అమెరికా జీడీపీకి 1.4 బిలియన్​ డాలర్లు ఇచ్చిన Stranger Things! షాకింగ్​ విషయాలు..

నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'స్ట్రేంజర్ థింగ్స్' సిరీస్ అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సైతం దోహదపడింది. ఉద్యోగాల నుంచి వ్యాపారాల వరకు ఈ సిరీస్​ అమెరికా జీడీపీకి 1.4 బిలియన్​ డాలర్లు ఇచ్చింది!

Published on: Dec 25, 2025, 06:04:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దాదాపు పదేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఉర్రూతలూగించిన సైన్స్ ఫిక్షన్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' (Stranger Things) ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఒక సాంస్కృతిక సంచలనంగా మారిన ఈ సిరీస్.. ఇప్పటివరకు 120 కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టించినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. అంతేకాదు ఒక నెట్​ఫ్లిక్స్​ వెబ్​ సిరీస్​.. అమెరికా ఆర్థిక వ్యవస్థలో 1.4 బిలియన్​ డాలర్లను చేర్చడం విశేషం!

స్ట్రేంజర్​ థింగ్స్​తో​ క్రేజీ బిజినెస్​..
స్ట్రేంజర్​ థింగ్స్​తో​ క్రేజీ బిజినెస్​..

ఆర్థిక వ్యవస్థపై 'స్ట్రేంజర్' ప్రభావం..

కేవలం స్క్రీన్ మీద కనిపించే కథగానే కాకుండా, అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా స్ట్రేంజర్​ థింగ్స్​ సిరీస్ భారీ ఊతాన్నిచ్చింది. 2016 నుంచి ఇప్పటివరకు ఈ షో సుమారు 8,000 ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా, అమెరికా జీడీపీకి 1.4 బిలియన్ డాలర్ల మేర దోహదపడింది! ముఖ్యంగా ఈ సిరీస్ చిత్రీకరణ జరిగిన జార్జియా రాష్ట్రంలో పర్యాటక రంగం కళకళలాడిపోయింది. స్ట్రేంజర్​ థింగ్స్​లో చూపించిన ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకులు ఎగబడ్డారు.

అక్కడ సుమారు 650 మిలియన్ డాలర్ల ఆదాయం ఈ షో ద్వారానే లభించడం విశేషం.

వ్యాపార సామ్రాజ్యంలో 'ఎగ్గోస్' మాయాజాలం..

అంతేకాదు ఈ ఒక్క నెట్​ఫ్లిక్స్​ సిరీస్​ అనేక వ్యాపారాల వృద్ధికి సైతం దోహదపడింది. స్ట్రేంజర్​ థింగ్స్​ సిరీస్‌లోని ప్రధాన పాత్ర ‘ఎలెవెన్’కు 'ఎగ్గోస్' వాఫెల్స్ అంటే చాలా ఇష్టం. సీజన్​ 1,2 లో ఈ విషయాన్ని చాలా బాగా చూపిస్తారు.

అప్పటి నుంచి ఈ వాఫెల్స్​​ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా 2017లో కెల్లాగ్స్ కంపెనీ అమ్మకాల్లో 14 శాతం వృద్ధిని నమోదు చేసింది.

అలాగే, ఇందులో పిల్లలు ఆడే ‘డెంజియన్స్ అండ్​ డ్రాగన్స్’ బోర్డ్ గేమ్ పట్ల ఆసక్తి 673 శాతం పెరగడంతో అమ్మకాలు భారీగానే జరిగాయి.

కేవలం సినిమాలకు పరిమితం కాకుండా, తినుబండారాల నుంచి గేమింగ్ వరకు ఈ సిరీస్ ఒక బ్రాండ్‌గా ఎదిగింది.

రికార్డులు తిరగరాసిన స్ట్రేంజర్​ థింగ్స్​ సీజన్ 5..

స్ట్రేంజర్​ థింగ్స్​లో మొత్తం 5 సీజన్​లు ఉంటాయి. సీజన్​ 5 వాల్యుమ్​ 1 నవంబర్​లో విడుదలైంది. వాల్యూమ్​ 2లోని 3 ఎపిసోడ్​లు క్రిస్మస్​ సందర్భంగా విడుదలవుతాయి. ఫినాలే మాత్రం డిసెంబర్​ 31న విడుదల అవుతుంది.

అయితే సీజన్ 5 వాల్యుమ్​ 1 విడుదలైన కేవలం 25 రోజుల్లోనే 0.2 కోట్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం టాప్ 10 చార్ట్​లో 9వ స్థానంలో ఉన్న ఈ సిరీస్, 2026 నాటికి నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విశేషం ఏంటంటే, ఈ సిరీస్ ప్రసారమైన 93 దేశాల్లో 90 దేశాల్లో మొదటి స్థానంలో నిలిచి తన సత్తా చాటుకుంది.

సంగీత ప్రపంచంలోనూ ప్రకంపనలు..

80వ దశకంలో జరిగే ఈ స్ట్రేంజర్​ థింగ్స్​ అన్ని సీజన్స్​లో పాత పాటలాను విపరీతంగా వాడారు. దీని ప్రభావం ఎంతలా ఉందంటే.. నాలుగు దశాబ్దాల క్రితం విడుదలైన పాటలు ఇప్పుడు మళ్లీ చార్ట్ బస్టర్స్​గా నిలుస్తున్నాయి. కేట్ బుష్ పాడిన ‘రన్నింగ్ అప్ దట్ హిల్’ అనే పాట 40 ఏళ్ల తర్వాత అమెరికా టాప్-10 హిట్స్​లో చేరింది. స్పాటిఫై నివేదిక ప్రకారం, ఈ సిరీస్ పుణ్యమా అని పాత పాటల స్ట్రీమింగ్ ఏకంగా 1,250 శాతం పెరిగింది.

స్ట్రేంజర్​ థింగ్స్​ సీజన్​ 5 ఎపిసోడ్​ 5 రిలీజ్​ ఎప్పుడు..?

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. చివరి మూడు ఎపిసోడ్‌ల నిడివి ఇలా ఉంది:

  • ఎపిసోడ్ 5 “షాక్ జాక్”: 1 గంట 8 నిమిషాలు
  • ఎపిసోడ్ 6 “ఎస్కేప్ ఫ్రమ్ కామజోట్జ్”: 1 గంట 15 నిమిషాలు
  • ఎపిసోడ్ 7 “ద బ్రిడ్జ్”: 1 గంట 6 నిమిషాలు

భారత కాలమానం ప్రకారం ఇవి డిసెంబర్​ 26, శుక్రవారం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు నెట్​ఫ్లిక్స్​లో లైవ్​ అవుతాయి.

ఇక 'ది రైట్‌సైడ్ అప్' పేరుతో రానున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నిడివి ఏకంగా రెండు గంటల ఎనిమిది నిమిషాలు ఉండనుంది. భారతీయ కాలమానం ప్రకారం జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 6:30 గంటలకు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ అద్భుత దృశ్యకావ్యం అందుబాటులోకి రానుంది.

ఫినాలే కోసం అమెరికాలో గ్రాండ్​గా ప్లాన్స్​ చేశారు. 500కుపైగా థియేటర్లలో దీనిని ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More