బుల్డోజర్ రాజ్.. ఖమ్మం ఇళ్ల కూల్చివేతపై కేరళమ్ సీఎం పినరయి విజయన్ సీరియస్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేరళమ్ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు. బుల్డోజర్ రాజ్ పాలన సాగిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై కేరళమ్ సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఫిబ్రవరి 25న ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల గ్రామంలో 700 ఇళ్లను కూల్చివేసి 3,000 మందిని ఇళ్ల నుండి ఖాళీ చేయించినట్లు వచ్చిన వార్తలపై కేరళమ్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీరియస్ అయ్యారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు దీనికి ఆయన కేరళమ్లోని కాంగ్రెస్ నాయకత్వం నుండి సమాధానం కోరారు.

భూదాన్ ఉద్యమంలో భాగంగా భూమి లేని నిరుపేదలకు కేటాయించిన వినోభా నగర్లోని ఇళ్లను కూల్చివేయడంపై పినరయి విజయన్ మండిపడ్డారు. ఇళ్లను కూల్చివేసి, భూదాన ఉద్యమ నాయకుడు ఆచార్య వినోబా భావే వారసత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం అపవిత్రం చేసిందని విజయన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. బీజేపీ మాదిరిగానే బుల్డోజర్ రాజ్ పాలనను తెలంగాణ ప్రభుత్వం పాటిస్తుందని ఆరోపించారు.
వెలుగుమట్ల నిర్వాసితులకు ఇళ్లు
వెలుగుమట్ల ఇళ్ల నిర్వాసితులకు ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారికి ఈనెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాలు కేటాయించనుంది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరాలను ప్రకటించారు.
వెలుగుమట్ల భూముల విషయంలో పనిగట్టుకుని ఒకే కోణంలోనే కొన్ని పత్రికలు, ఛానల్స్ వార్తకథనాలను ప్రసారం చేశాయని... తప్ప నిజాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదన్నారు మంత్రి పొంగులేటి. వాస్తవానికి వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొన్నేళ్లుగా దళారుల ఉచ్చులో చిక్కి, అప్పుల పాలై నిరుపేదలు అనుభవిస్తున్న నరకయాతను గ్రహించలేదని వ్యాఖ్యానించారు.
చాలా మంది పేదవాళ్లు రూ. 30 వేల నుంచి రూ. 8 లక్షల వరకు అప్పులు చేసి దళారులకు చెల్లించారని మంత్రి పొంగులేటి తెలిపారు. పట్టాలొస్తాయని నమ్మబలికి పేదలకు ఆశ చూపెట్టి దానినే ఆసరా చేసకుని నట్టేట ముంచారన్నారు. పడగొట్టడానికి కొన్ని గంటల ముందు కూడా కొందరు రూ. 4 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు కట్టుకున్నాక అధికారులు వచ్చి కూల్చేయడంతో వారంతా రోడ్డున పడ్డారన్నారు.
అర్హులైన ప్రతి పేదవాడికి ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు రూ. 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా, కొత్తగా నిర్మించే కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీతో పాటు అంగన్వాడీ, పాఠశాలలను వంటి మౌళిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు.

E-Paper












