Panchali Panchabhartruka Review: పాంచాలి పంచభర్తృక రివ్యూ- రాజేంద్ర ప్రసాద్, 30 ఇయర్స్ పృథ్వీ క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?

Panchali Panchabhartruka Review And Rating In Telugu: రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్ నటించిన సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ పాంచాలి పంచభర్తృక ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మర్డర్ మిస్టరీకి అద్భుతమైన కామెడీని జోడించి రూపొందించిన ఈ చిత్రం ఎలా ఉందో నేటి పాంచాలి పంచభర్తృక రివ్యూలో చూద్దాం.

Published on: Aug 14, 2026, 21:41:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Panchali Panchabhartruka Review In Telugu:

పాంచాలి పంచభర్తృక రివ్యూ- రాజేంద్ర ప్రసాద్, 30 ఇయర్స్ పృథ్వీ క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
పాంచాలి పంచభర్తృక రివ్యూ- రాజేంద్ర ప్రసాద్, 30 ఇయర్స్ పృథ్వీ క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?

టైటిల్: పాంచాలి పంచభర్తృక

నటీనటులు: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, 30 ఇయర్స్ పృథ్వీ, రోల్ రైడా, సరీహ్ ఫార్, రాజ్ పవన్, జెమిని సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు

దర్శకత్వం: గంగా సప్తశిఖర

కథ: బాబీ కేఎస్‌ఆర్‌

సంగీతం: మహేశ్ నారాయణ, బి షేక్

సినిమాటోగ్రఫీ: కేవీ ప్రసాద్

ఎడిటింగ్: జానీ బాషా నాగ

నిర్మాతలు: వెంకట్ దుగ్గిరెడ్డి (అమెరికా), రాజ్ పవన్ కోసర్ల, శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం

విడుదల తేది: ఆగస్ట్ 14, 2026

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల హవా విపరీతంగా సాగుతోంది. అయితే కేవలం క్రైమ్, ఇన్వెస్టిగేషన్‌తో కాకుండా దానికి హిలేరియస్ కామెడీని జోడించి వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. సరిగ్గా ఇదే ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'పాంచాలి పంచభర్తృక'.

'నటకిరీటి' రాజేంద్రప్రసాద్, '30 ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్వీరాజ్ కాంబినేషన్‌లో విచిత్రమైన టైటిల్‌తో రూపొందిన పాంచాలి పంచభర్తృక చిత్రం, టీజర్, ట్రైలర్‌లతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో భారీ అంచనాల మధ్య నేడు (ఆగస్ట్ 14) థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో పాంచాలి పంచభర్తృక రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

డాక్టర్ దమయంతిని డాన్‌సన్ అనే ముఠా మనుషులు కిడ్నాప్ చేసి తమ అక్రమ వ్యాపారానికి సహకరించాలని బెదిరిస్తారు. మరోవైపు సీరియల్స్ తీసే చిత్తరంజన్ (జెమిని సురేష్) ఎలాగైనా ఒక సినిమా తీయాలనే పట్టుదలతో ఉంటాడు. ఈ క్రమంలోనే అద్దె ఇంటి కోసం వెతుకుతున్న కాట్‌రాజ్, పుష్పరాజ్‌లను తన అపార్ట్‌మెంట్ పెంట్ హౌస్‌లోనే ఉండమని ఆహ్వానిస్తాడు.

అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ బాబ్జీ ముందుగా ముగ్గురు ఉండటానికి ఒప్పుకోకపోయినా, అతనికి మసిపూసి మారేడుకాయ చేసి మొత్తానికి నలుగురూ ఒకే చోట సెటిల్ అవుతారు. ఇలా సంతోషంగా కాలం గడుపుతున్న ఈ నలుగురు మిత్రులు ఒకరోజు రాత్రి ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు.

ఇందులో భాగంగా 'సెనోరిటా' అనే అమ్మాయిని ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుంటారు. ఆమె వచ్చి తన బాయ్‌ఫ్రెండ్ గురించి వారితో పంచుకున్న తర్వాత, ఈ నలుగురు ఓ పనిమీద బయటకు వెళ్లి వస్తారు. తీరా వచ్చి చూసేసరికి సెనోరిటా రక్తపు మడుగులో శవమై కనిపిస్తుంది.

ట్విస్టులు

కంగారుపడిపోయిన ఆ నలుగురు, ఆ శవాన్ని ఒక సూట్‌కేసులో పెట్టి మాయం చేయాలని చూస్తారు. అయితే ఊహించని విధంగా ఆ శవంతో ఉన్న సూట్‌కేసు కూడా మాయమవుతుంది. అసలు ఆ సూట్‌కేసు ఎక్కడికి పోయింది? ఇందులో పరమసుందరి (రాజేంద్ర ప్రసాద్) పాత్ర ఏమిటి? సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలు అలియాస్ ఎకో ఏం చేశాడు? అసలు సెనోరిటాను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

విశ్లేషణ:

పాంచాలి పంచభర్తృక సినిమా ఒక క్రైమ్ కామెడీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఒక మర్డర్ చుట్టూ కథనం తిరుగుతూ దానికి పాత్రలతో ఉన్న సంబంధం వంటి అంశాలతో సాగుతుంది. నిజానికి ఇది ఒక రెగ్యులర్ ఫార్మాట్ స్టోరీనే. కానీ, కథనం మాత్రం నవ్విస్తూ, ఇంట్రెస్ట్ కలిగేలా లీనం చేస్తుంది.

సినిమా ప్రారంభంలో యాక్టర్ సునీల్ వాయిస్ ఓవర్‌తో పాత్రలను పరిచయం చేసిన తీరు చాలా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల స్వభావాలు, నవ్వులు పూయించే కామెడీ సన్నివేశాలు, ఆపై సెనోరీటా మర్డర్‌తో ఆసక్తికరంగా సాగుతుంది.

గందరగోళం లేకుండా

ఇక సెకండాఫ్‌లో అసలు హత్య ఎవరు చేశారు అనే పాయింట్‌పై నడిపిస్తూ ఎక్కడా గందరగోళం లేకుండా చిక్కుముడులను విప్పిన తీరు బాగా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే రెండు అనూహ్యమైన ట్విస్ట్‌లు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తాయి.

క్రింజ్ కామెడీ లేకుండా కథలోని సస్పెన్స్‌కు సూట్ అయ్యే విధంగా సన్నివేశాలు, డైలాగ్స్ ఉండేలా చూసుకోవడం సినిమాకు ప్లస్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ బాగుంది. డైరెక్టర్ గంగా సప్తశిఖర సినిమాను బాగా తెరకెక్కించారు. అలాగే, దర్శకుడిగానే కాకుండా సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలుగా నటించి మెప్పించారు.

మహేష్ నారాయణ, బీ షేక్ అందించిన టైటిల్ సాంగ్ బాగుంది. ఎడిటింగ్ కూడా కథకు తగినట్లుగా చాలా షార్ప్‌గా ఉండటం ప్లస్ పాయింట్. ఇక రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్ తమ అనుభవాన్నంతా ఉపయోగించి పాత్రల్లో జీవించేశారని చెప్పాలి. జెమిని సురేష్‌కు చాలా కాలం తర్వాత మంచి ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది.

ఫైనల్‌గా చెప్పాలంటే?

రోల్ రైడా, సరీహ్ ఫార్, రాజ్ పవన్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో నటిస్తూనే నిర్మాణ బాధ్యతలు చేపట్టిన రాజ్ పవన్ నటనతో అలరించారు. ఫైనల్‌గా చెప్పాలంటే.. పాంచాలి పంచభర్తృక సినిమాపై వీకెండ్‌లో హాయిగా నవ్వుకోవడానికి, సస్పెన్స్ ఎంజాయ్ చేయడానికి ఓసారి లుక్కేయొచ్చు.

రేటింగ్: 3/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More