నెట్ఫ్లిక్స్ బ్లాక్బస్టర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వస్తోంది.. కన్ఫమ్ చేసిన నటుడు
నెట్ఫ్లిక్స్ పాపులర్ వెబ్ సిరీస్ అడోలెసెన్స్ రెండో సీజన్ రానుందన్న వార్తల నేపథ్యంలో ఇందులో నటించిన స్టీఫెన్ గ్రాహమ్ స్పందించాడు. మరో మూడు, నాలుగేళ్లలో ఇది ప్లాన్ చేస్తున్నట్లు అతడు చెప్పాడు.
ప్రపంచవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్ ప్రేక్షకులను కట్టిపడేసిన సిరీస్ ‘అడోలెసెన్స్’ (Adolescence). ఇది ఒక లిమిటెడ్ సిరీస్ గా వచ్చినప్పటికీ.. దీనికి సీక్వెల్ ఉంటుందా అనే ఆశ అభిమానుల్లో ఉంది. ఆ ఆశలకు బలం చేకూర్చేలా సిరీస్ హీరో, కో క్రియేటర్ స్టీఫెన్ గ్రాహం తాజాగా శుభవార్త చెప్పాడు. గత ఆదివారం రాత్రి జరిగిన ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ (Golden Globe) అవార్డుల వేడుకలో అతడు ఈ విషయంపై స్పందించాడు.

అవార్డు గెలిచిన జోష్లో..
ఈ వెబ్ సిరీస్లో తండ్రి ఎడ్డీ మిల్లర్ పాత్రలో జీవించిన స్టీఫెన్ గ్రాహం.. ‘బెస్ట్ మేల్ యాక్టర్’ (లిమిటెడ్ సిరీస్ కేటగిరీ)గా గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్నాడు. అవార్డు అందుకున్న తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు అతడు సమాధానమిస్తూ.. సిరీస్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బుర్రలో ఐడియా ఉంది.. కానీ టైం పడుతుంది
సీజన్ 2 గురించి అడగ్గా.. "ఆ ప్రశ్నకు నేను ఇప్పుడే సమాధానం చెప్పలేను. ఎందుకంటే ఆ ఆలోచన నా మనసులో, జాక్ థోర్న్ (సిరీస్ కో-క్రియేటర్) మనసులో చాలా లోతుల్లో దాగుంది. దాన్ని బయటకు తీయడానికి మాకు మరో మూడు, నాలుగేళ్లు పట్టొచ్చు. అప్పటి వరకు వేచి చూడాల్సిందే" అని గ్రాహం నవ్వుతూ సమాధానమిచ్చాడు. దీన్నిబట్టి చూస్తే కథను కొనసాగించే ఆలోచనలో ఈ వెబ్ సిరీస్ టీమ్ లో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
నిజానికి గత ఏడాది ఏప్రిల్లోనే దీనిపై చర్చలు మొదలయ్యాయి. కథలో ఉన్న అసలు ఆత్మ చెడిపోకుండా, పాత కథనే మళ్లీ చెప్పకుండా.. కొత్తగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్లాన్ బి నిర్మాతలు, దర్శకుడు ఫిలిప్ బరాంటిని చర్చిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
అసలేంటీ ‘అడోలెసెన్స్’ కథ?
అడోలెసెన్స్ అనే ఈ వెబ్ సిరీస్ గతేడాది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. 13 ఏళ్ల కొడుకు జామీ (ఓవెన్ కూపర్) ఒక తీవ్రమైన నేరానికి పాల్పడటంతో.. తండ్రి ఎడ్డీ మిల్లర్ (స్టీఫెన్ గ్రాహం) జీవితం ఎలా తలకిందులైందనేదే ఈ సిరీస్ కథ. ఈ ఎమోషనల్ డ్రామాలో కొడుకు పాత్ర పోషించిన ఓవెన్ కూపర్ ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్’గా, థెరపిస్ట్ బ్రారిస్టన్గా నటించిన ఎరిన్ డోహెర్టీ ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్’గా గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకోవడం విశేషం.
రికార్డుల మోత
అవార్డుల సీజన్లో ‘అడోలెసెన్స్’ దుమ్మురేపుతోంది. గోల్డెన్ గ్లోబ్స్లో 5 నామినేషన్లు దక్కించుకోగా.. అంతకుముందు 2025 ఎమ్మీ అవార్డుల్లో ఏకంగా 13 నామినేషన్లు సాధించి, 8 అవార్డులను కైవసం చేసుకుంది. నెట్ఫ్లిక్స్లో విడుదలైన తొలి 91 రోజుల్లోనే 146 మిలియన్ల వ్యూస్ సాధించి.. అత్యధిక మంది వీక్షించిన రెండో ఇంగ్లీష్ సిరీస్గా చరిత్ర సృష్టించింది. ఈ వెబ్ సిరీస్ లో కేవలం 4 ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ ను అసలు ఎలాంటి గ్యాప్ లేకుండా ఒకేసారి షూట్ చేయడం అనేది ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకతగా నిలిచింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


