Electric scooter : అఫార్డిబుల్​ ధరకు ఏథర్ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్- ఐక్యూబ్, చేతక్​కి గట్టి పోటీ!

Budget EV : ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ సంస్థ ఏథర్ ఎనర్జీ దేశీయ మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కంపెనీ గతంలో ప్రదర్శించిన 'ఈఎల్01' కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న ఈ స్కూటర్, ప్రస్తుత రిజ్టా, 450 సిరీస్ మోడళ్ల కంటే తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది.

Published on: Jun 28, 2026, 07:40:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతున్న వేళ.. ప్రముఖ ఈవీ దిగ్గజం 'ఏథర్ ఎనర్జీ' సామాన్యులను టార్గెట్ చేస్తూ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ తన తదుపరి, సరికొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ కమ్యూనిటీ డే 2025లో ప్రదర్శించిన 'ఈఎల్01' కాన్సెప్ట్ మోడల్ ఆధారంగా దీని ఉత్పత్తి వెర్షన్‌ను రూపొందిస్తున్నారు. పండుగ సీజన్ నాటికి ఈ సరికొత్త ఈవీ ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ స్కూటర్‌కి సంబంధించిన డిజైన్ పేటెంట్ హక్కులను ఏథర్ పొందింది. అంతేకాకుండా, భారతీయ రోడ్లపై ఇది టెస్టింగ్ జరుపుకుంటూ పలుమార్లు కెమెరాలకు చిక్కింది.

ఏథర్​ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
ఏథర్​ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..

ఏథర్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్- డిజైన్, లుక్ ఎలా ఉండబోతోంది?

ఏథర్ నుంచి ఇప్పటివరకు వచ్చిన 450 సిరీస్ స్కూటర్లు స్పోర్టీ లుక్‌తో యువతను ఆకట్టుకోగా.. రాబోయే కొత్త మోడల్ మాత్రం పక్కా ఫ్యామిలీ స్కూటర్ తరహాలో క్లాసిక్ లుక్‌ను కలిగి ఉండనుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్​ సెల్లింగ్ ఏథర్ రిజ్టా కంటే భిన్నంగా, రోజువారీ అవసరాలకు మరింత సులభంగా ఉండేలా డిజైన్ చేశారు.

ఈ స్కూటర్ ప్రధానంగా టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఓలా ఎస్1 ఎక్స్ వంటి పాపులర్ మాస్-మార్కెట్ స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. కాన్సెప్ట్ మోడల్ ప్రకారం.. ఇందులో వెడల్పాటి ఫ్రంట్ ఆప్రాన్, హ్యాండిల్‌బార్‌పై అమర్చిన రెక్టాంగులర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఫ్లాట్ సింగిల్-పీస్ సీట్, పెద్ద ఫ్లోర్‌బోర్డ్, 14-ఇంచుల వీల్స్ ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా, ఇందులో ఏకంగా రెండు హెల్మెట్లు పట్టేంత భారీ అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్‌ను కంపెనీ చూపించింది!

ఏథర్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్- సరికొత్త 'ఈఎల్' ప్లాట్‌ఫారమ్!

ఏథర్ సంస్థ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ప్రత్యేకంగా 'ఈఎల్' ఆర్కిటెక్చర్‌ను (ప్లాట్‌ఫారమ్) అభివృద్ధి చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్ 2 కేడబ్లూహెచ్ నుంచి 5 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌లను, అలాగే 10 ఇంచుల నుంచి 14 ఇంచుల వీల్ సైజులను సపోర్ట్ చేస్తుంది.

ఈ కొత్త మోడల్‌లో ఖర్చును తగ్గించడం కోసం కీలక మార్పులు చేయబోతున్నారు:

ఏథర్ ప్రస్తుత స్కూటర్లలో వాడే బెల్ట్-డ్రైవ్ సెటప్‌కు బదులుగా, ఇందులో సరళమైన, తక్కువ ఖర్చుతో కూడిన ‘హబ్-మోటార్’ లేఅవుట్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.

కాన్సెప్ట్ మోడల్‌లో పేటెంట్ పొందిన ఏసీ-డీసీ మాడ్యూల్, అలాగే స్టోరేజ్ ఏరియాలోనే ఇన్‌బిల్ట్ ఛార్జింగ్ వైర్ ఆప్షన్‌ను ప్రదర్శించారు. ఇది ఇంటి వద్దే సులభంగా ఛార్జింగ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ధరను అదుపులో ఉంచడానికి వీలుగా, టాప్ వేరియంట్లలో పెద్ద టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ ఫీచర్లు, రైడ్ మోడ్స్, నావిగేషన్ వంటి సదుపాయాలు అందిస్తూ.. బేస్ వేరియంట్లలో చిన్న డిస్‌ప్లేను ఇచ్చే అవకాశం ఉంది.

ఏథర్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్- ధర ఎంత ఉండొచ్చు?

ఈ సరికొత్త స్కూటర్ ధర రూ. 1 లక్ష కంటే తక్కువగా ఉండే అవకాశం లేదు అని పరిశ్రమ వర్గాల అంచనా. అయినప్పటికీ, ప్రస్తుత లైనప్‌తో పోలిస్తే ఇది అత్యంత సరసమైన ధరకే లభించనుంది.

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీ) లో ఉన్న బిడ్కిన్ వద్ద ఏథర్ నిర్మిస్తున్న సరికొత్త ప్లాంట్ నుంచి ఈ స్కూటర్లు ఉత్పత్తి కానున్నాయి. ఈ కొత్త ప్లాంట్ ద్వారా ప్రొడక్షన్ ఖర్చులు తగ్గి, వినియోగదారులకు మరింత తక్కువ ధరకే స్కూటర్ అందే వీలుంది.

ఈ మోడల్​పై మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో అందుబాటులోకి వస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More