కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపికా పదుకోన్ స్థానంలో సాయి పల్లవి.. మేకర్స్ ఏమన్నారంటే?

నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొదటి పార్ట్‌లో సుమతి (SUM-80)గా మెప్పించిన దీపికా పదుకోన్ స్థానంలో సాయి పల్లవిని తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై మూవీ టీమ్ స్పందించింది.

Published on: Feb 3, 2026, 13:47:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైన్స్ ఫిక్షన్ వండర్ 'కల్కి 2898 ఏడీ'. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటించిన ఈ మైవీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీ మొదటి భాగం రూ. 1042 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు అందరి దృష్టి దీని సీక్వెల్ పైనే ఉంది. అయితే నిర్మాతలు సీక్వెల్ గురించి మౌనం వహిస్తున్నా.. సోషల్ మీడియాలో వస్తున్న లీకులు మాత్రం అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ మార్పు విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపికా పదుకోన్ స్థానంలో సాయి పల్లవి.. మేకర్స్ ఏమన్నారంటే?
కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపికా పదుకోన్ స్థానంలో సాయి పల్లవి.. మేకర్స్ ఏమన్నారంటే?

దీపికా స్థానంలో సాయి పల్లవి?

గతేడాది సెప్టెంబర్ లో దీపికా పదుకోన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే వార్తలు బలంగా వినిపించాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని 'స్పిరిట్' సినిమాతో పాటు, 'కల్కి' సీక్వెల్ నుంచి కూడా ఆమె వైదొలిగింది. రెమ్యునరేషన్ పెంపు విషయంలో వచ్చిన విభేదాల కారణంగానే, సుమారు 20 రోజుల షూటింగ్ తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్‌ను వీడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దీపిక పోషించిన సుమతి (SUM-80) పాత్ర కోసం మేకర్స్ సాయి పల్లవిని సంప్రదిస్తున్నారు. ఈ విషయంపై ఈ మూవీ టీమ్ కు చెందిన ఒక ప్రతినిధి స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు.

"అధికారికంగా ఇంకా ఏదీ ఖరారు కాలేదు. కానీ దీపికా తప్పుకున్న తర్వాత సుమతి పాత్ర కోసం మేకర్స్ సాయి పల్లవిని పరిశీలిస్తున్న మాట వాస్తవమే. ఆ పాత్రకు సాయి పల్లవి సరిగ్గా సరిపోతుందని వాళ్లు భావిస్తున్నారు" అని సదరు ప్రతినిధి హిందుస్థాన్ టైమ్స్ కు స్పష్టం చేశారు.

అయితే సాయి పల్లవిని ఇప్పటికే ఫైనల్ చేశారని, షూటింగ్ కూడా మొదలుకాబోతోందని వస్తున్న వార్తలను వారు ఖండించారు. "ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. దయచేసి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండండి" అని కోరారు.

సుమతి పాత్ర ప్రాధాన్యత ఏంటి?

మొదటి భాగంలో 'సుమతి' పాత్ర కథకు చాలా కీలకం. ఆమె ప్రాజెక్ట్-కెలో ప్రయోగాలకు గురైన గర్భిణిగా, భవిష్యత్తులో రాబోయే కల్కి అవతారానికి తల్లిగా కనిపిస్తుంది. విశేషమేమిటంటే తెలుగు వెర్షన్‌లో దీపిక పాత్రకు శోభితా ధూళిపాళ్ల డబ్బింగ్ చెప్పింది. కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ ల్యాబ్ నుంచి తప్పించుకున్న సుమతి.. అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) సంరక్షణలోకి వెళుతుంది.

సినిమా క్లైమాక్స్ లో భైరవ (ప్రభాస్).. గర్భిణిగా ఉన్న సుమతిని తీసుకుని పారిపోవడంతో మొదటి భాగం ముగుస్తుంది. ఇదే సమయంలో భైరవ మరెవరో కాదు, తన మిత్రుడు కర్ణుడి పునర్జన్మ అని అశ్వత్థామ గుర్తిస్తాడు. మరోవైపు సుమతి గర్భస్థ శిశువు సీరం ద్వారా శక్తిని పొందిన యాస్కిన్.. స్వయంగా సుమతిని పట్టుకోవడానికి బయలుదేరతాడు. ఈ నేపథ్యంలో సీక్వెల్ లో సుమతి పాత్ర నిడివి, ప్రాధాన్యత ఇంకా ఎక్కువగా ఉండబోతోంది. ఇలాంటి బరువైన పాత్రను సాయి పల్లవి ఎలా రక్తి కట్టిస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More