...
...
Next Story

బంగ్లాదేశ్‌లో భారతీయుల వర్క్ పర్మిట్లు రద్దు చేయాలి: ఇంక్విలాబ్ మంచ్ డిమాండ్లు

స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హదీ హత్య కేసులో నిందితులను శిక్షించాలని కోరుతూ బంగ్లాదేశ్‌లో ఇంక్విలాబ్ మంచ్ నిరసనలు చేపట్టింది. భారతీయుల వర్క్ పర్మిట్లు రద్దు చేయాలని, షేక్ హసీనాను అప్పగించకపోతే అంతర్జాతీయ కోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేస్తోంది.

Published on: Dec 29, 2025, 15:04:23 IST
Advertisement

బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మరోసారి కాకరేపుతున్నాయి. విద్యార్థి నాయకుడు, ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షహీద్ ఉస్మాన్ హదీ హత్యపై ఆ దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్‌లో పని చేస్తున్న భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలంటూ 'ఇంక్విలాబ్ మంచ్' అనే సంస్థ తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

హదీ హత్య కేసులో 24 రోజుల గడువు

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు బెంగళూరులో నిరసన వ్యక్తం చేస్తున్న హిందు రాష్ట్ర సమన్వయ కమిటీ మద్దతుదారులు (AFP)
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు బెంగళూరులో నిరసన వ్యక్తం చేస్తున్న హిందు రాష్ట్ర సమన్వయ కమిటీ మద్దతుదారులు (AFP)

ఢాకాలోని షాబాగ్ కూడలిలో నిరసన చేపట్టిన ఇంక్విలాబ్ మంచ్ సభ్య కార్యదర్శి అబ్దుల్లా అల్ జాబర్, ప్రభుత్వం ముందు నాలుగు ప్రధాన డిమాండ్లను ఉంచారు. ముఖ్యంగా ఉస్మాన్ హదీని హత్య చేసిన వారిని, అందుకు కుట్ర పన్నిన వారిని రాబోయే 24 రోజుల్లోగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు. హదీ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని, బంగ్లాదేశ్ సార్వభౌమాధికారం కోసం పోరాడిన వీరుడని ఆయన కొనియాడారు.

ఇంక్విలాబ్ మంచ్ పెట్టిన నాలుగు డిమాండ్లు ఇవే:

బంగ్లాదేశ్ స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి తాము ఈ పోరాటం చేస్తున్నామని పేర్కొంటూ జాబర్ ఈ క్రింది డిమాండ్లను ప్రకటించారు.

  1. సత్వర న్యాయం: ఉస్మాన్ హదీ హత్యకు కారణమైన వారిని 24 పని దినాల్లోగా పట్టుకుని విచారించాలి.
  2. భారతీయుల వర్క్ పర్మిట్ల రద్దు: దేశ సార్వభౌమాధికారానికి భంగం కలగకుండా ఉండాలంటే బంగ్లాదేశ్‌లో పనిచేస్తున్న భారతీయుల వర్క్ పర్మిట్లను వెంటనే రద్దు చేయాలి.
  3. అంతర్జాతీయ కోర్టులో కేసు: భారత్‌లో తలదాచుకున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి అప్పగించని పక్షంలో, భారత్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ)లో కేసు వేయాలి.
  4. అవామీ లీగ్ అనుకూలురపై చర్యలు: సివిల్, మిలిటరీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో ఉన్న అవామీ లీగ్ సానుభూతిపరులను గుర్తించి శిక్షించాలి.

అసలేం జరిగింది?

ఈ కేసులో నిందితులు మేఘాలయలోని హలువాఘాట్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి ప్రవేశించారని ఢాకా పోలీసులు చేసిన ఆరోపణలు ఉద్రిక్తతలకు దారితీశాయి. అయితే, ఈ ఆరోపణలను భారత సరిహద్దు భద్రతా దళం (BSF) తీవ్రంగా తోసిపుచ్చింది. "అలా ఎవరూ సరిహద్దు దాటినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు" అని మేఘాలయ ఐజీ ఓపీ ఉపాధ్యాయ స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ నిరసనలు బంగ్లాదేశ్‌లోని అన్ని ప్రధాన నగరాలకు పాకే అవకాశం ఉందని ఇంక్విలాబ్ మంచ్ హెచ్చరించింది. తాత్కాలిక ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe