బీహార్ ఎన్నికల ఫలితాలు: తొలి ట్రెండ్స్లో ఎన్డీఏ కూటమికి ఆధిక్యం!
bihar election 2025 result live : బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అధికార ఎన్డీఏ ముందంజలో ఉంది. విపక్ష మహాఘటబంధన్ వెనకంజలో ఉంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలి ట్రెండ్స్ ప్రకారం.. అధికారంలో ఉన్న ఎన్డీఏ, ‘మహాఘటబంధన్’పై అనేక నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది!

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మొదట పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపును ప్రారంభించింది. అయితే, తొలి ట్రెండ్స్లో వస్తున్న ఆధిక్యాలు తుది ఫలితాన్ని సూచించవు. రోజు గడిచే కొద్దీ ఈవీఎం ఓట్లను లెక్కించే కొద్దీ రాష్ట్రవ్యాప్త ట్రెండ్పై స్పష్టమైన చిత్రాన్ని తెలుసుకునే అవకాశం ఉంది.
కాగా ఉదయం 8 గంటల 25 నిమిషాల ప్రాంతంలో.. ఎన్డీఏ 18 చోట్ల ఆధిక్యంలో ఉంది. విపక్ష మహాఘటబంధన్ 9 స్థానాల్లో ముందంజలో ఉంది. జేఎస్పీ 2 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇతరులు 1 చోట ఆధిక్యంలో ఉన్నారు.
- బీహార్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బీహార్ ఎన్నికల ఫలితాలు- పోలింగ్ వివరాలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, నవంబర్ 14 తేదీల్లో రెండు దశల్లో జరిగాయి.
- మొదటి దశలో 65.08 శాతం పోలింగ్ నమోదైంది.
- రెండవ దశలో 69.20 శాతం పోలింగ్ నమోదైంది.
- మొత్తం పోలింగ్ శాతం 67.13 శాతంగా ఉంది. ఎన్నికల సంఘం ప్రకారం, 1951 తర్వాత బీహార్లో ఈ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2025: ప్రధాన పోటీదారులు
బీహార్ ఎన్నికల్లో ప్రధానంగా రెండు కూటముల మధ్యే పోటీ నెలకొంది:
ఎన్డీఏ కూటమి: ఇందులో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) పార్టీలు ఉన్నాయి.
మహాఘటబంధన్: ఇందులో ప్రధాన పార్టీలు రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్.
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సాధారణ మెజారిటీ మార్క్ 122 సీట్లు.
ముఖ్యమంత్రి అభ్యర్థులు: మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉన్నారు. అయితే ఎన్డీఏ కూటమి అధికారికంగా ఎవరి పేరును ప్రకటించనప్పటికీ, ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మళ్లీ ఉంటారని మద్దతుదారులు భావిస్తున్నారు. ఈసారి కూటమి అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలూ ఉన్నాయి.
గత ఎన్నికల ఫలితాలు, రాజకీయ పరిణామాలు..
2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తక్కువ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకుంది. 243 సీట్లకు గాను 125 సీట్లు గెలుచుకుంది.
బీజేపీ 74 సీట్లు గెలుచుకుని కూటమిలో ప్రధాన భాగస్వామిగా నిలిచింది.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ 43 సీట్లు సాధించింది.
ప్రతిపక్ష మహాఘటబంధన్, తేజస్వి యాదవ్ నాయకత్వంలో బలమైన పోటీ ఇచ్చి 110 సీట్లు గెలుచుకుంది. ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఎగ్జిట్ పోల్స్ అంచనా
చాలా ఎగ్జిట్ పోల్స్ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా సులువుగా గెలుపు వస్తుందని అంచనా వేశాయి. అయితే, యాక్సిస్ మై ఇండియా వంటి కొన్ని సంస్థలు మాత్రం మహాఘటబంధన్పై బీజేపీ-జేడీ(యూ) కూటమికి స్వల్ప ఆధిక్యతతో కఠినమైన పోటీ ఉంటుందని అంచనా వేశాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


