Ajinkya Rahane : గుడ్​ బై జింక్స్! క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన అజింక్య రహానే

Ajinkya Rahane retirement : భారత టెస్టు జట్టు మాజీ వైస్ కెప్టెన్, క్లాసిక్ బ్యాటర్ అజింక్య రహానే.. అంతర్జాతీయ, దేశవాళీ సహా అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 

Published on: Jul 30, 2026, 10:34:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మిడిలార్డర్ భరోసా, క్లాసిక్ బ్యాటర్ అజింక్య రహానే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు 38ఏళ్ల రహానే అధికారికంగా ప్రకటించాడు.

ఆజింక్య రహానే (AFP)
ఆజింక్య రహానే (AFP)

రహానే చివరిసారిగా 2026 ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు నాయకత్వం వహిస్తూ కనిపించాడు. 14 మ్యాచ్‌ల్లో 335 పరుగులు చేశాడు. కాగా ఇటీవల భారత జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వాలనే నిశ్చయంతో ఉన్నప్పటికీ, 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలకడమే సరైన నిర్ణయం అని రహానే భావించాడు.

టి20లతో అరంగేట్రం.. టెస్టుల్లో తిరుగులేని ప్రస్థానం!

2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన టి20 మ్యాచ్ ద్వారా రహానే భారత జట్టులోకి అడుగుపెట్టాడు. ఆరంభ మ్యాచ్‌లోనే ఓపెనర్‌గా బరిలోకి దిగి 31 బంతుల్లోనే 69 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే (రాహుల్ ద్రవిడ్ వన్డే వీడ్కోలు మ్యాచ్‌లో) డర్హామ్‌ వేదికగా వన్డేల్లోకీ అరంగేట్రం చేసి 40 పరుగుల బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

అయితే, సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టుల్లో అవకాశం రావడానికి రహానేకు రెండేళ్ల సమయం పట్టింది.

2013 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా దిల్లీలో జరిగిన నాలుగో టెస్టు ద్వారా ఆయన టెస్టు క్యాప్ అందుకున్నాడు. అయితే ఆ మ్యాచ్‌లో 1, 7 పరుగులకే నిరాశపరిచాడు.

కానీ, అది సునామీకి ముందు వచ్చిన ప్రశాంతత మాత్రమే! ఆ తర్వాతి దశాబ్ద కాలంలో భారత టెస్టు విభాగానికి జింక్స్ (రహానే ముద్దుపేరు) వెన్నుముకగా మారాడు. టీమిండియా తరఫున 85 టెస్టులాడిన ఆయన 5,077 పరుగులు సాధించారు. వన్డేల్లోనూ 90 మ్యాచ్‌లు ఆడి 2,962 పరుగులు చేయగా, 20 టి20ల్లో 375 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మంచి ప్రదర్శనలు ఉన్నప్పటికీ.. టెస్టు క్రికెటే ఆయన అసలైన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.

సేనా దేశాల్లో విదేశీ సింహం!

సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత భారత మిడిలార్డర్ రూపురేఖలు మారాయి. ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే వరుసగా 3, 4, 5 స్థానాల్లో భారత్‌కు తిరుగులేని పునాదిగా నిలిచారు.

దక్షిణాఫ్రికా పర్యటనలో డర్బన్ టెస్టులో 51 నాటౌట్, 96 పరుగుల ఇన్నింగ్స్‌లతో రహానే తన విశ్వరూపాన్ని చూపించడం ప్రారంభించాడు.

అక్కడి నుంచి రహానే కెరీర్ వేగంగా దూసుకెళ్లింది. ఒకే ఏడాదిలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో శతకాలు బాది సేనా (సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో తిరుగులేని రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ శతకాలు టెస్టు జట్టులో ఆయన స్థానాన్ని పదిలం చేయడమే కాకుండా, విదేశీ మైదానాల్లో భారత్ చారిత్రక విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాయి.

అద్భుత రీ-ఎంట్రీ.. చివరి టెస్టు!

తొమ్మిదేళ్ల పాటు క్రమం తప్పకుండా జట్టులో కొనసాగిన రహానే, అనంతర వైఫల్యాల వల్ల తొలిసారి జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే, 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో మళ్లీ జట్టులోకి పునరాగమనం చేసి 89, 46 పరుగులతో సత్తా చాటాడు. కానీ, ఆ రీ-ఎంట్రీ కేవలం మూడు మ్యాచ్‌లకే పరిమితమైంది! జులై 2023లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచే.. భారత్ తరఫున రహానేకు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా మిగిలిపోయింది.

జట్టు క్లిష్ట సమయాల్లో సాధించిన అద్భుత విజయాలు, విదేశీ గడ్డపై చూపిన తెగువ, నాయకత్వ పటిమతో భారత క్రికెట్ చరిత్రలో రహానే తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్నాడు.

అల్విదా జింక్స్!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More