Serial Actor: షాకింగ్.. షూటింగ్‌ చేస్తూ సీరియల్ నటుడి మృతి.. మోకాలి లోతు నీటిలో హీరోయిన్‌తో డ్యాన్స్ చేస్తూ..

Serial Actor: టీవీ సీరియల్ నటుడు షూటింగ్ చేస్తూ నీటిలో మునిగి చనిపోయాడన్న వార్త షాక్‌కు గురి చేస్తోంది. ఈ ఘటన ఆదివారం (మార్చి 29) సాయంత్రం జరిగింది. తాజాగా దీనికి సంబంధించిన వివరాలను ఒడిశా పోలీసులు వెల్లడించారు.

Published on: Mar 30, 2026, 12:14:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ ఆదివారం (మార్చి 29) షూటింగ్ లో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. భోలేబాబా పార్ కరేగా అనే టీవీ షో షూటింగ్ నిమిత్తం తలసరి బీచ్‌కి వెళ్లినప్పుడు ఈ ఊహించని దుర్ఘటన జరిగింది. అయితే ఈ షూటింగ్ చేయడానికి చిత్ర బృందం ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని ఒడిశా పోలీసులు వెల్లడించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఆఖరి క్షణాల్లో అక్కడ ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Serial Actor: షాకింగ్.. షూటింగ్‌ చేస్తూ సీరియల్ నటుడి మృతి.. మోకాలి లోతు నీటిలో హీరోయిన్‌తో డ్యాన్స్ చేస్తూ.. (Instagram/ @rahularunodaybanerjee)
Serial Actor: షాకింగ్.. షూటింగ్‌ చేస్తూ సీరియల్ నటుడి మృతి.. మోకాలి లోతు నీటిలో హీరోయిన్‌తో డ్యాన్స్ చేస్తూ.. (Instagram/ @rahularunodaybanerjee)

రాహుల్ మరణానికి దారితీసిన పరిస్థితులు ఇవే..

బాలాసోర్ ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో జరిగింది. రాహుల్ తన కో స్టార్ శ్వేతా మిశ్రాతో కలిసి మోకాల్లోతు నీళ్లలో నిలబడి ఒక సీరియల్ సీన్ కోసం డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ సమయంలో వాళ్లిద్దరూ ఒక్కసారిగా నీళ్లలో ఉన్న ఒక పెద్ద గుంతలో పడిపోయారు.

వెంటనే అప్రమత్తమైన టీమ్ సభ్యులు ఇద్దరినీ బయటకు తీసి హుటాహుటిన దిఘా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో శ్వేతా మిశ్రా ప్రాణాలతో బయటపడగా, రాహుల్ మాత్రం అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు.

ఈ షూటింగ్ చేయడానికి టీమ్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, పర్మిషన్ కూడా తీసుకోలేదని పోలీసులు తెలిపారు. దీనిపై తలసరి పోలీసులు, దిఘా పోలీసులతో కలిసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం (మార్చి 30) నాడు కాంతి హాస్పిటల్‌లో రాహుల్‌ భౌతిక కాయానికి పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. త్వరలోనే ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ జరగనుంది.

ప్రైవసీ కావాలని కోరిన భార్య ప్రియాంక..

రాహుల్ మరణవార్త విన్న తర్వాత అతని భార్య, నటి ప్రియాంక సర్కార్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. ఇది మాకు అత్యంత బాధాకరమైన సమయం అని, దయచేసి మా ప్రైవసీని గౌరవించాలని ఆమె అందరినీ కోరింది. ఒక బిడ్డ, ఒక తల్లి, ఒక కుటుంబం ఈ ఊహించని బాధ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారని ఆమె రాసుకొచ్చింది. మీడియా మిత్రులు కూడా తమ హద్దులను గౌరవిస్తూ, ప్రశాంతంగా బాధను దిగమింగుకునే అవకాశం ఇవ్వాలని ప్రియాంక ఎంతో ఆవేదనతో కోరింది.

రాహుల్ బ్యాక్‌గ్రౌండ్.. సీఎం మమతా బెనర్జీ సంతాపం..

బెంగాలీ ఫిల్మ్ అండ్ టీవీ ఇండస్ట్రీలో రాహుల్ బెనర్జీకి చాలా మంచి పేరు ఉంది. తన మొదటి సినిమా చిరోదిని తుమీ జే అమర్ సూపర్ హిట్ అవ్వడంతో అతను ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. అదే సినిమా సెట్స్‌లో పరిచయమైన ప్రియాంకను అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

వీళ్ల మధ్య మనస్పర్థలు వచ్చి కొన్నేళ్ల క్రితం విడాకులకు అప్లై చేసినా, తమ కొడుకు షోహోజ్ కోసం మళ్లీ ఒక్కటయ్యారు. జాక్‌పాట్, లవ్ సర్కస్ లాంటి చాలా సినిమాల్లో, అలాగే దేశేర్ మాటి, గీతా ఎల్ఎల్‌బీ లాంటి సీరియల్స్‌లో రాహుల్ నటించి మెప్పించాడు.

రాహుల్ ఆకస్మిక మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాహుల్ ఇక లేడు అనే వార్త తనను కలచివేసిందని, అసలు ఏం జరిగిందో తాను ఇంకా నమ్మలేకపోతున్నానని ఆమె పోస్ట్ చేశారు. అతను తన ఫేవరెట్ యాక్టర్స్‌లో ఒకరని చెబుతూ, రాహుల్ కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More