Patriot OTT: ఓటీటీలోకి మలయాళం బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. సినిమా మొత్తం స్టార్లే.. అయినా డిజాస్టర్.. ‘పేట్రియాట్’ వస్తోంది
Patriot OTT: మలయాళ సినిమా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ 'పేట్రియాట్' ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. జూన్ 5 నుంచి జీ5 ప్లాట్ఫామ్లో తెలుగు, హిందీ సహా ఐదు భాషల్లో ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
Patriot OTT: కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రేక్షకులకు మరో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ రాబోతోంది. ఇటీవల కాలంలో మలయాళ చిత్రాలకు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు నాట ఎంతటి ఆదరణ దక్కుతోందో మనం చూస్తూనే ఉన్నాం. కథలోని సహజత్వం, ఎమోషన్స్ను పండించడంలో మలయాళ మేకర్స్ చూపిస్తున్న నైపుణ్యం మన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

ఈ కోవలోనే తెరకెక్కిన మరో ఆసక్తికరమైన మూవీ 'పేట్రియాట్'. మమ్ముట్టి, మోహన్లాల్, ఫహాద్ ఫాజిల్ లాంటి నటీనటులున్నా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ5' ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.
ఐదు భాషల్లో స్ట్రీమింగ్
జూన్ 5 నుంచి 'పేట్రియాట్' సినిమాను తమ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 సంస్థ అధికారికంగా వెల్లడించింది. కేవలం మలయాళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను అలరించేలా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.
మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ సినిమా డిజిటల్ తెరపైకి రానుంది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులు తమ మాతృభాషలోనే ఈ అద్భుతమైన సినిమాను వీక్షించే అవకాశం దక్కింది.
పేట్రియాట్ మూవీ విశేషాలు
పేట్రియాట్ మలయాళం ఇండస్ట్రీ నుంచి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ. ఇందులో మమ్ముట్టి, మోహన్లాల్ లాంటి వాళ్లతోపాటు ఫహాద్ ఫాజిల్, కుంచకో బొబన్, నయనతారలాంటి స్టార్లు కూడా నటించారు. మూవీ మొత్తం స్టార్లే ఉన్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా పంది.
ఇదొక హై-వోల్టేజ్ స్పై పొలిటికల్ థ్రిల్లర్. నేషనల్ సెక్యూరిటీ, ప్రభుత్వ నిఘా నెట్వర్క్, అంతర్జాతీయ కుట్రల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. ఒక విజిల్ బ్లోయర్ ప్రభుత్వ నిఘా వ్యవస్థ బండారాన్ని ఎలా బయటపెట్టాడు? డిజిటల్ యుగంలో అధికారం, అత్యాశ.. దేశభక్తికి, దేశద్రోహానికి మధ్య ఉన్న గీతను ఎలా చెరిపేశాయి? అనేది ఈ సినిమా మూలకథ.
ఈ కథలో మమ్ముట్టి, మోహన్లాల్ పాత్రలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇక ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో మెయిన్ విలన్గా నటించడం విశేషం. నయనతార, కుంచకో బోబన్, రేవతి, దర్శన రాజేంద్రన్ వంటి భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషించారు.
బడ్జెట్, కలెక్షన్స్ ఇలా..
మమ్ముట్టి, మోహన్లాల్ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే మేకర్స్ ఏకంగా రూ.125 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కానీ థియేటర్లలోకి వచ్చాక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది.
తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.29 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాత క్రమంగా డ్రాప్ అయింది. 16 రోజుల్లో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.79.66 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఇందులో ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.31.39 కోట్లు కాగా, ఓవర్సీస్ నుంచి రూ.43.25 కోట్లు వచ్చాయి.
ముఖ్యంగా కేరళ మార్కెట్లో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ బాగా నిరాశపరిచింది. మొత్తం రన్లో కేరళలో కేవలం రూ.30 కోట్ల లోపే కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మమ్ముట్టి, మోహన్లాల్ రేంజ్ స్టార్స్ ఉన్నప్పటికీ, కథలో ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం వల్లే ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయిందనే విమర్శలు వచ్చాయి.
కమర్షియల్గా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచినా.. ఇందులో ఉన్న భారీ కాస్టింగ్, అద్భుతమైన విజువల్స్, పొలిటికల్ థ్రిల్లర్ అంశాలు ఓటీటీ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. థియేటర్లలో మిస్ అయిన వారు జూన్ 5 నుంచి జీ5లో ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


