రేవంత్ రెడ్డిని కలిసి సల్మాన్ ఖాన్.. తెలంగాణ అభివృద్ధిని కొనియాడిన బాలీవుడ్ స్టార్ హీరో
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఈ ఇద్దరూ ముంబైలో ఓ ఈవెంట్ సందర్భంగా కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని సల్మాన్ కొనియాడినట్లు చెబుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురువారం (అక్టోబర్ 30) రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై వెళ్లిన రేవంత్ తో సల్మాన్ కాసేపు ప్రత్యేకంగా మాట్లాడాడు. తెలంగాణ రైజింగ్ నినాదాన్ని తాను ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తానని సల్మాన్ హామీ ఇచ్చాడు.

సల్మాన్, రేవంత్ భేటీ
సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ ఇప్పుడు ఎంతో ఆసక్తి రేపుతోంది. ముంబై వెళ్లిన రేవంత్ రెడ్డిని సల్మాన్ ప్రత్యేకంగా కలిసి తెలంగాణ గురించి చర్చించడం విశేషం. తెలంగాణ కాంగ్రెస్ తోపాటు ఈ ఫొటోలను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరూ తెలంగాణ అభివృద్ధి గురించి చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ 2047 నినాదానికి సల్మాన్ మద్దతిచ్చాడు.
2034 వరకు తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వరకు చేర్చే ఉద్దేశంతో ఈ తెలంగాణ రైజింగ్ 2047 నినాదాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనికి సల్మాన్ మద్దతిస్తూ.. తాను ఈ నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తానని హామీ ఇవ్వడం గమనార్హం. తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వం చేపడుతున్న పనులను కూడా అతడు కొనియాడాడు.
సల్మాన్ ఖాన్ ను అతని ఇల్లు గెలాక్సీ అపార్ట్మెంట్స్ లోనే రేవంత్ రెడ్డి కలిశాడు. ఈ ఫొటోలో ఉన్న సల్మాన్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అతడు మరింత ఫిట్గా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. 59 ఏళ్ల వయసులోనూ సల్మాన్ ఇంత ఫిట్ గా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
సల్మాన్ ఖాన్ గురించి..
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చివరిగా సికందర్ సినిమాలో నటించాడు. ఇందులో రష్మిక మందన్నా కూడా కనిపించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇప్పుడతడు బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ మూవీలో నటిస్తున్నాడు. గల్వాన్ లోయలో ఇండియా, చైనా మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. అతడు ఆ మధ్య చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ సినిమాలోనూ నటించిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


