...
...
Next Story

Alzheimers : వ్యాయామం వల్ల అల్జీమర్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుందా?

వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే వ్యాయామం చేయడం వలన మెదడు కూడా చురుకుగా ఉంటుంది. దీనివలన అల్జీమర్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుందా? నిపుణులు ఏం అంటున్నారు?

Published on: Jun 25, 2026 11:18 AM IST
Advertisement

వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు, డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యల గురించి చాలామందిలో ఆందోళన పెరుగుతోంది. అల్జీమర్స్‌ను పూర్తిగా నివారించే మార్గం ఇప్పటివరకు లేకపోయినా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. దీనిపై విజయవాడ మణిపాల్ హాస్పిటల్, న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ మురళి వివరాలు వెల్లడించారు.

వ్యాయామం-అల్జీమర్స్ మధ్య సంబంధం
వ్యాయామం-అల్జీమర్స్ మధ్య సంబంధం

వ్యాయామం కేవలం శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికే కాదు, మెదడుకూ ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం వల్ల మెదడుకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో మెదడుకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలు సక్రమంగా అందుతాయి. అంతేకాదు, మెదడులో కొత్త కణాలు ఏర్పడటానికి కూడా ఇది సహాయపడుతుంది. నరాల కణాలను రక్షించి, మెదడులోని వివిధ భాగాల మధ్య సమాచార మార్పిడిని మెరుగుపరిచే కొన్ని ప్రత్యేక ప్రోటీన్ల ఉత్పత్తిని కూడా వ్యాయామం ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ చురుగ్గా నేర్చుకునే సామర్థ్యానికి, జ్ఞాపకశక్తికి చాలా అవసరం.

జీవితాంతం శారీరకంగా చురుకుగా ఉండే వారిలో అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, జన్యుపరంగా అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నవారిలో కూడా, వ్యాయామం వల్ల అల్జీమర్స్ లక్షణాలు ఆలస్యంగా కనిపించేలా చేయడంలో సహాయపడవచ్చు.

వ్యాయామం ఇంత ప్రభావవంతంగా ఉండటానికి మరో ముఖ్య కారణం, డిమెన్షియాకు దారితీసే అనేక ప్రమాద కారకాలను ఇది నియంత్రించడమే. వ్యాయామం వల్ల బీపీ, రక్తంలో షుగర్ లెవెల్స్ , కొలెస్ట్రాల్, అధిక బరువు (ఊబకాయం) నియంత్రణలో ఉంటాయి. శరీరంలో వాపు సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే మంచి నిద్రకు సహాయపడటంతో పాటు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. ఇవన్నీ దీర్ఘకాలంలో మెదడు పనితీరుపై ప్రభావం చూపే అంశాలే.

వ్యాయామంతో పాటు మరికొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను కూడా పాటించడం చాలా ముఖ్యం. పోషకాలతో నిండిన సమతులాహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, పజిల్స్ వంటి మెదడుకు వ్యాయామం ఇచ్చే పనులు చేయడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మెలిసి ఉండడం, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం వంటి అంశాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.

వ్యాయామం అల్జీమర్స్‌ను పూర్తిగా అడ్డుకోలేకపోయినా, వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరుని మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించడంలో అత్యంత ప్రభావవంతమైన లైఫ్‍స్టైల్ మార్పుల్లో ఇది ఒకటి. చిన్న వయసు నుంచే వ్యాయామం మొదలుపెడితే మంచిది. అయితే ఇంగ్లీషులో చెప్పినట్టు, బెటర్ లేట్ దెన్ నెవర్... ఏ వయసులో ప్రారంభించినా ఆలస్యం కాదు. ఈరోజు మీరు వేసే ప్రతి అడుగు, భవిష్యత్తులో ఆరోగ్యకరమైన మెదడు కోసం మీరు పెట్టే పెట్టుబడిగా అనుకోవచ్చు.

డాక్టర్ మురళి, న్యూరాలజీ కన్సల్టెంట్

విజయవాడ మణిపాల్ హాస్పిటల్

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON