హాలీవుడ్ ఎప్పుడూ మనల్ని చిన్నచూపే చూసింది.. మన సత్తా ఏంటో చూపించాలనుకున్నా.. అందుకే ఈ సినిమా: రామాయణ ప్రొడ్యూసర్

ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా రూపొందుతున్న రామాయణపై ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హాలీవుడ్ కు ఈ మూవీ ద్వారా మన సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

Published on: Feb 14, 2026, 11:51:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మన ఇతిహాసం 'రామాయణం'ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వెనుక ఉన్న బలమైన కారణాన్ని నిర్మాత నమిత్ మల్హోత్రా బయటపెట్టాడు. హాలీవుడ్‌లో భారతీయ సంస్కృతికి సరైన గుర్తింపు లేకపోవడం వల్లే ఈ ప్రాజెక్ట్ పుట్టిందని అతడు తెలిపాడు.

హాలీవుడ్ ఎప్పుడూ మనల్ని బాధితులుగానే చూసింది.. మన సత్తా ఏంటో చూపించాలనుకున్నా.. అందుకే ఈ సినిమా: రామాయణ ప్రొడ్యూసర్
హాలీవుడ్ ఎప్పుడూ మనల్ని బాధితులుగానే చూసింది.. మన సత్తా ఏంటో చూపించాలనుకున్నా.. అందుకే ఈ సినిమా: రామాయణ ప్రొడ్యూసర్

"మనం ఎప్పుడూ బాధితులమేనా?"

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ 'DNEG' అధినేత, నిర్మాత నమిత్ మల్హోత్రా తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'రామాయణం' (Ramayana) గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నమని అతడు అన్నాడు. ఇటీవల జరిగిన 'ఈటీ నౌ' ఈవెంట్‌లో అతడు మాట్లాడుతూ.. హాలీవుడ్‌లో తనకు ఎదురైన అనుభవాలు, ఈ సినిమా తీయడానికి దారితీసిన పరిస్థితుల గురించి వివరించాడు.

"నేను హాలీవుడ్‌కు వెళ్ళినప్పుడు అక్కడ మన సంస్కృతికి, చరిత్రకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం నన్ను బాధించింది. అక్కడ ఫైనాన్స్, మెడిసిన్ వంటి రంగాల్లో భారతీయులు విజయం సాధించినా.. మన సినిమాలకు, చరిత్రకు మాత్రం అక్కడ సరైన గుర్తింపు లేదు. 'స్లమ్‌డాగ్ మిలియనీర్' వంటి సినిమాల్లో మనం ఎప్పుడూ బాధితులుగానే కనిపిస్తాం. ఇది నన్ను ఎప్పుడూ అసహనానికి గురిచేసేది. మనం ఎవరో, మన చరిత్ర ఎంత గొప్పదో ప్రపంచానికి గర్వంగా చూపించాలనే ఆలోచన నుంచే 'రామాయణం' పుట్టింది" అని నమిత్ తెలిపాడు.

రూ. 4000 కోట్ల బడ్జెట్.. హాలీవుడ్ రేంజ్!

రెండు భాగాలుగా రాబోతున్న ఈ రామాయణ సినిమాను దాదాపు 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 4000 కోట్లు) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవనుంది. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు నమిత్ వెల్లడించాడు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యశ్ కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, హాలీవుడ్ నిర్మాత చార్లెస్ రోవెన్‌కు చెందిన అట్లాస్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రామాయణంలో ఎవరి పాత్ర ఏంటి?

రాముడు: రణ్‌బీర్ కపూర్

సీత: సాయి పల్లవి

రావణుడు: యశ్

హనుమంతుడు: సన్నీ డియోల్

లక్ష్మణుడు: రవి దూబే

ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్స్ ఏ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మెర్ సంగీతం అందిస్తున్నారు. హన్స్ జిమ్మెర్ పని చేస్తున్న తొలి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. ఈ రామాయణ సినిమా మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇక రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More