సినిమాలంటే తమిళం, మలయాళం వాళ్లవే.. హిందీ సినిమా తన మూలాలను కోల్పోయింది.. ప్లాస్టిక్లా కనిపిస్తోంది: ప్రకాష్ రాజ్
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ హిందీ సినిమా ఇండస్ట్రీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. బాలీవుడ్ సినిమాలు తమ మూలాలను కోల్పోయాయని, కేవలం డబ్బు చుట్టూనే తిరుగుతూ, నకిలీగా తయారయ్యాయని అతడు అభిప్రాయపడ్డాడు. తమిళం, మలయాళం వాళ్లే బలమైన మూవీస్ చేస్తున్నారన్నాడు.
ప్రకాష్ రాజ్ బాలీవుడ్, సౌత్ సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ రెండు ఇండస్ట్రీల మధ్య తేడా ఏంటో కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాడు. హిందీ సినిమా తన మూలాలను పూర్తిగా కోల్పోయిందని, అది రోజురోజుకూ "నకిలీ"గా, కేవలం "డబ్బు సంపాదనే ధ్యేయంగా" మారిపోతోందని అతనడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న తొమ్మిదవ కేరళ సాహిత్య ఉత్సవంలో (కేఎల్ఎఫ్) మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ హిందీ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

ప్రకాష్ రాజ్ ఏమన్నాడంటే?
వార్తా సంస్థ పీటీఐ రిపోర్టు ప్రకారం ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. "ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. మలయాళం, తమిళ సినిమా పరిశ్రమలు చాలా బలమైన సినిమాలను రూపొందిస్తున్నాయని నాకు అనిపిస్తోంది. కానీ మరోవైపు హిందీ సినిమా తన అస్తిత్వాన్ని, మూలాలను కోల్పోయింది. అక్కడ ప్రతిదీ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బొమ్మల్లాగా చాలా అందంగా, అద్భుతంగా కనిపిస్తుంది కానీ అదంతా ప్లాస్టిక్ లాంటిది. మాకు (దక్షిణాది వారికి) చెప్పడానికి ఇంకా బలమైన కథలు ఉన్నాయి. తమిళనాడులోని కొత్త యువ దర్శకులు దళిత సమస్యల గురించి, సామాజిక అంశాల గురించి మాట్లాడుతున్నారు. అది భవిష్యత్తుపై ఎంతో ఆశను కలిగిస్తోంది" అని అన్నాడు.
ప్రేక్షకులతో బంధం తెగిపోయింది..
ప్రకాష్ రాజ్ హిందీ మూవీస్ పై మరిన్ని విమర్శలు గుప్పించాడు. "మల్టీప్లెక్సులు వచ్చిన తర్వాత బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీ (బాలీవుడ్) కేవలం ఆ మల్టీప్లెక్సుల కోసమే సినిమాలు తీయడం మొదలుపెట్టింది. చూడటానికి చాలా అందంగా ఉండే సినిమాలు, అలాంటి వాటినే తీయడం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే అవి అక్కడ బాగా ఆడుతున్నాయి కాబట్టి. వారు నెమ్మదిగా ఆ 'పేజ్ 3' సంస్కృతిలోకి వెళ్లిపోయారు. ఆ క్రమంలో రాజస్థాన్, బీహార్ వంటి గ్రామీణ ప్రాంతాలతో, అక్కడి మట్టి కథలతో సంబంధాన్ని పూర్తిగా కోల్పోయారు. ఈ రోజుల్లో సినిమా అంటే కేవలం డబ్బు, ఆర్భాటాలు మాత్రమే అయిపోయాయి. ఇన్ స్టాగ్రామ్ రీల్స్, పేజ్ 3 కవరేజ్, గట్టిగా సొంత డబ్బా కొట్టుకోవడం మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ ప్రక్రియలో, సినిమా పరిశ్రమ ప్రేక్షకులతో తనకున్న భావోద్వేగ అనుబంధాన్ని కోల్పోయిందని నాకు అనిపిస్తోంది" అని ప్రకాష్ రాజ్ చెప్పాడు.
ప్రకాష్ రాజ్ లేటెస్ట్ మూవీస్..
ప్రకాష్ రాజ్ చివరిగా 'తేరే ఇష్క్ మే' అనే హిందీ సినిమాలో కనిపించాడు. అందులో అతడు ధనుష్ తండ్రి పాత్రను పోషించాడు. ఇప్పుడు 'జన నాయగన్' అనే పొలిటికల్ యాక్షన్ డ్రామాలో కనిపించనున్నాడు. నటుడిగా దళపతి విజయ్ కు ఇది చివరి సినిమా కానుంది. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల ఆరంభంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. దీని కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


