...
...
Next Story

మహేష్ బాబు అస్సలు జోక్యం చేసుకోడు.. వాళ్లకు కనీసం స్టోరీ కూడా తెలియదు.. నన్నే లాంచ్ చేయమని అడిగారు: డైరెక్టర్ అజయ్ భూపతి

ఘట్టమనేని వంశం నుంచి వస్తున్న జయ కృష్ణను డైరెక్ట్ చేస్తున్న అజయ్ భూపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో మహేష్ బాబు కానీ, జయ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఎవరూ జోక్యం చేసుకోవడం లేదని, వాళ్లకు కనీసం స్టోరీ కూడా తెలియదని అన్నాడు.

Published on: Dec 5, 2025, 16:31:25 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

'ఆర్ఎక్స్ 100', 'మహా సముద్రం', 'మంగళవారం' వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఇప్పుడతడు మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేనిని టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాడు. ఇదే మూవీతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కూడా తెలుగు తెరపైకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని చందేరీలో 'శ్రీనివాస మంగాపురం' షూటింగ్ జరుపుకుంటుండగా.. 'హిందుస్థాన్ టైమ్స్'తో మాట్లాడిన అజయ్ భూపతి సినిమా విశేషాలను పంచుకున్నాడు.

రగ్గడ్ లవ్ స్టోరీ.. అజయ్ మార్క్ గ్యారెంటీ

మహేష్ బాబు అస్సలు జోక్యం చేసుకోడు.. వాళ్లకు కనీసం స్టోరీ కూడా తెలియదు.. నన్నే లాంచ్ చేయమని అడిగారు: డైరెక్టర్ అజయ్ భూపతి
మహేష్ బాబు అస్సలు జోక్యం చేసుకోడు.. వాళ్లకు కనీసం స్టోరీ కూడా తెలియదు.. నన్నే లాంచ్ చేయమని అడిగారు: డైరెక్టర్ అజయ్ భూపతి

శ్రీనివాస మంగాపురం సినిమా గురించి అడగ్గానే తన శైలికి తగ్గట్టుగానే ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు అజయ్ భూపతి. "ఇది మీరు రోజూ చూసే రొటీన్ ప్రేమకథ కాదు" అని స్పష్టం చేశాడు. ఎక్కువ వివరాలు బయటపెట్టకుండానే.. "ఇదొక లవ్ స్టోరీనే, కానీ చాలా రగ్గడ్ గా ఉంటుంది. ఇందులో భావోద్వేగాలు ఉంటాయి. ఒక అమాయకత్వం కూడా ఉంటుంది. కచ్చితంగా నా స్టైల్‌లో ఉండే కథ ఇది. ఈ పాత్రలకు కొత్తవాళ్లే కావాలని నేను కోరుకున్నాను. జయకృష్ణ, రాషాల రూపంలో నాకు సరైన నటులు దొరకడం నా అదృష్టం" అని చెప్పుకొచ్చాడు.

కృష్ణ గారి లెగసీ.. నాకు దక్కిన గౌరవం

జయకృష్ణను హీరోగా పరిచయం చేయమని తనను అడిగారని, తానేమీ వాళ్లను సంప్రదించలేదని అజయ్ క్లారిటీ ఇచ్చాడు. "అతన్ని లాంచ్ చేయమని, తొలి సినిమా డైరెక్ట్ చేయమని నన్ను అడిగారు. కృష్ణ గారి వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇదొక గౌరవంగా భావించాను. జయకృష్ణను చూడగానే ఈ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించింది" అని అన్నాడు.

రాషా తడాని గురించి మాట్లాడుతూ.. 'ఆజాద్' సినిమాలోని 'ఉయ్ అమ్మ' పాట ఫేమస్ కాకముందే ఆమెను ఎంపిక చేశామని తెలిపాడు. "నిజానికి రాషా ఇంతకుముందే తెలుగులో నటించాల్సింది. కానీ కుదరలేదు. బహుశా మంచి కోసమేనేమో.. ఈ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోయింది" అని తెలిపాడు.

మహేష్ బాబు, రవీనా టాండన్ జోక్యం ఉందా?

"అస్సలు లేదు.. ఎవరూ జోక్యం చేసుకోలేదు. వాళ్లు నన్ను పూర్తిగా నమ్మారు. నిజానికి జయకృష్ణ కుటుంబానికి అసలు కథేంటో కూడా తెలియదు. కానీ తమ పిల్లలు నాతో పరిచయం అవుతున్నందుకు వాళ్లంతా సంతోషంగా ఉన్నారని నాకు తెలిసింది" అని అజయ్ వివరించాడు.

వీరిద్దరూ స్క్రీన్ మీద చాలా బాగున్నారని, షూటింగ్‌లో వారి నటన చూసి ఎగ్జైట్ అవుతున్నానని దర్శకుడు తెలిపాడు. "సెట్‌కి వెళ్లకముందు వాళ్లకు పెద్దగా శిక్షణ ఇవ్వలేదు. అంతా చివరి నిమిషంలో ఖరారైంది. పైగా వాళ్లలోని బెస్ట్ అవుట్‌పుట్‌ని నేరుగా సెట్‌లోనే రాబట్టాలని అనుకున్నాను" అని అన్నాడు.

తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం కర్ణాటకలోని బళ్లారికి వెళ్లనుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటల ట్యూన్స్ షూటింగ్ మొదలవ్వక ముందే సిద్ధమయ్యాయని, అవి ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయని అజయ్ ధీమా వ్యక్తం చేశాడు. 2026లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe