...
...
Next Story

WhatsApp : వాట్సాప్‌లో నిలిచిపోయిన మీడియా సేవలు! ఫొటోలు, వీడియోలు పంపలేక ఇబ్బందిపడుతున్న యూజర్లు..

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' సేవలకు ఆటంకం కలిగింది. యూజర్లు ఫొటోలు, వీడియోలు, స్టిక్కర్లు పంపలేకపోతున్నారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published on: Aug 4, 2026, 06:14:38 IST
Advertisement

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ‘వాట్సాప్’ సేవల్లో ఒక్కసారిగా అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లు తమ వాట్సాప్ పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. సాధారణ టెక్ట్స్ మెసేజ్‌లు బాగానే వెళుతున్నప్పటికీ.. ఫొటోలు, వీడియోలు, వాయిస్ నోట్స్, స్టిక్కర్ల వంటి మీడియా ఫైళ్లను పంపడం సాధ్యపడటం లేదని యూజర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ సేవలకు తీవ్ర అంతరాయం.. (Representational image)
వాట్సాప్ సేవలకు తీవ్ర అంతరాయం.. (Representational image)

అవుటేజ్ (సేవల అంతరాయం)ను ట్రాక్ చేసే ప్రముఖ వెబ్‌సైట్ ‘డౌన్‌డిటెక్టర్’ సమాచారం ప్రకారం.. వాట్సాప్ నిలిచిపోయిందంటూ వచ్చే ఫిర్యాదులు సోమవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా పెరిగాయి.

ఆండ్రాయిడ్ యూజర్లకే ఎక్కువ సమస్య!

వాట్సాప్‌లో ఏర్పడిన ఈ సాంకేతిక లోపంపై యూజర్లు సోషల్ మీడియా వేదికగా తమ నిరసనను తెలుపుతున్నారు.

“నేను ఎలాంటి ఫొటోలు, వీడియోలు పంపలేకపోతున్నాను. నా దగ్గర ఉన్న ఐఫోన్​లో వాట్సాప్ బాగానే పనిచేస్తోంది కానీ, ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే ఈ సమస్య వస్తోంది. కాబట్టి ఇది కేవలం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే వచ్చిన లోపంలా అనిపిస్తోంది,” అని ఒక వాట్సాప్ వినియోగదారుడు

మరొక యూజర్ స్పందిస్తూ.. "గ్యాలరీ నుంచి ఏ ఫైల్ పంపినా వెళ్లడం లేదు. కేవలం రీ-ట్రై అని మాత్రమే చూపిస్తోంది. లోపం ఏంటో కూడా అర్థం కావడం లేదు. చివరికి స్టిక్కర్లు కూడా వెళ్లకపోవడంతో విసుగొస్తోంది," అని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో పోస్టుల వరద!

ఈ సాంకేతిక లోపంపై ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

"వాట్సాప్‌లో ఫొటోలు వెళ్లడం లేదని, స్టేటస్‌లు అప్‌డేట్ కావడం లేదని కంగారుపడి డేటా ప్యాక్‌లు రీఛార్జ్ చేసుకోవద్దు, ఫోన్ రీస్టార్ట్ చేయవద్దు. ప్రశాంతంగా ఉండండి.. వాట్సాప్ సర్వర్లే డౌన్ అయ్యాయి" అంటూ ఒక నెటిజన్ సరదాగా పోస్ట్ చేశారు.

ఈ అంతరాయంపై వాట్సాప్ అప్‌డేట్లను అందించే 'డబ్ల్యూఏబీటాఇన్ఫో' ఒక పోస్ట్ చేసింది. "ఆండ్రాయిడ్ యూజర్లు కొత్తగా వచ్చిన 2.26.31.2 బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. అందులోని సాంకేతిక లోపం వల్లే మీడియా ఫైళ్లు వెళ్లడం లేదు. త్వరలోనే రాబోయే కొత్త అప్‌డేట్ ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుంది," అని పేర్కొంది.

అయితే, ఈ సేవల అంతరాయంపై వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ లోపాన్ని ఎప్పటిలోగా సరిచేస్తారనే దానిపై కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe