నా అకౌంట్లో డబ్బులు లేవు.. అందుకే హీరోనయ్యాను: విజయ్ సేతుపతి కామెంట్స్తో పడీపడీ నవ్విన కపిల్ శర్మ
ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నటుడిగా ఎందుకు మారాల్సి వచ్చిందో చెబుతూ అతడు వేసిన జోక్కు కపిల్ శర్మతో పాటు అక్కడున్నవారంతా పగలబడి నవ్వారు. ఆ ఆసక్తికర సంఘటన, ‘గాంధీ టాక్స్’ సినిమా వివరాలు తెలుసుకోండి.
విజయ్ సేతుపతి తన నెక్ట్స్ మూవీ ‘గాంధీ టాక్స్’ ప్రచారంలో భాగంగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో సందడి చేయబోతున్నాడు. అతనితో పాటు ఆ సినిమా సహ నటులు అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ జాదవ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. అందులో విజయ్ సేతుపతి తాను ఎందుకు నటుడిని అయ్యానో చెప్పిన విధానం నవ్వు తెప్పించింది.

అకౌంటెంట్ నుంచి యాక్టర్గా..
ఆ వీడియోలో కపిల్ శర్మ.. విజయ్ సేతుపతిని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. "మీరు ఎప్పుడైనా ఏదైనా యాక్టింగ్ స్కూల్ కు వెళ్ళారా అని ప్రశ్నించాడు. దానికి విజయ్ బదులిస్తూ.. తాను ఎప్పుడూ వెళ్లలేదని, దానికి బదులుగా ఒక నాటక బృందంలో లెక్కలు రాసే అకౌంటెంట్ గా పనిచేశానని చెప్పాడు.
అప్పుడు కపిల్ శర్మ.. "మీరు అక్కడ పని చేస్తున్నప్పుడు ఎవరైనా పెద్ద నటుడి బ్యాంకు ఖాతా వివరాలు చూసి, స్ఫూర్తి పొంది నటన వైపు వచ్చారా?" అని సరదాగా అడిగాడు. దానికి విజయ్ సేతుపతి ఇచ్చిన సమాధానం అదిరిపోయింది. "లేదు, నేను నా బ్యాంకు ఖాతా చూసుకున్నాను. అందులో అసలు డబ్బే లేదు. అందుకే డబ్బు సంపాదించడానికి ఇలా నటుడిగా మారాను" అని బదులిచ్చాడు.
చప్పట్లు కొట్టిన సహనటులు..
విజయ్ సేతుపతి నిజాయతీగా, చమత్కారంగా చెప్పిన ఈ సమాధానం విని పక్కనే ఉన్న సహ నటులు సిద్ధార్థ్ జాదవ్, అదితి రావు హైదరీ ఆశ్చర్యపోయారు. వారు తమ నవ్వు ఆపుకోలేక గట్టిగా చప్పట్లు కొట్టారు. కపిల్ శర్మ కూడా ఆ సమాధానానికి ముగ్ధులై గట్టిగా నవ్వేశాడు.
ఈ వీడియో చూసిన అభిమానులు నవ్వుతున్న ఎమోజీలతో కామెంట్స్ సెక్షన్ ను నింపేశారు. కపిల్ శర్మ కార్యక్రమానికి విజయ్ సేతుపతి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. తన టీమ్ తో కలిసి అతడు ‘గాంధీ టాక్స్’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఈ ఎపిసోడ్ జనవరి 31న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
‘గాంధీ టాక్స్’ గురించి..
‘గాంధీ టాక్స్’ సినిమా గురించి చెప్పాలంటే.. కిషోర్ పాండురంగ్ బేలేకర్ దీనికి దర్శకత్వం వహించాడు. జీ స్టూడియోస్, క్యూరియస్, మూవీమిల్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో డైలాగులు ఉండవు. ఇది ఒక మూకీ కావడం విశేషం.
ఇందులో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ జాదవ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. 2023లో జరిగిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైన ఈ సినిమా.. ఎట్టకేలకు జనవరి 30న అంటే ఈ వారమే థియేటర్లలో విడుదల కానుంది.

E-Paper












