Raakh Web Series Review: రాఖ్ వెబ్ సిరీస్ రివ్యూ.. ప్రైమ్ వీడియోలో వణుకు పుట్టించే క్రైమ్ థ్రిల్లర్.. ఎందుకు చూడాలంటే?
Raakh Web Series Review: 1978లో దేశాన్ని కుదిపేసిన ఒక దారుణమైన జంట హత్యల కేసు ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ 'రాఖ్' (Raakh). అలీ ఫజల్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఎంత వరకూ మెప్పించేలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి.
Raakh Web Series Review: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు వాస్తవ ఘటనల బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సరికొత్త వెబ్ సిరీస్ 'రాఖ్' (Raakh). 'పాతాళ్ లోక్' ఫేమ్ ప్రోసిత్ రాయ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సిరీస్లో అలీ ఫజల్, సోనాలి బింద్రే, ఆకాష్ మఖిజా కీ రోల్స్ ప్లే చేశారు. ఈరోజే అంటే జూన్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ ను ఏ మేరకు థ్రిల్ చేసిందో చూద్దాం.

Raakh Plot | 1978 నాటి సంచలనం
ప్రైమ్ వీడియో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాఖ్ స్టోరీ విషయానికి వస్తే.. 1978వ సంవత్సరంలో ఢిల్లీని అతలాకుతలం చేసిన భయంకరమైన జంట హత్యల కేసు ఆధారంగా ఈ కథను రాసుకున్నారు. ఢిల్లీ కంటోన్మెంట్లో ఉండే లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ అరోరా, మోనా అరోరా దంపతుల పిల్లలు సుమన్, సాహిల్ బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కథ మొదలవుతుంది.
ఆ ఇద్దరు పిల్లలు మరుసటి రోజే అడవిలో దారుణంగా హత్యకు గురై కనిపిస్తారు. ఈ క్రూరమైన మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్ జయప్రకాష్ జాతవ్ (అలీ ఫజల్) పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఒకవైపు పోలీసుల విచారణ, మరోవైపు హత్యకు పాల్పడిన ఇద్దరు కిరాతకుల ప్రయాణాన్ని సమాంతరంగా చూపించడం సిరీస్ కు మంచి ప్లస్ అయింది.
Actors Performances | అదరగొట్టిన అలీ ఫజల్, విలన్స్
'మీర్జాపూర్' వెబ్ సిరీస్ లో గుడ్డూ భయ్యా పాత్రలో మాస్ గా కనిపించిన అలీ ఫజల్.. ఈ వెబ్ సిరీస్ లో చాలా హుందాగా, ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జీవించేశారు. అయితే ఈ సిరీస్కు అసలైన పిల్లర్లు ఆకాష్ మఖిజా, రమణ్దీప్ యాదవ్.
సైకో కిల్లర్స్ పాత్రల్లో వాళ్ల యాక్టింగ్ చూస్తే కచ్చితంగా వణుకు పుడుతుంది. చాలా కాలం తర్వాత స్క్రీన్పై కనిపించిన సోనాలి బింద్రే.. పిల్లలను కోల్పోయిన తల్లి వేదనను చాలా సహజంగా కళ్లకు కట్టారు. ఆమిర్ బషీర్, దివ్యా శర్మ తదితరులు తమ పాత్రల పరిధి మేర మెప్పించారు.
Raakh Analysis | మేకింగ్ ఎలా ఉంది?
పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ ఫేమ్ దర్శకుడు ప్రోసిత్ రాయ్ తన మేకింగ్తో కథలోని క్రూరత్వాన్ని, ఎమోషన్స్ను చాలా పవర్ ఫుల్ గా చూపించారు. సాధారణ థ్రిల్లర్లలా కాకుండా మొదట్లోనే హంతకులు ఎవరో చూపించి, ఆ తర్వాత కథను ఫ్లాష్బ్యాక్ లో నడపడం ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది.
అయితే ఈ వెబ్ సిరీస్ అక్కడక్కడా సాగదీసినట్టు అనిపిస్తుంది. అంతేకాదు నిజంగా జరిగిన స్టోరీని చివరికి వచ్చేసరికి ఓ ఫిక్షన్ అనిపించేలా సాగిన కథనం కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. ఎడిటింగ్ ఇంకాస్త స్పీడ్ గా ఉంటే బాగుండేది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి క్వాలిటీని ఇచ్చాయి.
హెచ్టీ విశ్లేషణ
'రాఖ్' ఒక బలమైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. వాస్తవ సంఘటనలకు ఫిక్షన్ జోడించి చేసిన ప్రయత్నం బాగా వర్కవుట్ అయింది. క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ ఆడియన్స్ కు కాస్త డిస్టర్బింగ్ గా అనిపించినా.. క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కు మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్. ఎమోషన్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ అన్నీ కలగలిపి కావాలనుకునే వాళ్లు ఈ వీకెండ్ లో 'రాఖ్' చూడొచ్చు.
People Also Ask (FAQs)
'రాఖ్' వెబ్ సిరీస్ రేటింగ్ ఎంత?
ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్కు చాలా వరకూ 3, అంతకంటే ఎక్కువ స్టార్ రేటింగ్సే వస్తున్నాయి.
రాఖ్ వెబ్ సిరీస్ ఏ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కింది?
ఇది 1978లో ఢిల్లీలో జరిగిన ఇద్దరు తోబుట్టువుల దారుణ జంట హత్యల కేసు ఆధారంగా రూపొందింది.
రాఖ్ వెబ్ సిరీస్లో నటించిన ప్రధాన నటులు ఎవరు?
అలీ ఫజల్, సోనాలి బింద్రే, ఆకాష్ మఖిజా, రమణ్దీప్ యాదవ్ ఇందులో లీడ్ రోల్స్ ప్లే చేశారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


