RGV Allu Aravind: మరీ నవ్వు తెప్పించేలా ఉంది.. అంత ఈగో ఎందుకు.. అనవసర వివాదం: యశ్, అల్లు అరవింద్ వివాదంపై ఆర్జీవీ
RGV Allu Aravind: అల్లు అరవింద్, యశ్ వివాదంపై సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. దీనిని అనవసర వివాదమని చెబుతూ.. ఈగో ఉన్న వాళ్లే ఈ కామెంట్స్ ను వ్యక్తిగతంగా తీసుకుంటారని అన్నారు.
RGV Allu Aravind: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన గ్యాంగ్స్టర్ డ్రామా 'టాక్సిక్' థియేటర్లలో నెగెటివ్ టాక్ను ఎదుర్కొంటున్న వేళ, సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కామెంట్స్ సోషల్ మీడియాలో మళ్లీ తెరపైకి వచ్చాయి. కేజీఎఫ్ సిరీస్ కంటే ముందు యశ్ ఎవరో ఎవరికీ తెలియదంటూ గతంలో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్పై వివాదం రేగగా, దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చి సంచలన రీతిలో స్పందించారు.

'పిచ్చి వివాదం' అంటూ ఆర్జీవీ ఫైర్
యశ్ స్టార్డమ్ గురించి అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యల వివాదంపై రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ ఖాతాలో సుదీర్ఘంగా స్పందించారు. ఈ వివాదాన్ని అత్యంత హాస్యాస్పదమైనదని అభివర్ణించిన ఆర్జీవీ.. అల్లు అరవింద్ అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కొందరు ఈగోకి పోతున్నారంటూ కామెంట్ చేశారు.
బిగ్ కాన్సెప్ట్ సినిమాలు కొత్త నటులను లేదా అంతగా పరిచయం లేని నటులను గ్లోబల్ స్టార్స్గా మారుస్తాయనే కోణంలోనే అల్లు అరవింద్ ఆ మాటలు అన్నారని వర్మ వివరణ ఇచ్చారు. చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యే ఈ లాజిక్ను పక్కనబెట్టి వివాదం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
బాహుబలికి ముందు ప్రభాస్ హిందీ ఆడియన్స్కు తెలుసా?
తన పాయింట్ను నిరూపించేందుకు ఆర్జీవీ కొన్ని క్రేజీ ఉదాహరణలు ఇచ్చారు. 'బాహుబలి' సినిమా కంటే ముందు హిందీ బెల్ట్లో ప్రభాస్ ఎవరికీ తెలియదని, అలాగే 'కాంతార' కంటే ముందు రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్థాయిలో ఎవరికీ తెలియదని గుర్తుచేశారు.
హాలీవుడ్ లెజెండ్ మార్లోన్ బ్రాండోను 'గాడ్ఫాదర్' కంటే ముందు తానే చూడలేదని వర్మ వ్యాఖ్యానించారు. గొప్ప సినిమాలే నటులను బిగ్ స్టార్స్గా మారుస్తాయి తప్ప, కేవలం స్టార్డమ్ను చూసి కాన్సెప్ట్ సినిమాలు ఆడవని ఆయన స్పష్టం చేశారు.
క్రిస్టోఫర్ నోలన్ లాంటి అగ్ర దర్శకులు కూడా 'ఒపెన్హైమర్' వంటి ప్రాజెక్ట్ల కోసం నటుల సామర్థ్యాన్ని చూస్తారు తప్ప, వారి స్టార్డమ్ మీద ఆధారపడరని వర్మ ఉదహరించారు. అల్లు అరవింద్ చాలా సాధారణమైన, ప్రాక్టికల్ విషయాన్ని చెప్పారని, దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని ఫీల్ అవ్వడం వారి అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
నెగెటివ్ టాక్ ఉన్నా.. రూ.200 కోట్ల కలెక్షన్లు
గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో తెరకెక్కిన 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' సినిమా ఆగస్టు 26న కన్నడ, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో వరల్డ్వైడ్గా రిలీజ్ అయింది. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా లాంటి భారీ కాస్టింగ్తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
సినిమాలో ఇంటెన్స్ వయొలెన్స్, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఆడియన్స్ నుంచి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ యశ్ మాస్ క్రేజ్ వల్ల ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే ఇండియాలో రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ను దాటేసింది. ప్రస్తుతం ఈ చిత్రం రూ.300 కోట్ల గ్లోబల్ క్లబ్లోకి అడుగుపెట్టేందుకు దూసుకెళ్తోంది.
కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి కన్నడ పరిశ్రమలో ఎప్పటి నుంచో స్టార్గా ఉన్న యశ్ ను కేజీఎఫ్ మాత్రమే స్టార్గా మార్చలేదని అతని అభిమానులు అంటుంటే, పాన్ ఇండియా రేంజ్ మాత్రం కేజీఎఫ్ వల్లే వచ్చిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


