8th Pay Commission : ‘ప్రతి 3 నెలలకు డీఏ పెంపు’- 8వ వేతన సంఘం ముందు భారీ డిమాండ్లు..
8th Pay Commission latest news : 8వ వేతన సంఘం ముందు భారత్ పెన్షనర్స్ సమాజ్ కీలక డిమాండ్లు ఉంచింది. ప్రతి మూడు నెలలకోసారి డీఏ/డీఆర్ సవరించాలని, కనీస పెన్షన్ను రూ.45,000కు పెంచాలని కోరింది.
లక్షలాది మంది పింఛనుదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు అందాయి. దాదాపు 10 లక్షల మంది పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్ పెన్షనర్స్ సమాజ్ (బీపీఎస్) 8వ వేతన సంఘం ముందు పలు విజ్ఞప్తులు ఉంచింది. ధరల పెరుగుదల భారాన్ని తట్టుకునేందుకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) సవరణను ప్రతి మూడు నెలలకు ఒకసారి చేపట్టాలని కోరింది. అలాగే డీఆర్ 25 శాతాన్ని దాటినప్పుడు దానిని ప్రాథమిక పెన్షన్లో కలపాలని విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతం డీఏ, డీఆర్ ఏడాదికి రెండుసార్లు సవరిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం పెన్షనర్ల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోందని, అందుకే త్రైమాసిక ప్రాతిపదికన దీనిని సవరించాలని బీపీఎస్ స్పష్టం చేసింది.
ఆగస్టు 7న వేతన సంఘం అధికారులతో జరిగిన సమావేశంలో ఈ డిమాండ్లను బీపీఎస్ సభ్యులు ప్రస్తావించారు. 2026 జనవరి 1కి ముందు, ఆ తర్వాత రిటైర్ అయిన పెన్షనర్ల మధ్య వ్యత్యాసం లేకుండా సమానమైన పింఛను సవరణ చేపట్టాలని కోరారు.
భారత్ పెన్షనర్స్ సమాజ్ ప్రధాన డిమాండ్లు..
బీపీఎస్ ప్రతిపాదనలు | డిమాండ్లు |
|---|---|
| డీఆర్/డీఆర్ రివిజన్ | ప్రతి 3 నెలలకు |
| డీఆర్ మర్జర్ | 25% |
| మినిమమ్ బేసిక్ పే | రూ. 69,000 |
| ఫిట్మెంట్ ఫ్యాక్టర్ | 3.83 |
| కనీస పెన్షన్ | రూ. 45,000 |
| ఫ్యామిలీ ఫార్ముల | 5.2 వెయిటెడ్ యూనిట్స్ |
గమనిక: ఇవి కేవలం బీపీఎస్ సంఘం 8వ వేతన సంఘానికి సమర్పించిన సిఫార్సులు మాత్రమే. ఇవి ఇంకా ప్రభుత్వం ఆమోదించిన అధికారిక ప్రయోజనాలు కావు. తుది నిర్ణయం వేతన సంఘం సిఫార్సులు, ప్రభుత్వ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది.
- త్రైమాసిక డీఏ/డీఆర్ సవరణతో పాటు కనీస పెన్షన్ను రూ.45,000గా నిర్ణయించాలని కోరారు.
- 3.83 ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో కనీస ప్రాథమిక వేతనం రూ.69,000 ఉండాలని ప్రతిపాదించారు.
- 5.2 వెయిటెడ్-యూనిట్ కుటుంబ ఫార్ములాను ఉపయోగించి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను లెక్కించాలని సూచించారు.
- ప్రతి 10 సంవత్సరాలకు బదులుగా ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలు, పెన్షన్లను సమీక్షించాలని కోరారు.
1955లో ఏర్పాటైన ఈ సంస్థ 245 అనుబంధ సంఘాల ద్వారా దాదాపు 10 లక్షల మంది పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది.
జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని 8వ వేతన సంఘం తన తుది నివేదికను వచ్చే ఏడాది మధ్య నాటికి సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లోని సంఘాలను కలిసింది.
2025 నవంబర్ 3 నాటికి ఏర్పాటైన ఈ సంఘానికి కేంద్ర కేబినెట్ 18 నెలల గడువు ఇచ్చింది. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర సంఘాలతో కమిషన్ చర్చలు జరుపుతోంది. తుది నిర్ణయం వెలువడే వరకు పెన్షనర్లు వేచి చూడాల్సిందే.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


