Real estate : హైదరాబాద్ vs బెంగళూరు- రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ఏ నగరం బెస్ట్? ధరలు ఎలా ఉన్నాయంటే..
Hyderabad real estate : దక్షిణ భారత ఐటీ హబ్లు హైదరాబాద్, బెంగళూరుల మధ్య రియల్ ఎస్టేట్ పోటీ ఆసక్తికరంగా మారింది! మరి ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం? నిపుణులు ఏమంటున్నారంటే..
బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి డీకెే శివకుమార్ ఇటీవల మాట్లాడుతూ.. "బెంగళూరు ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతోంది, ఇది హైదరాబాద్ లేదా మరే ఇతర నగరంతో పోటీ పడటం లేదు," అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల తర్వాత, ఇల్లు కొనాలనుకునే వారిలో ఒక ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది: అసలు రియల్ ఎస్టేట్ పెట్టుబడికి హైదరాబాద్ మేలా? లేక బెంగళూరు మేలా?

రియల్ ఎస్టేట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు-నిల్వల నిష్పత్తి తక్కువగా ఉండటం వల్ల స్వల్పకాలికంగా అక్కడ మార్కెట్ బలంగా కనిపిస్తోంది. మరోవైపు, హైదరాబాద్లో ఇళ్ల నిల్వలు భారీగా ఉండటం వల్ల కొనుగోలుదారులకు అనేక ఆప్షన్లు లభించడమే కాకుండా, ధరల విషయంలో బిల్డర్లతో బేరసారాలు ఆడే వెసులుబాటు కూడా ఎక్కువగా ఉంది.
అనరాక్ గ్రూప్ గణాంకాలు:
ప్రశాంత్ ఠాకూర్ (అనరాక్ గ్రూప్) తెలిపిన వివరాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రెండు నగరాల్లోనూ నివాస గృహాల విక్రయాలు స్థిరంగా ఉన్నాయి.
బెంగళూరు: ఇక్కడ 53,400 కొత్త ఇళ్లు లాంచ్ అవ్వగా, 47,200 ఇళ్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వ 64,900 యూనిట్లు మాత్రమే. ఇది ఇక్కడ సప్లై తక్కువగా ఉందని సూచిస్తోంది.
హైదరాబాద్: ఇక్కడ 33,000 కొత్త ఇళ్లు రాగా, ఏకంగా 34,800 ఇళ్లు అమ్ముడయ్యాయి. అంటే లాంచ్ అయిన వాటికంటే అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ, గతంలో మిగిలిపోయిన నిల్వలు 96,100 యూనిట్లుగా ఉన్నాయి. దీనివల్ల కొనుగోలుదారులకు ఎక్కువ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
పెట్టుబడి దృష్ట్యా చూస్తే, రెండు నగరాలను గుడ్డిగా పోల్చవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెంగళూరులో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు బాగున్న ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్లో మాత్రం ఎక్కువ ఇళ్లు అందుబాటులో ఉండటం కొనుగోలుదారులకు లాభదాయకం.
"కేవలం నగరాన్ని బట్టి రిస్క్ అంచనా వేయలేం. ఇన్వెస్టర్లు ఆయా ఏరియాల అభివృద్ధి, బిల్డర్ ట్రాక్ రికార్డ్. ప్రభుత్వ నిబంధనలను బట్టి నిర్ణయం తీసుకోవాలి," అని ప్రశాంత్ ఠాకూర్ సూచించారు.

బెంగళూరులో ధరల వివరాలు (నైట్ ఫ్రాంక్ ఇండియా డేటా)..
లావెల్ రోడ్: చదరపు అడుగుకు రూ. 21,000–30,000 ధర పలుకుతోంది. 2025 చివరి ఆరు నెలల్లో ఇక్కడ ధరల్లో పెరుగుదల లేదు.
వైట్ఫీల్డ్: ఐటీ హబ్ కావడంతో ఇక్కడ ధరలు రూ. 6,500–14,000 మధ్య ఉన్నాయి. ఏడాది కాలంలో ఇక్కడ ఏకంగా 11% వృద్ధి నమోదైంది.
మరతహళ్లి: ధర రూ. 7,500–16,000 మధ్య ఉండగా, 1% స్వల్ప వృద్ధిని చూసింది.
ఉత్తర బెంగళూరు (హెబ్బాల్, యలహంక, హెన్నూర్): హెబ్బాల్లో 9% (రూ. 7,000–13,000), యలహంకలో 5% (రూ. 5,000–10,000) వృద్ధి కనిపించింది.
దక్షిణ కారిడార్లు: సర్జాపూర్ రోడ్లో ధరలు 12% పెరిగి రూ. 5,500–11,000కు చేరుకోగా, ఎలక్ట్రానిక్ సిటీలో 6% వృద్ధి (రూ. 5,540–8,450) నమోదైంది.

హైదరాబాద్లో ధరల వివరాలు..
బంజారాహిల్స్: అత్యంత ఖరీదైన ఏరియాగా రూ. 14,400–16,020 ధరతో 2% వృద్ధిని చూసింది.
జూబ్లీహిల్స్: ఇక్కడ రూ. 13,400–14,034 ధర ఉండగా, 11% బలమైన వృద్ధి నమోదైంది.
తూర్పు హైదరాబాద్ (ఎల్బీ నగర్, నాచారం): ఎల్బీ నగర్లో కేవలం 1% వృద్ధి ఉండగా, నాచారం ప్రాంతంలో ఏకంగా 17% వృద్ధి ( ₹6,500–7,697) నమోదై నగరంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా నిలిచింది.
ఉత్తర ప్రాంతాలు (కొంపల్లి, సైనిక్పురి): ఇక్కడ ధరలు దాదాపు స్థిరంగా (0-1% వృద్ధి) ఉన్నాయి.
దక్షిణ ప్రాంతం: రాజేంద్ర నగర్లో ధరలు అనూహ్యంగా 6% తగ్గాయి ( ₹6,950–7,655).
పశ్చిమ ప్రాంతం (కోకాపేట్, మణికొండ): ఐటీ హబ్లకు దగ్గరగా ఉండటంతో ఇక్కడ స్థిరమైన వృద్ధి ఉంది. కోకాపేట్లో రూ. 10,045–12,500 (2% వృద్ధి), మణికొండలో రూ. 9,486–9,628 (5% వృద్ధి) ధరలు ఉన్నాయి.

ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


