...
...
Next Story

Padma Awards: ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. అవార్డు అందుకున్న హేమా మాలిని.. మమ్ముట్టి, మాధవన్, మురళీ మోహన్ కూడా..

Padma Awards 2026: పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్ రాగా.. ఆయన తరఫున హేమా మాలిని ఈ అవార్డు అందుకున్నారు. అటు మమ్ముట్టి, మాధవన్, మురళీ మోహన్ కూడా పద్మ అవార్డులు అందుకున్న వాళ్లలో ఉన్నారు.

Published on: May 25, 2026, 20:45:49 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Padma Awards 2026: దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుక సోమవారం (మే 25) సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 131 మంది ప్రముఖులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. చిత్ర పరిశ్రమ, సంగీత రంగానికి చెందిన పలువురు దిగ్గజాలు ఈ వేడుకలో పురస్కారాలు అందుకున్నారు.

ధర్మేంద్ర, సతీష్ షాలకు మరణానంతర పద్మ పురస్కారాలు

Padma Awards: ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న హేమా మాలిని.. మమ్ముట్టి, మాధవన్ కూడా..
Padma Awards: ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న హేమా మాలిని.. మమ్ముట్టి, మాధవన్ కూడా..

బాలీవుడ్ లెజెండరీ నటుడు దివంగత ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం ‘పద్మ విభూషణ్’ ప్రకటించింది. ఆయన తరఫున భార్య, నటి హేమమాలిని ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ వేడుకలో పాల్గొన్న ఆమె కుమార్తె అహానా డియోల్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. 65 ఏళ్ల సినీ కెరీర్ ఉన్న ధర్మేంద్ర గతేడాది నవంబర్ 24న (తన 90వ పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందు) కన్నుమూశారు.

మరో సీనియర్ నటుడు సతీష్ షాకు మరణానంతరం ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది. ఆయన గతేడాది అక్టోబర్ 25న (74 ఏళ్ల వయసులో) మరణించారు. ప్రముఖ అడ్వర్టైజింగ్ గురు పీయూష్ పాండేకు ‘పద్మభూషణ్’ దక్కింది.

ఈ అవార్డు అందుకున్న తర్వాత హేమా మాలిని మాట్లాడుతూ.. "ఇది నాకు, మా కుటుంబానికి ఎంతో భావోద్వేగ క్షణం. నాతో పాటు అహానా వచ్చింది, ఈషా రావాలనుకున్నా కుదరలేదు. సన్నీ, బాబీలతో పాటు కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ధర్మాజీ సినీ పరిశ్రమకు చేసిన కృషిని గుర్తించి పద్మ విభూషణ్ అందించడం మా అందరికీ గర్వకారణం" అని అన్నారు.

పద్మ పురస్కారాలు అందుకున్న సినీ, సంగీత దిగ్గజాలు

పద్మభూషణ్ అందుకున్న వాళ్లలో ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఉన్నారు. మమ్ముట్టికి ఇది రెండవ పద్మ పురస్కారం (గతంలో 1998లో పద్మశ్రీ లభించింది).

ఇక పద్మ శ్రీలు అందుకున్న వాళ్లలో టాలీవుడ్ నవ్వుల రేడు రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటుడు మురళీ మోహన్ ఉన్నారు. వీరితో పాటు బహుభాషా నటుడు ఆర్. మాధవన్, బెంగాలీ నటుడు ప్రసేన్‌జిత్ ఛటర్జీ, క్లాసికల్ సింగర్ తృప్తి ముఖర్జీ, మణిపూర్‌కు చెందిన యుమ్నమ్ జాత్రా సింగ్, తమిళనాడుకు చెందిన ఆర్. కృష్ణన్‌లు పద్మశ్రీ అవార్డులు గ్రహించారు. ఇటీవల 'ధురంధర్' చిత్రంతో భారీ హిట్ అందుకున్న మాధవన్‌కు ఇదే మొదటి పద్మ పురస్కారం కావడం విశేషం.

రచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. పద్మ అవార్డులు 2026 వేడుక ఎక్కడ, ఎప్పుడు జరిగింది?

ఈ పురస్కారాల ప్రదానోత్సవం మే 25, సోమవారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేశారు.

2. ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్న టాలీవుడ్ నటులు ఎవరు?

తెలుగు చిత్ర పరిశ్రమ నుండి సీనియర్ నటులు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరియు మురళీ మోహన్‌లు కళల విభాగంలో 'పద్మశ్రీ' అవార్డులను అందుకున్నారు.

3. ధర్మేంద్రకు ఏ అవార్డు లభించింది? ఆయన తరఫున ఎవరు స్వీకరించారు?

దివంగత నటుడు ధర్మేంద్రకు మరణానంతరం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మ విభూషణ్' లభించింది. ఆయన భార్య, నటి హేమమాలిని ఈ అవార్డును అందుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe