PPF calculator : పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ ద్వారా కోటీశ్వరులు అవ్వొచ్చా? లెక్కలు ఇలా..
PPF Investment : ఇప్పుడు దేశంలో ఉన్న రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్లో పీపీఎఫ్ ఒకటి. స్థిరమైన వడ్డీ రేటు ఉండటం వల్ల కూడా ఇది మదుపర్లను ఆకర్షిస్తోంది. అయితే ఈ పీపీఎఫ్లో పెట్టుబడి ద్వారా కోటీ రూపాయలు సంపాదించేందుకు ఎంత సమయం పడుతుంది? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
PPF interest rate : మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వారికి ఇప్పటికీ బెస్ట్గా ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒకటి. అందుకు తగ్గట్టుగానే కేంద్రం గత కొంతకాలంగా పీపీఎఫ్ వడ్డీ రేటును 7.1శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తోంది. అయితే ఈ రిస్క్- ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ పట్ల్ చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. “పీపీఎఫ్లో పెట్టుబడి ద్వారా కోటీశ్వరులు అవ్వొచ్చా?” అని ఆలోచిస్తుంటారు. అది సాధ్యం అవుతుందా? లేదా? ఇక్కడ తెలుసుకుందాము..

పీపీఎఫ్ వడ్డీ రేటు: స్థిరత్వానికి మారుపేరు!
పీపీఎఫ్ వడ్డీ రేటు 2020 ఏప్రిల్ నుంచి 7.1 శాతం వద్దే కొనసాగుతోంది. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) వడ్డీ రేట్లు మారుతున్నా, ప్రభుత్వం పీపీఎఫ్ రేటును స్థిరంగా ఉంచడం విశేషం. దీనిపై వచ్చే వడ్డీకి చక్రవడ్డీ (యాన్యువల్ కాంపౌండింగ్) వర్తించడం వల్ల కాలం గడిచేకొద్దీ చిన్న మొత్తాలు కూడా భారీ నిధిగా మారుతాయి!
పీపీఎఫ్ ప్రత్యేకతలు, ప్రయోజనాలు..
ఈఈఈ హోదా: పీపీఎఫ్ పథకానికి ఉన్న అతిపెద్ద బలం 'ట్రిపుల్ ఈ' హోదా. అంటే మీరు పెట్టే పెట్టుబడికి (సెక్షన్ 80సీ కింద), దానిపై వచ్చే వడ్డీకి, మెచ్యూరిటీ తర్వాత పొందే మొత్తం సొమ్ముకు.. ఇలా మూడు దశల్లోనూ రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు.
పెట్టుబడి పరిమితి: ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.
లాక్-ఇన్ పీరియడ్: ఈ ఖాతా కాలపరిమితి 15 ఏళ్లు. అయితే, మెచ్యూరిటీ తర్వాత మరో 5 ఏళ్ల చొప్పున ఎన్నిసార్లైనా పొడిగించుకోవచ్చు.
పీపీఎఫ్ ద్వారా కోటీశ్వరులు అవ్వొచ్చా? లెక్కలు ఇలా..
క్రమశిక్షణతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాము.
టెన్యూర్ | వార్షిక పెట్టుబడి | మొత్తం పెట్టుబడి | మెచ్యూరిటీ నాటికి అంచనా |
|---|---|---|---|
| 15 years | ₹1.5 lakh | ₹22.5 lakh | ₹40 lakh |
| 20 years | ₹1.5 lakh | ₹30 lakh | ₹66 lakh |
| 25 years | ₹1.5 lakh | ₹37.5 lakh | ₹1.03 crore |
| 30 years | ₹1.5 lakh | ₹45 lakh | ₹1.5 crore |
పీపీఎఫ్ ద్వారా కోటీశ్వరులు అవ్వాలంటే.. 25 ఏళ్ల సూత్రం!
పీపీఎఫ్ ద్వారా కోటి రూపాయలు సంపాదించడం అసాధ్యమేమీ కాదు అని పైన టేబుల్ స్పష్టం చేస్తోంది. కానీ దానికి పక్కా ప్రణాళిక అవసరం.
మొదటి 15 ఏళ్లు: మీరు ప్రతి ఏటా రూ. 1.5 లక్షలు (నెలకు రూ. 12,500) పీపీఎఫ్లో జమ చేస్తే, 15 ఏళ్ల మెచ్యూరిటీ సమయానికి మీ ఖాతాలో రూ. 40,68,209 ఉంటాయి. ఇక్కడ మీ పెట్టుబడి రూ. 22.5 లక్షలు కాగా, వడ్డీ రూపంలోనే సుమారు రూ. 18.18 లక్షలు వస్తుంది.
20 ఏళ్ల వరకు పొడిగిస్తే: ఖాతా ముగిసిన తర్వాత డబ్బు తీసుకోకుండా మరో 5 ఏళ్లు పొడిగిస్తే, చక్రవడ్డీ ప్రభావంతో మీ నిధి రూ. 66,58,288 కు పెరుగుతుంది.
25 ఏళ్ల మైలురాయి: అదే క్రమశిక్షణతో మరో 5 ఏళ్లు (మొత్తం 25 ఏళ్లు) కొనసాగిస్తే, మీ నిధి రూ. 1,03,08,015 కు చేరుకుంటుంది. అంటే సుమారు రూ. 1.03 కోట్లు మీ సొంతం. ఇందులో మీరు పెట్టిన పెట్టుబడి రూ. 37.5 లక్షలు మాత్రమే, మిగిలిన రూ. 65.5 లక్షలు కేవలం వడ్డీ ద్వారానే లభిస్తుంది.
2026లో పీపీఎఫ్ ఎందుకు మేలు?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు భద్రత కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ హామీ ఉన్న పీపీఎఫ్ కంటే సురక్షితమైన మార్గం మరొకటి లేదు. ముఖ్యంగా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకునే వారికి ఇది వెన్నెముక వంటిది.
పరిమితులు గమనించండి..
పీపీఎఫ్ సురక్షితమే కానీ, ఇది తక్కువ వడ్డీ ఇచ్చే పథకం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత ద్రవ్యోల్బణం దృష్ట్యా చూస్తే, కేవలం పీపీఎఫ్పైనే ఆధారపడటం వల్ల మీ సంపద వృద్ధి పరిమితంగా ఉంటుంది. కాబట్టి, పీపీఎఫ్ను ఒక పునాదిగా వాడుకుంటూనే, అదనపు లాభాల కోసం మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ వంటి ఇతర మార్గాల్లో కూడా పెట్టుబడి పెట్టడం తెలివైన పని.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. పీపీఎఫ్ ఖాతాను ఎవరు తెరవవచ్చు?
భారతీయ పౌరులు ఎవరైనా ఈ ఖాతా తెరవవచ్చు. ఒక వ్యక్తికి కేవలం ఒకే పీపీఎఫ్ ఖాతా ఉండాలి. పిల్లల పేరు మీద కూడా తల్లిదండ్రులు ఖాతా తెరవవచ్చు.
2. మధ్యలో డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చా?
ఖాతా తెరిచిన 7వ సంవత్సరం నుంచి పాక్షికంగా డబ్బు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక నిబంధనలకు లోబడి మాత్రమే ఇది సాధ్యమవుతుంది.
3. పీపీఎఫ్ వడ్డీ రేటు మారుతుందా?
అవును, ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. ఏప్రిల్-జూన్ 2026 త్రైమాసికానికి మాత్రం దీనిని 7.1% వద్దే ఉంచారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


