జొమాటో కీలక నిర్ణయం: అనలాగ్ పనీర్‌పై నిషేధం.. రెస్టారెంట్లకు హెచ్చరిక

పాల ఉత్పత్తులకు బదులుగా కృత్రిమ రసాయనాలతో తయారయ్యే 'అనలాగ్ పనీర్' విక్రయాలపై ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కఠిన చర్యలు చేపట్టింది. ప్లాట్‌ఫామ్ నుంచి అనలాగ్ డైరీ ఉత్పత్తులతో తయారు చేసే వంటకాలను తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

Published on: Aug 31, 2026, 14:18:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. పాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ పదార్థాలతో తయారయ్యే అనలాగ్ డైరీ ఉత్పత్తులపై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించింది. తమ ప్లాట్‌ఫామ్‌పై అనలాగ్ పనీర్‌తో చేసే వంటకాల విక్రయాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

జొమాటో కీలక నిర్ణయం: అనలాగ్ పనీర్‌పై నిషేధం.. రెస్టారెంట్లకు హెచ్చరిక
జొమాటో కీలక నిర్ణయం: అనలాగ్ పనీర్‌పై నిషేధం.. రెస్టారెంట్లకు హెచ్చరిక

ప్లాట్‌ఫామ్ నుంచి తొలగింపు.. నిబంధనలు పాటించకపోతే డి-లిస్టింగ్

రెస్టారెంట్ భాగస్వాములు తమ వంటకాల్లో అనలాగ్ పదార్థాలు వాడుతున్నట్లు స్పష్టం చేసిన ఐటెమ్‌లను ప్లాట్‌ఫామ్ నుంచి జొమాటో ఇప్పటికే తొలగించింది. రెస్టారెంట్లు వెంటనే అసలైన సహజసిద్ధమైన డైరీ ఉత్పత్తులకు మారాలని, వెంటనే మారడం సాధ్యం కాని పక్షంలో ఆయా వంటకాలను మెనూ నుంచి తొలగించాలని ఆదేశించింది. తమ సప్లయర్లు అందించే ఉత్పత్తుల లేబుళ్లు, పదార్థాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని రెస్టారెంట్లకు సూచించింది. నిబంధనలు పాటించని రెస్టారెంట్లను ప్లాట్‌ఫామ్ నుంచి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది.

"ఎక్కువ మందికి నాణ్యమైన ఆహారాన్ని అందించడమే జొమాటో ప్రధాన లక్ష్యం. వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ప్లాట్‌ఫామ్‌లో పారదర్శక ప్రమాణాలు పాటించడమే మా ప్రాధాన్యం. ఈ లక్ష్యం దిశగా మా భాగస్వామ్య రెస్టారెంట్లతో కలిసి పనిచేస్తున్నాం" అని జొమాటో సీఈఓ ఆదిత్య మంగ్లా తెలిపారు.

అసలు ఏంటీ 'అనలాగ్ పనీర్'?

పాలు ఉపయోగించకుండా వంట నూనెలు, స్టార్చ్, ప్లాంట్ ప్రోటీన్లు, ఎమల్సిఫైయర్లు, ఇతర రసాయన పదార్థాలను కలిపి తయారు చేసే కృత్రిమ పనీర్‌ను 'అనలాగ్ పనీర్' అంటారు. పాల కొవ్వు స్థానంలో చౌకగా లభించే వంట నూనెలను వాడి దీనిని తయారు చేస్తారు. చూడటానికి, రుచికి అసలైన పనీర్‌లాగే అనిపించినప్పటికీ, ఇందులో పాల గుణాలు ఉండవు.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలు.. మహారాష్ట్రలో నిషేధం

కృత్రిమ పనీర్ అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. అనలాగ్ ఉత్పత్తులను స్పష్టమైన లేబులింగ్‌తో విక్రయించవచ్చని, కానీ కృత్రిమ పనీర్‌ను 'పనీర్' పేరుతో అమ్మడం లేదా వంటకాల్లో వాడటం ఆహార భద్రత-ప్రమాణాల చట్టం 2006 ప్రకారం తీవ్రమైన నేరమని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) స్పష్టం చేసింది.

మరోవైపు, మహారాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ పనీర్ తయారీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధించింది. ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 మధ్య కాలంలో అక్కడ నిర్వహించిన తనిఖీల్లో సేకరించిన 308 పనీర్ శాంపిళ్లలో 109 శాంపిళ్లు (35.4 శాతం) నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. వీటిలో 79 శాంపిళ్లు నాసిరకంగా, మరో 30 శాంపిళ్లు ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జొమాటో వినియోగదారుల ప్రయోజనాల కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More