Jantar Mantar Protest : జంతర్ మంతర్ని తిరిగి దక్కించుకున్న నిరసనకారులు- ఆసుపత్రిలో సోనమ్ దీక్ష..
CJP protest : పోలీసులతో ఘర్షణ, వేదిక కూల్చివేత తర్వాత కూడా 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ప్రతినిధులు, విద్యార్థులు జంతర్ మంతర్ను తిరిగి దక్కించుకుని నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో సోనమ్ వాంగ్చుక్ దీక్ష కొనసాగుతోంది.
దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. సోమవారం జరిగిన విధ్సంసం అనంతరం.. 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన నిరసన ప్రదర్శనలు రెండో రోజుకు చేరాయి. సోమవారం నాడు పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి, జంతర్ మంతర్ వద్ద వేదికలు, టెంట్లను పూర్తిగా తొలగించినప్పటికీ, మంగళవారం ఉదయానికే వందలాది మంది విద్యార్థులు మళ్లీ అక్కడకు చేరుకున్నారు. వేదికను తిరిగి నిర్మించి ప్రస్తుతం తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.

రణరంగంగా మారిన పార్లమెంట్ పరిసరాలు..
సోమవారం నాటి 'చలో సంసద్' మార్చ్ తీవ్ర హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. వేలాది మంది విద్యార్థులు ఒకేసారి పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడం వల్ల పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో 100 మందికి పైగా పోలీసులు, 60 మందికి పైగా నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు.
సమస్య సృష్టించిన వారిపై విచారణ వేగవంతం చేశామని, హింసకు పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ఆందోళనల సమయంలో సుమారు 70 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఆసుపత్రిలోనే సోనమ్ వాంగ్చుక్ ఆమరణ దీక్ష..
మరోవైపు, దిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. సీజేపీ ఆందోళనకు మద్దతుగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆసుపత్రిలోనూ కొనసాగుతోంది.
వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ (వీఎంఎంసీ), సఫ్దర్జంగ్ ఆసుపత్రి వైద్యులు మంగళవారం ఉదయం 9 గంటలకు 'హెల్త్ బులెటిన్ 8' విడుదల చేశారు.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం:
- వాంగ్చుక్ శరీరంలో రక్తం గ్లూకోజ్ స్థాయిలు బాగా తగ్గిపోయాయి.
- సీరమ్ పొటాషియం స్థాయి 3.2 mEq/L గా నమోదైంది.
- శరీరంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు తీవ్రంగా పడిపోవడంతో ‘ప్యాన్సైటోపీనియా’ పరిస్థితి ఏర్పడింది.
- ఆయనకు ప్రస్తుతం ఓఆర్ఎస్, పొటాషియం సంబంధిత ఔషధాలను అందిస్తున్నారు.
డాక్టర్లు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ, సెలైన్, గ్లూకోజ్ ఎక్కించుకోవడానికి వాంగ్చుక్ తిరస్కరిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘ నిరాహార దీక్ష వల్ల ఆయన శరీరం డీహైడ్రేషన్కు గురైందని, ప్రాణాపాయం కలగకుండా ఉండాలంటే నిరంతరం వైద్య పర్యవేక్షణ అత్యంత అవసరమని హెల్త్ బులెటిన్లో స్పష్టం చేశారు.
ఈ విధంగా పోలీసుల ఆంక్షలు, ఆసుపత్రి హెచ్చరికలు ఏవీ కూడా నిరసనకారులు, సోనమ్ వాంగ్చుక్ పట్టుదలను తగ్గించలేకపోతున్నాయి. సమస్య పరిష్కారమయ్యే వరకు దిల్లీ వీధుల్లో తమ పోరాటం ఆగేది లేదని సీజేపీ ప్రతినిధులు సైతం స్పష్టం చేస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


