రదర్స్ సీఈఓ డేవిడ్ జాస్లావ్ ఈ డీల్పై స్పందిస్తూ నెట్ఫ్లిక్స్ తమకు మంచి భాగస్వామి అని కొనియాడారు. పారామౌంట్ విలీనం కంపెనీకి గొప్ప విలువను తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
యాంటీ ట్రస్ట్ నిబంధనలు
అయితే ఈ భారీ విలీనం కార్యరూపం దాల్చాలంటే వాటాదారుల ఆమోదంతో పాటు, యాంటీ ట్రస్ట్ (Antitrust) నిబంధనలు, రాజకీయ ప్రభావాలకు సంబంధించిన ప్రభుత్వ అనుమతులు పొందాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


