Honour killing : యాక్సిడెంట్ కాదు.. పరువు హత్య! 22ఏళ్ల యువతిని దారుణంగా చంపిన తండ్రి, సోదరుడు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంగా నమోదైన కేసులో దిగ్భ్రాంతికర కోణం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిందనే కోపంతో కన్న తండ్రి, తోడబుట్టిన సోదరుడే కలిసి 22 ఏళ్ల యువతిని సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశారు.

Published on: Sep 9, 2026, 13:38:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సమాజంలో కుటుంబ పరువు పేరిట జరుగుతున్న దారుణాలకు మరొక అమాయక ప్రాణం బలయ్యింది! గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గత నెలలో జరిగిన ఒక హిట్ అండ్ రన్ కేసును ఛేదించిన పోలీసులకు షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. అజాగ్రత్తగా వచ్చిన వాహనం ఢీకొట్టడం వల్ల యువతి మృతి చెందిందని నమ్మించిన ఘటన, నిజానికి పక్కా పథకం ప్రకారం జరిగిన దారుణ పరువు హత్య అని తేలింది. సొంత తండ్రి, సోదరుడే కలిసి ఆ యువతిని అత్యంత దారుణంగా కొట్టి చంపి, ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు!.

యాక్సిడెంట్ కాదు.. పరువు హత్య!
యాక్సిడెంట్ కాదు.. పరువు హత్య!

బాధితురాలు సోఫియా (22) స్థానిక ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తుండేది. మూడు నెలల క్రితం ఒక వ్యక్తితో ఉన్న ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుటుంబంలో వివాదం మొదలైంది. సమాజంలో తమ పరువు పోయిందనే తీవ్ర ఆగ్రహంతో ఉన్న తండ్రి మహమ్మద్ ఫారూక్, సోదరుడు మహమ్మద్ హాబిల్ కలిసి ఆమెను చంపేయాలని కుట్ర పన్నారు.

సుత్తితో తలపై దాడి.. ఆపై డ్రామా!

పోలీసుల విచారణ ప్రకారం.. ఆగస్టు 12వ తేదీ రాత్రి ప్రణాళిక ప్రకారమే సోఫియాను బైక్‌పై బయటకు తీసుకెళ్లారు. మార్గమధ్యంలో ఘెల్జీపురా గ్రామం వద్ద ఉన్న ఒక మట్టి రోడ్డువైపు బైక్‌ను మళ్లించారు. ముందే ప్యాంటులో దాచుకున్న ఇనుప సుత్తితో సోదరుడు హాబిల్, సోఫియా తలపై మూడుసార్లు బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావమై ఆమె స్పృహతప్పి పడిపోగానే, ఆమె మృతదేహాన్ని తిరిగి ప్రధాన రహదారిపైకి తీసుకొచ్చారు.

అనంతరం ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు బైక్‌ను కూడా కావాలనే ధ్వంసం చేశారు. ఆ తర్వాత హాబిల్ నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి, ఘెల్జీపురా కూడలి వద్ద వేగంగా వచ్చిన ఒక వాహనం తమ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టిందని నాటకమాడాడు. ఈ ప్రమాదంలో చెల్లెలి తలకు తీవ్ర గాయాలయ్యాయని, తనకు స్వల్ప గాయాలయ్యాయని నమ్మించే ప్రయత్నం చేశాడు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి!

గాయపడిన సోఫియాను వెంటనే సోలా సివిల్ ఆసుపత్రికి తరలించగా, మరుసటి రోజు పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే, ప్రమాదం జరిగిన తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా లోతుగా విచారణ జరిపారు. సాంకేతిక ఆధారాలు, కుటుంబ సభ్యుల ప్రవర్తనను పరిశీలించిన తర్వాత అసలు నిజం బయటపడింది. వీడియో వైరల్ కావడం వల్ల వచ్చిన అవమానాన్ని తట్టుకోలేకే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.

ప్రస్తుతం తండ్రీకొడుకులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని, వారిపై హత్య కేసు నమోదు చేశారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More