Drink: మద్యం మత్తులో అమ్మను బాధపెట్టాను.. మహిళలకు అశ్లీల ఫోన్ కాల్స్ చేశాను: పశ్చాత్తాపపడిన రచయిత, నటుడు పీయూష్ మిశ్రా!
Piyush Mishra About Alcoholism Struggles: నటుడు, రచయిత పీయూష్ మిశ్రా తన మద్యపాన వ్యసనంపై మనసు విప్పారు. ఆ అలవాటు వల్ల తన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన గౌరవం ఎలా దెబ్బతిన్నాయో వివరిస్తూ.. ఆ వ్యసనం ఒక ప్రాణాంతక వ్యాధి వంటిదని హెచ్చరించారు. ఇప్పుడు పీయూష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ నటుడు, రచయిత, గాయకుడు పీయూష్ మిశ్రా అంటే తెలియని సినిమా ప్రేమికులు ఉండరు. అయితే, వెండితెరపై ఎంతో హుందాగా కనిపించే పీయూష్ మిశ్రా జీవితంలో ఒక చీకటి కోణం ఉంది. అది ‘మద్యపానం’. సుదీర్ఘకాలం పాటు తాగుడుకు బానిసైన పీయూష్, ఆ వ్యసనం తనను ఎలా పాతాళానికి నెట్టేసిందో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మత్తులో తాను చేసిన తప్పులను తలచుకుంటూ పీయూష్ మిశ్రా ఎమోషనల్ అయ్యారు.

"అది ఒక ప్రాణాంతక వ్యాధి"
శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో పాల్గొన్న పీయూష్ మిశ్రా వ్యసనం మనిషిని ఎలా లోబరుచుకుంటుందో వివరించారు. "ఒకానొక దశలో మద్యం తాగడం తప్పనిసరి అనిపిస్తుంది. తాగే కొద్దీ ఇంకా తాగాలనే కోరిక పెరుగుతుంది. మద్యపానం అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. మనకు ఇష్టం ఉన్నా లేకున్నా శరీరం మద్యాన్ని కోరుకుంటుంది. ఆ నరకాన్ని నేను స్వయంగా అనుభవించాను" అని పీయూష్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు.
మత్తులో చేసిన తప్పులు.. వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలు
మద్యం మత్తులో ఉన్నప్పుడు తన ప్రవర్తన తనకే నచ్చేది కాదని పీయూష్ మిశ్రా చెప్పుకొచ్చారు. "తాగిన తర్వాత నేను చేసిన పనులు చూసి.. ‘ఇది నేను కాదు’ అని నాకే అనిపించేది. మా అమ్మతో నాకు మనస్పర్థలు ఉండేవి. మత్తులో ఆమెను ఎంతో బాధపెట్టేలా మాట్లాడాను. ఆమెను క్షమించాలని మనసులో ఉన్నా, మత్తులో మాత్రం నోరు జారేవాడిని. అలాగే, మహిళలకు అసభ్యకరమైన, అశ్లీల ఫోన్ కాల్స్ చేసేవాడిని. మరుసటి రోజు ఉదయం నాకు ఆ విషయాలేవీ గుర్తుండేవి కావు. నాపై నాకు నియంత్రణ ఉండేది కాదు" అని పీయూష్ మిశ్రా తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు.
వృత్తిపై పడిన ప్రభావం.. మలుపు తిప్పిన అనారోగ్యం
షూటింగ్ సెట్స్లో తను ఎప్పుడూ మద్యం ముట్టలేదని పీయూష్ స్పష్టం చేసినప్పటికీ, ఆయన ప్రవర్తన వల్ల పరిశ్రమలో చెడ్డ పేరు వచ్చిందని ఒప్పుకున్నారు. "నాతో పని చేయడం కష్టమని సహోద్యోగులు భావించేవారు. నా ఇమేజ్ దెబ్బతింది. నేను మారాను అని అందరికీ వివరించుకోవడం నాకు చాలా అలసటను ఇచ్చింది" అని పీయూష్ మిశ్రా తెలిపారు.
అయితే, 2009లో వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్ (మెదడు పక్షవాతం) పీయూష్ మిశ్రా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ‘విపాసన’ వంటి ఆధ్యాత్మిక మార్గాల ద్వారా తన వ్యసనాన్ని అదుపులోకి తెచ్చుకున్నానని పీయూష్ చెప్పారు. ప్రస్తుతం పూర్తిగా మానేయకపోయినా, తనపై తనకు నియంత్రణ ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుత సినిమాలు
పీయూష్ మిశ్రా ఇటీవల జీ స్టూడియోస్ నిర్మాణంలో వచ్చిన 'రాహు కేతు' చిత్రంలో పుల్కిత్ సామ్రాట్, వరుణ్ శర్మలతో కలిసి నటించారు. దీనికి ముందు ఆయన 'క్రేజీ' (Crazxy), 'ఆజాద్' (2025) వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తన ఉనికిని చాటుకుంటున్నారు. నటనతో పాటు థియేటర్, సంగీతంలోనూ ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


