అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసు: జూలై 13న సుప్రీంకోర్టు కీలక విచారణ
అయోధ్య రామాలయం విరాళాల చోరీ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు, సమగ్ర ఫోరెన్సిక్ ఆడిట్ కోరుతూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం జూలై 13న విచారించనుంది.
అయోధ్యలోని ప్రతిష్ఠాత్మక శ్రీరామ మందిరంలో విరాళాల లెక్కింపులో జరిగినట్లు చెప్తున్న అక్రమాల వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ విరాళాల చోరీపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు జూలై 13 (సోమవారం) న విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది.

పిటిషనర్ల డిమాండ్లు ఏంటి?
ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) తో దర్యాప్తు జరిపించాలని కోరుతూ నరేంద్ర కుమార్ గోస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయోధ్య రామాలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్' ఆర్థిక లావాదేవీలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తో ఆడిటింగ్ చేయించాలని ఆయన కోరారు. ఇదే అంశంపై అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్ కూడా కోర్టును ఆశ్రయించారు.
మరోవైపు, ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్లో.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని, ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలపై సమగ్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు కనుమరుగు కాకుండా ఉండేందుకు డిజిటల్ లెడ్జర్లు, యూపీఐ లావాదేవీల రికార్డులు, బ్యాంక్ స్టేట్మెంట్లతో పాటు అన్ని భౌతిక పత్రాలను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.
ప్రతిపాదిత ఓవర్సైట్ కమిటీ (ఉన్నత స్థాయి కమిటీ) ముందస్తు అనుమతి లేకుండా ట్రస్ట్ ఎలాంటి పెద్ద పెట్టుబడులు పెట్టకుండా, ఒప్పందాలు చేసుకోకుండా నిలువరించాలని పిటిషన్లో పేర్కొన్నారు. పారదర్శకత కోసం ట్రస్ట్ తన అధికారిక వెబ్సైట్లో ఆడిట్ చేసిన ఆర్థిక నివేదికలను, విరాళాల వివరాలను ఉంచాలని కోరారు. ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి నగదు, బ్యాంక్ బదిలీలు, డిజిటల్ చెల్లింపులు, విదేశీ విరాళాలు, బంగారం, వెండి రూపంలో వచ్చిన కానుకల పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
అసలు వివాదం ఏమిటి?
ఈ ఏడాది జూన్ మొదటి వారంలో అయోధ్య రామాలయం విరాళాల లెక్కింపులో అక్రమాలు జరిగినట్లు వెలుగు చూడటంతో ఈ వివాదం మొదలైంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ కేసును విడిగా విచారిస్తోంది. దుర్వినియోగం చేసిన సొమ్మును నిందితులు షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడమే కాకుండా, వడ్డీలకు తిప్పినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. కొంత సొమ్మును నిందితులు తమ బంధువులు, సన్నిహితుల బ్యాంక్ ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు.
రామమందిర విరాళాల లెక్కింపు గదిలో తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు సిట్ (SIT) విచారణలో తేలింది. లెక్కింపు సిబ్బంది డబ్బు కట్టలను తమ బట్టలు, జేబులు, షూస్లలో దాచుకుని తీసుకెళ్లారని, ఇది ఏదో ఒకరోజు జరిగింది కాదని, చాలా కాలంగా పద్ధతి ప్రకారం సాగుతున్నట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా స్పష్టమైంది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 మధ్య కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, సిబ్బంది నగదు కట్టలను దాస్తున్న సుమారు 70 అనుమానాస్పద ఘటనలు వెలుగుచూశాయి.
లెక్కింపు హాల్ లోపలికి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు సిబ్బందిని తనిఖీ చేసే పటిష్టమైన భద్రతా నిబంధనలు లేకపోవడం వల్లే ఈ దొంగతనం జరిగిందని సిట్ నివేదిక స్పష్టం చేసింది. నిందితులు నకిలీ రసీదులను సృష్టించి భక్తుల నుంచి విరాళాలు వసూలు చేసినట్లు జూలై 8 నాటి పోలీసు విచారణలో తేలింది.
అరెస్టులు.. రాజీనామాలు
ఈ విరాళాల చోరీ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు సభ్యుల సిట్ సమర్పించిన ప్రాథమిక నివేదిక ప్రకారం అవినాష్ శుక్లా ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. సుమారు 40 రోజుల పాటు సాగిన ఈ వ్యవహారంలో అతనికి సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించాయి.
ఈ వివాదం నేపథ్యంలో, రామజన్మభూమి ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. ట్రస్ట్ సమావేశంలో వారి రాజీనామాలను ఆమోదించారు.
"రాజీనామా చేయడంపై చంపత్ రాయ్కు ఎలాంటి అసంతృప్తి లేదు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు" అని ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి పేర్కొన్నారు.
మరోవైపు, నిందితులైన అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, కరుణేష్ పాండేల బంధువులకు చెందిన 30 బ్యాంక్ ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు. కోర్టు అనుమతితో ఈ ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి ఇళ్లలో జరిపిన సోదాల్లో భారీగా నగదు కట్టలు, బంగారు ఆభరణాలు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ట్రస్ట్కు మద్దతుగా సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విరాళాల లెక్కింపు వ్యవహారంలో ట్రస్ట్కు మద్దతుగా నిలిచారు. విరాళాల లెక్కింపులో సుమారు 150 మంది పాల్గొంటుండగా, సిట్ దర్యాప్తులో కేవలం ఎనిమిది మందిపైనే ఆధారాలు లభించాయని ఆయన స్పష్టం చేశారు. అయోధ్యలో రూ. 950 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
"విరాళాల లెక్కింపులో దొంగతనం జరుగుతున్నట్లు ట్రస్ట్ స్వయంగా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి, ఉన్నత స్థాయి సిట్ దర్యాప్తును కోరింది. మేము ఆ సిఫార్సును అంగీకరించి దర్యాప్తు జరిపించాం. ఇందులో ఆరుగురు నేరుగా దొంగతనానికి పాల్పడగా, మరో ఇద్దరు కుట్రలో భాగస్వాములయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడు, రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు మొత్తం ట్రస్ట్ను, అయోధ్యను బద్నాం చేయడం ఎంతవరకు సమంజసం?" అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు.
రాముడి భక్తులు, దేశ సంస్కృతిని గౌరవించే ప్రతి ఒక్కరూ ఇలాంటి విమర్శల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


