Best Scooters : చాలా ఆప్షన్లే ఉన్నాయి- ఏ స్కూటర్ కొనాలో తెలియడం లేదా? ఇండియాలో టాప్-10 ఇవే..
Best selling Scooters : భారత టూ-వీలర్ మార్కెట్లో మే 2026 నెలలో స్కూటర్ల అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఎప్పటిలాగే హోండా యాక్టివా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, ఈ జాబితాలో పెట్రోల్ మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి.
భారతదేశంలో ద్విచక్ర వాహన ప్రియులు స్కూటర్ల కొనుగోలుపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. గత నెల (మే 2026) సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే, దేశీయ స్కూటర్ మార్కెట్ గతేడాదితో పోలిస్తే బలమైన వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా పెట్రోల్, ఎలక్ట్రిక్ (ఈవీ) స్కూటర్ల విభాగంలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 స్కూటర్ల మొత్తం విక్రయాలు 6,41,680 యూనిట్లుగా నమోదయ్యాయి. మే 2025లో నమోదైన 5,21,431 యూనిట్లతో పోలిస్తే, ఈసారి ఏకంగా 1,20,249 యూనిట్ల అదనపు అమ్మకాలతో స్కూటర్ల విభాగం అద్భుతమైన వార్షిక వృద్ధిని సాధించింది. ఈ నేపథ్యంలో ఆ టాప్-10 స్కూటర్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

తిరుగులేని హోండా యాక్టివా.. లక్షల్లో అమ్మకాలు
భారతీయ కుటుంబాల నమ్మకమైన స్కూటర్గా గుర్తింపు తెచ్చుకున్న హోండా యాక్టివా ఈసారి కూడా మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. మే 2026లో యాక్టివా ఏకంగా 2,28,955 యూనిట్ల విక్రయాలతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది ఇదే మే నెలలో అమ్ముడైన 1,90,713 యూనిట్లతో పోలిస్తే, ఈసారి 38,242 స్కూటర్లు అదనంగా అమ్ముడయ్యాయి. దీనివల్ల యాక్టివా 20.05 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్లోని మొత్తం టాప్-10 స్కూటర్ల అమ్మకాల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ వాటాను కేవలం యాక్టివా ఒక్కటే సొంతం చేసుకోవడం విశేషం.
రేసులో దూసుకుపోతున్న టీవీఎస్ జూపిటర్, సుజుకీ యాక్సెస్..
ఈ జాబితాలో టీవీఎస్ జూపిటర్ 1,24,767 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. మే 2025లో ఈ మోడల్ అమ్మకాలు 97,606 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది అదనంగా 27,161 వాహనాలను విక్రయించి 27.83 శాతం వృద్ధి సాధించింది. యాక్టివా తర్వాత లక్షకు పైగా అమ్మకాలు సాధించిన ఏకైక స్కూటర్గా జూపిటర్ నిలిచింది. ఇక మూడో స్థానంలో నిలిచిన సుజుకీ యాక్సెస్ గత నెలలో 75,729 యూనిట్ల సేల్స్ను నమోదు చేసింది. గతేడాది నమోదైన 75,778 యూనిట్లతో పోలిస్తే దీని అమ్మకాల్లో 0.06 శాతం స్వల్ప తగ్గుదల కనిపించింది.
ఈవీ విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ హవా..
ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ మరోసారి తన జోరును చాటుకుంటూ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. అత్యధికంగా అమ్ముడైన ఈవీగా రికార్డు సృష్టించిన ఐక్యూబ్.. మే 2026లో 42,192 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో అమ్ముడైన 27,642 యూనిట్లతో పోలిస్తే, ఈసారి ఏకంగా 14,550 వాహనాలు అదనంగా అమ్ముడై, 52.64 శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాత స్థానంలో నిలిచిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా 38,376 యూనిట్ల అమ్మకాలతో, 50.26 శాతం బలమైన వృద్ధిని కనబరిచింది.
టాప్-10 లో నిలిచిన ఇతర మోడళ్లు ఇవే..
టీవీఎస్ ఎన్టార్క్ : 34,127 యూనిట్ల అమ్మకాలతో ఆరో స్థానంలో నిలిచింది. గతేడాది మే నెలలో నమోదైన 25,205 యూనిట్లతో పోలిస్తే 35.40 శాతం వృద్ధి సాధించింది.
హీరో డెస్టినీ 125 : టాప్-10 జాబితాలోనే అత్యధిక శాతంలో వృద్ధి సాధించిన స్కూటర్గా ఇది నిలిచింది. దీని అమ్మకాలు గతేడాది 15,018 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది ఏకంగా 76.34 శాతం వృద్ధితో 26,482 యూనిట్లకు చేరుకున్నాయి.
సుజుకీ బర్గ్మన్ : 25,835 యూనిట్ల అమ్మకాలతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది (24,688 యూనిట్లు) తో పోలిస్తే ఇది 4.65 శాతం స్వల్ప వృద్ధిని నమోదు చేసింది.
హోండా డియో : ఈ మోడల్ అమ్మకాల్లో కొంత క్షీణత కనిపించింది. గతేడాది 26,220 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈ ఏడాది మే నెలలో 23,814 యూనిట్లకు పరిమితమై, 9.18 శాతం తగ్గుదలను నమోదు చేస్తూ తొమ్మిదో స్థానంలో నిలిచింది.
యమహా రేజెడ్ఆర్ : 21,403 యూనిట్ల అమ్మకాలతో పదో స్థానాన్ని సొంతం చేసుకుంది. గతేడాది నమోదైన 13,023 యూనిట్లతో పోలిస్తే ఇది 64.35 శాతం అద్భుతమైన వృద్ధిని కనబరిచింది.
మరి వీటిల్లో మీరు ఏది ఎంచుకుంటున్నారు?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


