NSE IPO : ఎన్ఎస్ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ డేట్ ఫిక్స్- ప్రైజ్ బ్యాండ్ వివరాలు..
దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ 'ఎన్ఎస్ఈ' ఐపీఓ రేసు ప్రారంభమైంది. షేరు ధర శ్రేణిని రూ. 1,700 - రూ. 1,785గా నిర్ణయించిన సంస్థ, సెప్టెంబర్ 17 నుంచి సబ్స్క్రిప్షన్ అందుబాటులోకి తేనుంది. దరఖాస్తు తేదీలు, లాట్ సైజ్, లిస్టింగ్ వివరాలను పూర్తిగా తెలుసుకోండి..
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి సమయం ఆసన్నమైంది. దేశీయ ఆర్థిక రంగానికి గుండెకాయ లాంటి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తన ప్రతిష్టాత్మక పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) వివరాలను అధికారికంగా ప్రకటించింది. దలాల్ స్ట్రీట్లో ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎన్ఎస్ఈ ఐపీఓ ప్రైజ్ బ్యాండ్ని ఈక్విటీ షేరుకు రూ. 1,700 నుంచి రూ. 1,785గా నిర్ణయించారు. రూ. 1 ముఖ విలువ కలిగిన ఈ షేర్ల కోసం బిడ్డింగ్ సెప్టెంబర్ 17న ప్రారంభమై, సెప్టెంబర్ 21న ముగియనుంది.

ఎన్ఎస్ఈ ఐపీఓ కీలక తేదీలు.. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా
ఇటీవలి కాలంలో మొబైల్ యాప్ల ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెంచుకుంటున్న రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ ఐపీఓ ఒక మంచి అవకాశంగా మారనుంది. పెద్ద సంస్థలు, యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 16న జరుగుతుంది. సాధారణ ఇన్వెస్టర్లు సెప్టెంబర్ 17 (గురువారం) నుంచి సెప్టెంబర్ 21 (సోమవారం) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఇష్యూలో కనీసం 8 షేర్లను ఒక లాట్గా నిర్ణయించారు. అంటే ఒక లాట్ కోసం ఇన్వెస్టర్లు గరిష్ట ధర ఆధారంగా రూ. 14,280 వెచ్చించాల్సి ఉంటుంది. ఆపై 8 షేర్ల చొప్పున లాట్స్లో దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 35 శాతం కోటా కేటాయించారు. అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకు (క్యూఐబీ) 50 శాతం కంటే ఎక్కువ కాకుండా, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు (ఎన్ఐఐ) 15 శాతానికి తక్కువ కాకుండా రిజర్వ్ చేశారు.
ఎన్ఎస్ఈ ఐపీఓ లిస్టింగ్ వివరాలు.. కేటాయింపు ప్రక్రియ
ఎన్ఎస్ఈ ఐపీఓ షేర్ల కేటాయింపు (అలాట్మెంట్) ప్రక్రియ సెప్టెంబర్ 22న పూర్తవుతుంది. షేర్లు రాని ఇన్వెస్టర్లకు సెప్టెంబర్ 23న సొమ్ము తిరిగి జమ అవుతుంది. అదే రోజున షేర్లు లభించిన వారి డీమ్యాట్ ఖాతాల్లోకి డిపాజిట్ చేస్తారు. అనంతరం సెప్టెంబర్ 24న ఎన్ఎస్ఈ షేర్లు బీఎస్ఈ వేదికతో పాటు ఎన్ఎస్ఈ బోర్డు పైనా లిస్ట్ కానున్నాయి.
ఎన్ఎస్ఈ ఐపీఓ ఇష్యూ సైజ్ తగ్గింపు.. ఆఫర్ ఫర్ సేల్ వివరాలు
ఎన్ఎస్ఈ దాఖలు చేసిన రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్హెచ్పీ)లో ఉన్న దానితో పోల్చితే.. కంపెనీ ఐపీఓ పరిమాణాన్ని దాదాపు 15 శాతం తగ్గించింది. గతంలో 14.89 కోట్ల షేర్లను విక్రయించాలని భావించినప్పటికీ, ప్రస్తుత నివేదిక ప్రకారం 12.644 కోట్ల ఈక్విటీ షేర్లను మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇది కంపెనీ మొత్తం ఈక్విటీ క్యాపిటల్లో దాదాపు 5.1 శాతానికి సమానం.
ఈ ఎన్ఎస్ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా 'ఆఫర్ ఫర్ సేల్' (ఓఎఫ్ఎస్) రూపంలో జరుగుతోంది. అంటే కంపెనీకి కొత్తగా నిధులు చేరవు. ప్రస్తుత వాటాదారులు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించడం ద్వారా సొమ్ము పొందుతారు.
వాటాలు విక్రయిస్తున్న దిగ్గజ సంస్థలు..
ఈ ఆఫర్ ఫర్ సేల్లో అత్యధికంగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 1.59 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. దీనితో పాటు కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (1.18 కోట్లు), అరండా ఇన్వెస్ట్మెంట్స్ (1.12 కోట్లు), ఎమ్ఎస్ స్ట్రాటజిక్ (1.10 కోట్లు), న్యూ ఇండియా అస్యూరెన్స్ (1.05 కోట్లు) తమ వాటాలను అమ్ముతున్నాయి.
అయితే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, జీఐసీ, షేర్ హోల్డింగ్ కార్పొరేషన్లు తాము విక్రయించే షేర్ల సంఖ్యను కొంత తగ్గించుకోగా, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ కొత్తగా జాబితాలోకి చేరి 87.8 లక్షల షేర్లను ఆఫర్ చేస్తోంది. మరోవైపు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఓఎఫ్ఎస్ ప్రక్రియ నుంచి పూర్తిగా వైదొలిగింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


