Pavala Shyamala: విషాదం- పావలా శ్యామల కన్నుమూత- రంగస్థలం నుంచి వెండి తెరకు- 250 ప్లస్ సినిమాలు-పావలా పేరు ఎలా వచ్చిదంటే?
Pavala Shyamala: షాకింగ్.. సీనియర్ తెలుగు నటి పావలా శ్యామల కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. 250కి పైగా సినిమాల్లో తన నటనతో అలరించిన పావలా శ్యామలకు అసలు పావలా అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోండి.
Pavala Shyamala: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటులు తమదైన ముద్ర వేసి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి విలక్షణమైన క్యారెక్టర్ ఆర్టిస్టులలో సీనియర్ నటి పావలా శ్యామల ఒకరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, మంగళవారం (జూలై 28) అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూశారు.

పావలా శ్యామల మరణం
కొన్నేళ్లుగా అనారోగ్యంతో పావలా శ్యామల పోరాటం చేశారు. ఇప్పుడు హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 70 సంవత్సరాలు. ఆమె మరణవార్త విని టాలీవుడ్ తీవ్ర షాక్ కు గురైంది.
గుండెపోటుతో
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేరిన పావలా శ్యామలకు వైద్యులు నిరంతరం చికిత్స అందించారు. అయితే మంగళవారం రాత్రి 1:52 గంటల ప్రాంతంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు (Cardiac Arrest) రావడంతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
'పావలా' శ్యామలగా పేరు ఎలా వచ్చింది?
రంగస్థల నాటకాలు, రేడియో ఆర్టిస్ట్గా తన నటప్రయాణాన్ని ప్రారంభించిన శ్యామల.. 1985లో జంద్యాల దర్శకత్వంలో వచ్చిన 'బాబాయ్ అబ్బాయ్' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. పల్నాడు జిల్లా అమరావతిలో జన్మించిన ఆమె అసలు పేరు నేతి శ్యామల. కానీ ఆమె వేసిన పావలా నాటకంతో బాగా పాపులర్ అయ్యారు. చివరకు అదే ఆమె ఇంటి పేరుగా మారిపోయింది.
250కి పైగా సినిమాలు
దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 250కి పైగా తెలుగు చిత్రాలలో నటించారు పావల శ్యామల. తనదైన సహజసిద్ధమైన కామెడీ టైమింగ్, అమాయకత్వంతో కూడిన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'బాబాయ్ హోటల్', 'ఖడ్గం', 'ఆంధ్రావాలా', 'అతడు', 'గోలీమార్', 'బెండ్ అప్పారావు R.M.P' వంటి చిత్రాలలో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
సినీ వెలుగుల వెనుక దాగిన బాధ
వెండితెరపై నవ్వులు పూయించిన పావలా శ్యామల వ్యక్తిగత జీవితం మాత్రం తీవ్ర విషాదంతో కూడుకున్నది. చివరి రోజుల్లో ఆమె తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. పార్కిన్సన్స్ వ్యాధి (Parkinson's Disease), గుండె సంబంధిత సమస్యలు (Coronary Artery Disease), తీవ్రమైన రక్తపోటుతో (Hypertension) బాధపడ్డారు.
ఆమె కుమార్తె కూడా అనారోగ్యంతో ఉండటంతో కుటుంబ పోషణకు, మందుల ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో మా (MAA) అసోసియేషన్, పలువురు టాలీవుడ్ ప్రముఖులు, ప్రభుత్వం ఆమెకు ఆర్థిక సాయం అందించినప్పటికీ అనారోగ్యంతో పోరాటంలో ఆమె ఓడిపోయారు.
ఆమె మృతి పట్ల టాలీవుడ్ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. శ్యామల ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


