ఒక్క సీన్ కోసం 100 టేకులు, ఉదయం నుంచి సాయంత్రం వరకు- నేను మహేశ్ జోకులు కూడా వేసుకున్నాం- వారణాసిపై పృథ్వీరాజ్ సుకుమారన్

Prithviraj Sukumaran On 100 Takes For Single Shot Varanasi: ఎస్‌ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'వారణాసి' షూటింగ్ విశేషాలను విలన్ పాత్రధారి పృథ్విరాజ్ సుకుమారన్ పంచుకున్నారు. పర్‌ఫెక్షన్ కోసం రాజమౌళి ఒకే సీన్‌ను దాదాపు 100 సార్లు రీ-టేక్ చేయించారని ఆయన వెల్లడించారు.

Published on: Jun 26, 2026, 11:35:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Prithviraj Sukumaran On 100 Takes For Single Shot Varanasi: భారతీయ చలనచిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి పర్‌ఫెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెరపై ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా రావాలనే ఆయన తపన ఒక్కోసారి నటీనటులకు అగ్నిపరీక్షగా మారుతుంటుంది.

ఒక్క సీన్ కోసం 100 టేకులు, ఉదయం నుంచి సాయంత్రం వరకు- నేను మహేశ్ జోకులు కూడా వేసుకున్నాం- వారణాసిపై పృథ్వీరాజ్ సుకుమారన్
ఒక్క సీన్ కోసం 100 టేకులు, ఉదయం నుంచి సాయంత్రం వరకు- నేను మహేశ్ జోకులు కూడా వేసుకున్నాం- వారణాసిపై పృథ్వీరాజ్ సుకుమారన్

రాజమౌళి పట్టుదల గురించి

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాల సమయంలోనే ఈ విషయం రుజువైంది. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో రాజమౌళి తెరకెక్కిస్తున్న సరికొత్త యాక్షన్ అడ్వెంచర్ మ్యాగ్నమ్ ఓపస్ 'వారణాసి' (Varanasi) సెట్స్‌పై కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోంది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కీలకమైన విలన్ పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. షూటింగ్ స్పాట్‌లో రాజమౌళి పట్టుదల ఏ స్థాయిలో ఉంటుందో వివరిస్తూ ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు.

వారణాసిలో జరిగిన షూటింగ్ షెడ్యూల్‌లో ఒకే ఒక్క షాట్ కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు తాము పడ్డ కష్టాన్ని పృథ్విరాజ్ గుర్తుచేసుకున్నారు. ఆ ఒక్క సీన్ కోసం రాజమౌళి ఏకంగా వందకు దగ్గరగా టేకులు తీసుకున్నారని ఆయన చెప్పారు.

సుమారు 100వ టేక్ వరకు

"ఇదేం అతిశయోక్తి కాదు, వారణాసి షెడ్యూల్‌లో జరిగిన ఒక నిజమైన సంఘటన. చిత్రంలోని ఒక పర్ఫెక్ట్ షాట్ కోసం నేను, మహేశ్ బాబు ఉదయాన్నే సెట్స్‌పైకి వచ్చాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఒక్క షాట్ కోసమే ప్రయత్నిస్తూనే ఉన్నాం. అది 94వ టేకో లేదా 97వ టేకో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. దీనిపై అప్పుడు నేను, మహేశ్ జోకులు కూడా వేసుకున్నాం" అని పృథ్విరాజ్ సుకుమారన్ పేర్కొన్నారు.

మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో కూడా రాజమౌళి మనసంతా ఆ షాట్ పైనే ఉందని పృథ్విరాజ్ చెప్పారు. "త్వరగా భోజనం ముగించి రండి" అని సార్ చెప్పారు. మేము అన్నం రెండో ముద్ద నోట్లో పెట్టుకునేలోపే, షాట్ రెడీ అయిపోయింది రమ్మంటూ పిలుపు వచ్చింది. మేము మళ్లీ వెళ్లాం, మళ్లీ టేకులు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6:37 గంటలైనా ఆ షాట్ ఓకే అవ్వలేద" అని పృథ్వీరాజ్ తెలిపారు.

"అప్పటికే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజమౌళి సార్‌కి ప్యాకప్ టైమ్ అయిందంటూ సైగలు చేస్తున్నారు. దాంతో ఆయన 'సరే ప్యాకప్.. దీన్ని రేపు ఉదయం మళ్లీ చేద్దాం' అని చెప్పారు. అలా ఒకే షాట్ కోసం రోజంతా కష్టపడాల్సి వచ్చింది" అని ఆయన ఆనాటి పరిస్థితిని వివరించారు.

నెటిజన్ల క్రేజీ రియాక్షన్స్

ఈ ఇంటర్వ్యూ క్లిప్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'రెడిట్' (Reddit) లో వైరల్‌గా మారడంతో సినీ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కోట్ల రూపాయల భారీ పారితోషికం తీసుకుంటున్నప్పుడు నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆ మాత్రం కష్టపడటంలో తప్పులేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

"సెట్‌పై రాజమౌళి ఒక రాక్షసుడిలా మారిపోతారేమో.. కానీ ఆయన ఇచ్చే అవుట్‌పుట్ అంత అద్భుతంగా ఉండటానికి ఆ పట్టుదలే కారణం" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. భారీ బడ్జెట్ సినిమాల్లో క్వాలిటీ విషయంలో రాజమౌళి అస్సలు రాజీపడరని, యాక్షన్ సీన్ల కోసం నటీనటులతో రక్తం, చెమట చిందించడం ఆయనకు అలవాటేనని మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

'వారణాసి' కథేంటి? మహేశ్ రోల్ ఏంటి?

'ఆర్ఆర్ఆర్' వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ అడ్వెంచర్ డ్రామా కావడంతో 'వారణాసి'పై ప్రపంచవ్యాప్తంగా అపారమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేశ్ బాబు ఒక టైమ్-ట్రావెలర్ (కాలంలో ప్రయాణించే సాహసికుడు) గా కనిపించబోతున్నారు.

రామాయణ కాలం నాటి ఒక పురాతనమైన, రహస్యమైన వస్తువు (artifact) ను వెతికే క్రమంలో సాగే సాహసయాత్రే ఈ సినిమా ముఖ్య కథాంశం. ఈ చిత్రం ద్వారా దాదాపు దశాబ్దం తర్వాత గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తిరిగి భారతీయ వెండితెరపైకి అడుగుపెడుతుండగా, పృథ్విరాజ్ సుకుమారన్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More