కేరళలో ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నేతల మధ్య డైలాగ్ లు పేలుతున్నాయి. అయితే ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో మాట్లాడిన ఆయన… సీఎం పినరయి విజయన్ ను టార్గెట్ చేశారు.కేరళను మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారంటూ కూడా మాట్లాడారు. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న పినరయి విజయన్ కు… తెలంగాణను పదేండ్ల పాటు పాలించిన కేసీఆర్ మధ్య అనేక పోలికలు ఉన్నాయని వ్యాఖ్యానిచంారు. అవినీతి, అసమర్థ, కుటుంబ పాలన విషయంలో వారిద్దరూ ఒక్కటేనంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఇక కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం పినరయి విజయన్ తీవ్రస్థాయిలో స్పందించారు. రేవంత్ రెడ్డి కేరళ రాష్ట్రం గురించి ఇటీవల చేసిన అవమానకర వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవన్నారు. తన సొంత రాష్ట్రంలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే వ్యక్తి…. కేరళకు సామాజిక ప్రగతి గురించి నీతులు చెప్పడానికి ప్రయత్నించడం విడ్డూరమని దుయ్యబట్టారు. సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి నమూనాను దెబ్బతీయాలని చూస్తున్న వారికి ఆయన కేవలం ఒక గొంతుకగా మారిపోయారని కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డికి విజయన్ సూటి ప్రశ్నలు…
- “కేరళలో అవినీతి ఆరోపణలు చేసే ముందు… ఆయన అధికారిక గణాంకాలను పరిశీలించాలి. భారతదేశంలోనే అత్యంత తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం కేరళ అని ఆయన గమనించలేదా…? నీతి ఆయోగ్ ఎస్డీజీ సూచిక (2023-24)లో కేరళ 79 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ 6వ స్థానంలో ఉంది. మీ సొంత రాష్ట్ర లోపాలను కప్పిపుచ్చుకోవడానికి కేరళను ఎగతాళి చేయడం అత్యంత విచారకరం” అని పినరయి విజయన్ చెప్పారు.
- “నీతి ఆయోగ్ ప్రకారం… కేరళలో పేదరికం రేటు కేవలం 0.55%, ఇది భారతదేశంలోనే అత్యల్పం. 2025 చివరి నాటికి, దేశంలో తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలవనుంది. మరోవైపు, తెలంగాణలో పేదరికం రేటు 5.88%గా ఉంది. కేరళ 95.3% అక్షరాస్యత రేటుతో అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ ఇప్పటికీ 76.9%తో వెనుకబడి ఉంది”
- కాంగ్రెస్కు పరోక్షంగా సహాయపడటానికి కేరళలో రాజకీయ ప్రకటనలపై కోట్లు ఖర్చు పెట్టే బదులు… ఆయన తన సొంత గడ్డ(తెలంగాణ)లో పేదరికాన్ని నిర్మూలించడం, అక్షరాస్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి కదా…? కేరళ శిశు మరణాల రేటు (IMR) 5కి తగ్గింది. అమెరికాలోని 5.6 కన్నా కూడా ఇది మెరుగైనది. తెలంగాణలో IMR దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. మన పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థ కారణంగా…. ఒక మలయాళీ సగటు భారతీయుడి కంటే 5-7 సంవత్సరాలు ఎక్కువ కాలం జీవిస్తున్నాడు.
- 2025 సెప్టెంబర్ 16న తెలంగాణ నుంచి రెవెన్యూ, సర్వే అధికారుల ఉన్నత స్థాయి బృందం కేరళ యొక్క ప్రతిష్టాత్మక డిజిటల్ భూ రికార్డుల వ్యవస్థను అధ్యయనం చేయడానికి తిరువనంతపురాన్ని సందర్శించింది. కానీ కేరళ పాలన నమూనాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ఎగతాళి చేయడం ఏంటి..?
- కేరళ, కేంద్ర ప్రభుత్వాల మధ్య 'సంబంధం' ఉందన్న ఆయన వాదన హాస్యాస్పదమైనది. కేరళ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం యొక్క ఆర్థిక దిగ్బంధనాలకు… రుణ పరిమితుల కోతలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా, బీజేపీకి అసలైన బి-టీమ్గా వ్యవహరిస్తున్నది వెన్నుముక లేని కాంగ్రెస్ పార్టీనే. ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కేరళలో జరుగుతున్న తీవ్ర నిరసనలను ఆయన గమనించలేదా…? లేక మన రాష్ట్రానికి తన పార్టీ చేసిన ద్రోహాన్ని ఆయన కేవలం సమర్థిస్తున్నారా…?
- జీతాలు, పెన్షన్లను పదేపదే ఆలస్యం చేసే ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. కేరళకు నేర్పాల్సింది ఏమీ లేదు. ఖజానాలు మూసివేయబడి, సంక్షేమ పెన్షన్లు నెలల తరబడి పెండింగ్లో ఉన్న యూడీఎఫ్ శకం గతం. పరిపాలన, ప్రజా సంక్షేమం యొక్క నిజమైన పాఠాలు నేర్చుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రికి కేరళ తరపున మేము వినమ్రపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం" అంటూ విజయన్ హితవు పలికారు.