Smriti Mandhana Ego: నాకు ఇగో చాలా ఎక్కువ, నా సమస్యలన్నింటికి అది మందులాంటిది.. స్మృతి మంధాన కామెంట్స్
Smriti Mandhana About Ego And Batting Addiction: టీమిండియా మహిళల స్టార్ క్రికెటర్ స్మృతి మంధానకు ఇగో ఎక్కువని, బ్యాటింగ్ ఒక వ్యసనమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. స్టార్ సెలబ్రిటీ హోదా ఉన్న స్మృతి మంధాన కృష్ణా నది దాటితే కేవలం మాములు అమ్మాయి అని చెప్పుకొచ్చింది.
Smriti Mandhana About Ego And Batting Addiction: ముంబైలో పుట్టి సాంగ్లీలో పెరిగిన స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన గురించి పరిచయం అక్కర్లేదు. ఈ ఏడాది భారత మహిళల జట్టుకు తొలి ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, ఆర్సీబీ (RCB) జట్టును వరుసగా రెండోసారి విమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) విజేతగా నిలిపి చరిత్ర సృష్టించింది స్మృతి మంధాన.

ఐదోసారి అవార్డు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానం, బీసీసీఐ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డును ఐదోసారి అందుకోవడం ఆమె నిలకడకు నిదర్శనం. ఇప్పుడు ఆమె కేవలం ఒక క్రీడాకారిణి మాత్రమే కాదు, సెరీనా విలియమ్స్ వంటి దిగ్గజాల సరసన ఒక 'బార్బీ బొమ్మ' రూపంలోనూ గుర్తింపు పొందిన అంతర్జాతీయ ఐకాన్.
'కృష్ణా' నది దాటితే.. నేను కేవలం స్మృతినే!
ప్రపంచం ఆమెను సూపర్ స్టార్గా చూసినా, తన సొంత ఊరు సాంగ్లీలో మాత్రం స్మృతి మంధాన మామూలు అమ్మాయేనట. "నేను అచ్చం సాంగ్లీ లాగే ఉంటాను.. చాలా నిమ్మళంగా (Laid-back)" అని స్మృతి నవ్వుతూ చెబుతుంది. కృష్ణా నదిపై ఉన్న వంతెన దాటి తన ఊర్లోకి రాగానే సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టేస్తానని ఆమె చెబుతోంది.
అక్కడ ఆమెకు స్నేహితులు ఉన్నారు, వారు ఆమె క్రికెట్ కెరీర్ను అస్సలు పట్టించుకోరు. గదిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆపమని అమ్మ ఇచ్చే హెచ్చరికలు, తనకిష్టమైన 'సాంభా భేల్' సెంటర్లో ప్రశాంతంగా చిరుతిండి తినడం.. ఇవే ఆమెకు అసలైన సంతోషాన్ని ఇస్తాయట.
అమ్మ మాట నిలబెట్టుకున్న కూతురు
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన స్మృతి, అద్దె ఇళ్లలో పెరుగుతున్నప్పుడు ఇంట్లోనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేది. బంతి తగిలి గోడలు పాడవుతుంటే బాధపడే అమ్మతో.. "అమ్మా, ఏడవకు.. త్వరలోనే మనకు సొంత ఇల్లు కొంటాను" అని మాటిచ్చింది స్మృతి మంధాన. టీనేజీలో ఇచ్చిన ఆ మాటను కొన్నేళ్లలోనే నిలబెట్టుకుంది స్మృతి.
తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ల కృషితో నేడు సాంగ్లీలో ఒక అద్భుతమైన ఇల్లు నిర్మించుకుంది స్మృతి మంధాన. నార్వే ఫుట్బాల్ స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఇంటి తరహాలో, ఒక క్రీడాకారిణికి అవసరమైన జిమ్, స్విమ్మింగ్ పూల్, ప్రాక్టీస్ నెట్స్ వంటి అన్ని సదుపాయాలతో ఆ ఇల్లు రూపుదిద్దుకుంది.
బ్యాటింగ్ నా పరమౌషధం!
"నాకు క్రికెట్ అంటే కేవలం ఆట కాదు, బ్యాటింగ్ అంటే ఒక వ్యసనం. అదే నా సమస్యలన్నింటికీ పరిష్కారం.. ఒక మందు (Medicine) లాంటిది" అని స్మృతి మంధాన చెబుతుంది. మైదానంలో ప్రశాంతంగా కనిపించే ఆమె మనసులో గెలవాలనే కసి, అహం (Ego) చాలా ఎక్కువగా ఉంటాయట. నెట్స్లో ఒక్క బంతికి బీట్ అయినా ఆమె తట్టుకోలేదట. ప్రాక్టీస్ ముగిసినా, అర్ధరాత్రి పూట గదిలో షాడో ప్రాక్టీస్ చేస్తూ తన పొరపాట్లను సరిదిద్దుకోవడం ఆమెకు అలవాటు. అందుకే ఆమె ఫోన్లో తన ఫోటోల కంటే తన బ్యాటింగ్ టెక్నిక్కు సంబంధించిన ఫోటోలే ఎక్కువగా ఉంటాయి.
విమర్శలకు బ్యాట్తోనే సమాధానం
2024 టీ20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్తో మ్యాచ్ ఓడిపోయినప్పుడు స్మృతిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. "వంటగదిలోకి వెళ్లండి" అని కొందరు, "చోకర్స్" అని మరికొందరు అవమానించారు.
కానీ, స్మృతి మంధాన ఒత్తిడిని ఆస్వాదించింది. ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్లో సెంచరీ బాది విమర్శకుల నోళ్లు మూయించింది. విమర్శల కంటే తన ఆటపైనే దృష్టి పెట్టే స్మృతి మంధాన, ఒత్తిడిని అధిగమించేందుకు మహాభారతం వినడం, భగవద్గీత చదవడం వంటివి చేస్తుంది.
ఒక రోల్ మోడల్
నేడు మహిళల క్రికెట్లో స్మృతి మంధాన ఒక రోల్ మోడల్. "మనం ఎంత బాగా ఆడాలంటే, రేపటి తరం క్రికెటర్లు మగవారితో పోల్చుకోనక్కర్లేదు.. మనల్నే ఉదాహరణగా (Reference) తీసుకోవాలి" అనే ఆమె మాటలు నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని స్మృతి మంధాన అభిమానులు అంటున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


