Vijay Speech: అవును నేను నటుడినే.. కానీ మీలాగా రాజకీయాల్లో నటించను: విజయ్ పవర్ఫుల్ స్పీచ్
Vijay Speech: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే (TVK) అధినేత విజయ్ తన ప్రచారంలో దూకుడు పెంచారు. తనను కేవలం నటుడిగా విమర్శిస్తున్న వారికి చురకలు అంటించడమే కాకుండా.. కరూర్ తొక్కిసలాట ఘటనపై అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Vijay Speech: తమిళనాడు రాజకీయ క్షేత్రం ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తోంది. గ్లామర్ పాలిటిక్స్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఈ గడ్డపై.. గ్లోబల్ స్టార్గా ఎదిగిన విజయ్ తన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీతో సరికొత్త యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తుది అంకానికి చేరుకోవడంతో.. విజయ్ తన ప్రసంగాల్లో వాడిని, వేడిని పెంచారు. మంగళవారం (ఏప్రిల్ 21) చెన్నైలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ నుంచి కోట వరకు పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

నటుడిని కాను.. నాయకుడిని
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి విజయ్ని ప్రత్యర్థులు 'సినిమా నటుడు' అంటూ తక్కువ చేసి మాట్లాడుతున్నారు. దీనిపై విజయ్ ఘాటుగా స్పందించారు.
"విజయ్ కేవలం ఒక నటుడు అని ఇక్కడ ఒక మంత్రి పదే పదే విమర్శిస్తున్నారు. అవును, నేను నటుడినే. అది ఆయన కనిపెట్టిన కొత్త విషయమేమీ కాదు. కానీ గుర్తు పెట్టుకోండి.. నేను రాజకీయాల్లోకి వచ్చాక నటించడం లేదు. నిరంతరం రాజకీయ డ్రామాలు ఆడుతున్న మిమ్మల్ని నటులు అనాలా? లేక నటీమణులు అని పిలవాలా?" అంటూ విజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాజకీయాల్లోకి వచ్చాక తన మార్గమేంటో స్పష్టంగా ఉందన్న సంకేతాలను ఆయన ఈ సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.
కరూర్ ఘటనపై ధ్వజమెత్తిన విజయ్
గతేడాది కరూర్లో జరిగిన టీవీకే ర్యాలీలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై విజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటనకు విజయ్ బాధ్యత వహించాలని అధికార పార్టీ డీఎంకే విమర్శిస్తున్న తరుణంలో ఆయన గట్టిగా బదులిచ్చారు.
"పోలీసుల అనుమతితోనే నేను అక్కడికి వెళ్లాను. అంతా లైవ్ లో రికార్డ్ అయ్యింది. ఆ సమయంలో మీరు ఒక వీడియో చేసి మేమేమీ మాట్లాడబోమని చెప్పారు. ఇప్పుడేమో నన్ను నిందిస్తున్నారు. అసలు మీకు మనస్సాక్షి ఉందా?" అని సూటిగా ప్రశ్నించారు. ఈ మరణాలు తనను తీవ్రంగా కలచివేసాయన్న విజయ్.. దీని వెనుక అధికార పక్షం వైఫల్యం ఉందని పరోక్షంగా ఆరోపించారు.
సినిమా కష్టాలు.. వ్యక్తిగత వివాదాలు
ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, తన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలలో ఎదురవుతున్న అడ్డంకులపై విజయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. హెచ్.వినోత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెన్సార్ చిక్కుల్లో పడటం.. మరోవైపు ఏప్రిల్ 9న సినిమా హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ అవ్వడం విజయ్ టీమ్ను ఇబ్బందుల్లో నెట్టాయి. దీనిపై పోలీసులు ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
కేవలం ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాకుండా, విజయ్ వ్యక్తిగత జీవితం కూడా ఇటీవల చర్చనీయాంశమైంది. భార్య సంగీతతో విడాకుల వార్తలు, అనంతరం నటి త్రిషతో కలిసి ఒక వివాహ వేడుకలో ఒకే రకమైన దుస్తుల్లో కనిపించడం వంటి అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వీటిపై విజయ్ ఎక్కడా స్పందించకుండా తన పూర్తి దృష్టిని ఏప్రిల్ 23 ఎన్నికలపైనే కేంద్రీకరించారు. ఒంటరిగానే పోరాటం చేస్తానని ప్రకటించిన ఈ దళపతి.. తమిళనాడు ఓటర్లను ఎంతవరకు మెప్పిస్తారో వేచి చూడాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ప్రశ్న: విజయ్ రాజకీయ పార్టీ పేరు ఏమిటి?
సమాధానం: విజయ్ స్థాపించిన పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం (TVK).
ప్రశ్న: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి?
సమాధానం: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి.
ప్రశ్న: విజయ్ చివరి సినిమా 'జన నాయకన్' ఎందుకు ఆలస్యమవుతోంది?
సమాధానం: సెన్సార్ బోర్డ్ (CBFC) నుంచి సర్టిఫికేషన్ రావడంలో జాప్యం జరగడం వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమవుతోంది.
ప్రశ్న: కరూర్ ఘటన దేనికి సంబంధించింది?
సమాధానం: గత ఏడాది జరిగిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించారు. దీనిపై ప్రస్తుతం రాజకీయ రగడ సాగుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


