Yuvraj Singh: ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమం.. కేంద్రానికి యువరాజ్ సింగ్ విజ్ఞప్తి.. దేశ భవిష్యత్తు కోసం అంటూ!

Yuvraj Singh On Delhi Protest: దేశ రాజధాని ఢిల్లీలో విద్యా సంస్కరణల కోసం సాగుతున్న ఆందోళనలపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించారు. ఈ గొడవ పక్కనబెట్టి ప్రభుత్వం, నిరసనకారులు పరస్పర చర్చల ద్వారా మాత్రమే సమస్యను పరిష్కరించుకోవాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.

Published on: Jul 23, 2026, 10:08:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Yuvraj Singh On Delhi Protest: దేశ రాజధాని ఢిల్లీని విద్యార్థి ఉద్యమం కుదిపేస్తోంది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలని, ప్రస్తుత లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు, మద్దతుదారులు రోడ్లపైకి వచ్చారు.

ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమం.. కేంద్రానికి యువరాజ్ సింగ్ విజ్ఞప్తి.. దేశ భవిష్యత్తు కోసం అంటూ! (REUTERS)
ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమం.. కేంద్రానికి యువరాజ్ సింగ్ విజ్ఞప్తి.. దేశ భవిష్యత్తు కోసం అంటూ! (REUTERS)

యువరాజ్ సింగ్ ఆందోళన

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ చేపట్టిన ఈ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు బైఠాయించారు. ఈ ఆందోళనలపై భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇరు వర్గాలు పట్టువిడుపులు ప్రదర్శించాలని యువరాజ్ కోరారు. హింసతో ఏదీ సాధించలేమని, శాంతియుత చర్చలే పరిష్కార మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్పందించిన యువరాజ్ సింగ్, దేశంలో చదువుకునే ప్రతి ఒక్కరికీ సురక్షితమైన వాతావరణం పొందే హక్కు ఉందన్నారు.

'చర్చలతోనే సత్ఫలితాలు': యువరాజ్ ఎమోషనల్ పోస్ట్

"ప్రతి చిన్నారి, విద్యార్థి, మహిళ సురక్షిత వాతావరణంలో చదువుకుని తమ కలలను నెరవేర్చుకునే హక్కు కలిగి ఉన్నారు. మన యువత సంక్షేమమే భారత్ భావి పునాది. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇరు వర్గాలు పరస్పర చర్చల ద్వారా ఈ సమస్యకు ప్రశాంతమైన పరిష్కారం కనుగొనాలి" అని యువరాజ్ విజ్ఞప్తి చేశారు.

జంతర్ మంతర్ వద్ద రణరంగం.. కేజ్రీవాల్ పరామర్శ

పార్లమెంట్ వైపు దూసుకుపోతున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఢిల్లీ వీధులు రణరంగాన్ని తలపించాయి. జంతర్ మంతర్ వద్ద పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంలో దాదాపు 60 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

విద్యార్థులు వేసుకున్న తాత్కాలిక టెంట్లను పోలీసులు తొలగించినప్పటికీ, నిరసనకారులు వెనక్కి తగ్గకుండా అహోరాత్రులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు విపక్ష నేతలు జంతర్ మంతర్‌ను సందర్శించి విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు.

సోనమ్ వాంగ్‌చుక్‌కు విజ్ఞప్తి

మరోవైపు ఈ ఉద్యమానికి మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు సీజేపీ ప్రతినిధులు ఒక బహిరంగ లేఖ రాశారు.

"మా డిమాండ్ల సాధన కోసం మీరు చేస్తున్న త్యాగం వేలాది మందికి స్ఫూర్తినిచ్చింది. అయితే మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. దయచేసి మీ దీక్షను విరమించండి. పరీక్షల నిర్వహణలో న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని మేము ముందడుగు వేయిస్తాం" అని నిరసనకారులు ఆ లేఖలో స్పష్టం చేశారు.

యువరాజ్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ
యువరాజ్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ

విద్యార్థుల డిమాండ్లపై చర్చలు

ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థుల డిమాండ్లపై చర్చలు ప్రారంభించాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More