Karishma Tanna: తుళు సాంప్రదాయంలో ఓటీటీ బ్యూటీ కరిష్మా తన్నా సీమంతం వేడుకలు- మొదటి సౌత్ ఇండియన్ స్టైల్ అంటూ ఫొటోలు

Karishma Tanna Baby Shower Celebration In Tulu Style: ప్రముఖ ఓటీటీ బ్యూటీ కరిష్మా తన్నా ఇంట త్వరలోనే పండంటి బిడ్డ అడుగుపెట్టనుంది. తన భర్త వరుణ్ బంగేరా కుటుంబ సాంప్రదాయాల ప్రకారం దక్షిణ భారత (తుళు) శైలిలో జరిగిన సీమంతం వేడుకల వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కరిష్మా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Published on: May 23, 2026, 13:05:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karishma Tanna Baby Shower Celebration In Tulu Style: ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి, ఓటీటీ బ్యూటీ కరిష్మా తన్నా ఇంట త్వరలోనే పండంటి బిడ్డ అడుగుపెట్టనుంది. తల్లి కాబోతున్న ఆనందంలో మునిగితేలుతున్న కరిష్మా.. తాజాగా తన సీమంతం వేడుకలకు సంబంధించిన అందమైన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. భర్త వరుణ్ బంగేరా కుటుంబ ఆచారాల ప్రకారం దక్షిణ భారత దేశ శైలిలో, ప్రత్యేకంగా తుళు సంప్రదాయంలో ఈ వేడుకను నిర్వహించారు.

తుళు సాంప్రదాయంలో ఓటీటీ బ్యూటీ కరిష్మా తన్నా సీమంతం వేడుకలు- మొదటి సౌత్ ఇండియన్ స్టైల్ అంటూ ఫొటోలు
తుళు సాంప్రదాయంలో ఓటీటీ బ్యూటీ కరిష్మా తన్నా సీమంతం వేడుకలు- మొదటి సౌత్ ఇండియన్ స్టైల్ అంటూ ఫొటోలు

గుజరాతీ కుటుంబంలో పుట్టిన కరిష్మా

ఉత్తరాదికి చెందిన గుజరాతీ కుటుంబంలో పుట్టిన కరిష్మా తన్నా.. కర్ణాటకకు చెందిన మంగళూరు (తుళు) యువకుడు వరుణ్ బంగేరాను వివాహం చేసుకున్నారు. రెండు భిన్న సంస్కృతులకు చెందిన ఈ జంట.. ఎంతో ప్రతిష్టాత్మకమైన సీమంతం వేడుకలను దక్షిణాది ఆచారాల ప్రకారం జరుపుకోవడం విశేషం. మన తెలుగు రాష్ట్రాల్లో సీమంతం వేడుకలను ఎంత పవిత్రంగా, వైభవంగా జరుపుకుంటారో.. మంగళూరు సంప్రదాయంలో కూడా దాదాపు అదే తరహాలో పూజలు నిర్వహిస్తారు.

కనుల పండువగా తుళు సంప్రదాయ సీమంతం

ఈ వేడుకలో కరిష్మా తన్నా సాంప్రదాయబద్ధమైన లైట్ పింక్ కలర్ శారీ, బంగారు ఆభరణాలు ధరించి అచ్చమైన దక్షిణాది యువతిలా మెరిసిపోయారు. వరుణ్ తెల్లటి కుర్తాలో కనిపించారు. పూజా విధానాలు, మంత్రోచ్ఛారణలు, బంధువుల ఆశీర్వాదాల మధ్య ఈ వేడుక అత్యంత భావోద్వేగభరితంగా సాగింది. వేడుక జరుగుతున్న సమయంలో కరిష్మా కాస్త కంగారుగా, మరికొంత సంతోషంగా కనిపించగా.. వరుణ్ ఆమెను ముద్దు పెట్టుకుని ధైర్యం చెప్పిన దృశ్యాలు వీడియోలో హైలైట్‌గా నిలిచాయి.

"మా మొదటి సౌత్ ఇండియన్ స్టైల్ సీమంతం వేడుక నుంచి వచ్చిన ప్రేమ, ఆశీర్వాదాలను ఇంకా మర్చిపోలేకపోతున్నాను" అని కరిష్మా తన్నా తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. పూజలు, కుటుంబ సభ్యుల దీవెనలతో ఆ రోజంతా ఎంతో పవిత్రంగా సాగిందని, ఒక కల నిజమైనట్లు అనిపించిందని ఆమె రాసుకొచ్చారు. సరికొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఎంతో సురక్షితంగా, ఆనందంగా ఉన్నట్లు చెప్పారు.

ప్రేమ నుంచి పెళ్లి పీటల వరకు

కరిష్మా తన్నా, వరుణ్ బంగేరా 2021లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఏడాదికే అంటే 2022లో ముంబై వేదికగా వీరి వివాహం ఘనంగా జరిగింది. హల్దీ, మెహందీ, పెళ్లి, రిసెప్షన్ ఇలా కొన్ని రోజుల పాటు సాగిన ఈ పెళ్లి వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో కరిష్మా తన గర్భధారణ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ బేబీ బంప్ ఫోటోలను షేర్ చేశారు. ఆగస్టు 2026లో తమ జీవితంలోకి ఒక చిన్న అద్భుతం రాబోతోందంటూ ఆమె పెట్టిన పోస్ట్‌కు నెటిజన్లు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

'స్కూప్' సిరీస్‌తో కెరీర్ బెస్ట్ హిట్

కరిష్మా తన్నా బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో వచ్చిన 'లాహోర్ కాన్ఫిడెన్షియల్' చిత్రంలో నటించిన కరిష్మా తన్నా ఆ తర్వాత 2023లో ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కించిన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్ 'స్కూప్' (Scoop)లో లీడ్ రోల్ పోషించారు.

జర్నలిస్ట్ జాగృతి పాఠక్ పాత్రలో కరీష్మా నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. 2024లో అనన్య పాండే నటించిన 'కాల్ మీ బే' వెబ్ సిరీస్‌లోనూ కరిష్మా చిన్న అతిథి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో చక్కటి విజయాలతో ఆమె ముందుకు సాగుతున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. కరిష్మా తన్నా భర్త ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి?

కరిష్మా తన్నా భర్త పేరు వరుణ్ బంగేరా. ఆయన కర్ణాటకలోని మంగళూరుకు చెందిన తుళు సంప్రదాయ కుటుంబానికి చెందినవారు.

2. కరిష్మా తన్నా సీమంతం ఏ పద్ధతిలో జరిగింది?

తన భర్త కుటుంబ ఆచారాల ప్రకారం దక్షిణ భారత దేశంలోని 'తుళు' (మంగళూరు) సంప్రదాయ పద్ధతిలో ఈ సీమంతం వేడుక నిర్వహించారు.

3. కరిష్మా తన్నా ఎప్పుడు బిడ్డకు జన్మనివ్వబోతున్నారు?

కరిష్మా తన్నా ఈ ఏడాది (ఆగస్టు 2026) లో తన మొదటి సంతానానికి జన్మనివ్వనున్నారు.

4. ఓటీటీలో కరిష్మా తన్నాకు గుర్తింపు తెచ్చిన వెబ్ సిరీస్ ఏది?

నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన 'స్కూప్' (Scoop) వెబ్ సిరీస్‌లో జర్నలిస్ట్ పాత్ర పోషించి కరిష్మా మంచి విజయాన్ని అందుకున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More