Thalapathy Vijay Divorce: కన్న కొడుకే విజయ్‌ను దూరం పెట్టేశాడా? ఇన్‌స్టాలో తండ్రిని అన్‌ఫాలో అయిన జేసన్!

తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ (Thalapathy Vijay Divorce) తన భార్య సంగీతతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కన్న కొడుకు జేసన్ సంజయ్ కూడా అతన్ని దూరం పెట్టినట్లు వస్తున్న వార్తలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఆ వివరాలు చూడండి.

Published on: Mar 1, 2026, 15:19:45 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ సినిమా ఇండస్ట్రీలో 'దళపతి'గా నీరాజనాలు అందుకుంటున్న నటుడు, 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా విజయ్, అతని భార్య సంగీత స్వర్ణలింగం విడిపోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలు నిజమేననిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సంగీత విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే సమయంలో కన్న కొడుకు జేసన్ సంజయ్ కూడా ఇన్‌స్టాలో తండ్రిని అన్ ఫాలో చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Thalapathy Vijay Divorce: కన్న కొడుకే విజయ్‌ను దూరం పెట్టేశాడా? ఇన్‌స్టాలో తండ్రిని అన్‌ఫాలో అయిన జేసన్! (Instagram)
Thalapathy Vijay Divorce: కన్న కొడుకే విజయ్‌ను దూరం పెట్టేశాడా? ఇన్‌స్టాలో తండ్రిని అన్‌ఫాలో అయిన జేసన్! (Instagram)

కొడుకు అన్‌ఫాలో చేశాడా?

దళపతి విజయ్ విడాకుల వార్తల నేపథ్యంలో అతని కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేసన్ మొదటి నుంచీ తన తండ్రి అకౌంట్‌ను ఫాలో అవ్వడం లేదని కొందరు వాదిస్తుంటే, తాజా పరిణామాల వల్లే అతడు దూరంగా ఉంటున్నాడని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం విజయ్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరినీ ఫాలో కావడం లేదు.

కోర్టులో సంగీత పిటిషన్: అసలు ఏం జరిగింది?

కొన్ని రిపోర్టుల ప్రకారం సంగీత.. చెంగల్పట్టు జిల్లా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. 1954 నాటి ప్రత్యేక వివాహ చట్టం కింద ఆమె ఈ విన్నపాన్ని కోర్టు ముందు ఉంచారు. తమ వివాహం 1998లో బ్రిటన్‌లో రిజిస్టర్ అయిందని, ఆ తర్వాత 1999 ఆగస్టు 25న చెన్నైలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నామని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది.

తొలినాళ్లలో తమ దాంపత్యం ఎంతో అన్యోన్యంగా సాగిందని, పిల్లల పెంపకం కోసం తాను పూర్తి సమయాన్ని కేటాయించానని సంగీత వివరించింది. అయితే 2021 ఏప్రిల్ నుంచి తమ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

మరో నటితో విజయ్ బంధం?

సంగీత తన పిటిషన్‌లో ఒక సంచలన విషయాన్ని ప్రస్తావించింది. 2021లో విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, అది తనకు తీవ్ర మానసిక వేదనను మిగిల్చిందని ఆమె పేర్కొంది. విజయ్ ఆ నటితో కలిసి విదేశీ పర్యటనలు చేయడం, బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం వంటివి తనను మానసిక హింసకు గురిచేశాయని ఆరోపించింది. సదరు నటి విజయ్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నా, అతడు అడ్డుకోలేదని.. ఇది తనను బహిరంగంగా అవమానించడమేనని సంగీత వాపోయింది.

విడివిడిగానే ఒకే ఇంట్లో..

తమ మధ్య రాజీ కోసం 2021 నుంచి 2025 మధ్య కాలంలో అనేక చర్చలు జరిగాయని, కానీ అవి సఫలం కాలేదని సంగీత తెలిపింది. కేవలం కాగితాల మీద మాత్రమే తమ బంధం మిగిలి ఉందని, ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరికి వారు విడివిడిగానే ఉంటున్నామని ఆమె పేర్కొంది. తనకు శాశ్వత భరణంతో పాటు, నీలాంకరైలోని ఇంట్లో నివసించే హక్కును కల్పించాలని ఆమె కోర్టును కోరింది.

విజయ్, సంగీతలకు 1996లో పరిచయం ఏర్పడింది. శ్రీలంకకు చెందిన సంగీత బ్రిటన్‌లో పెరిగింది. వీరికి కుమారుడు జేసన్, కుమార్తె దివ్య ఉన్నారు. ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న తరుణంలో ఈ విడాకుల వార్త అతని అభిమానులను, రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. దీనిపై విజయ్ వైపు నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More